• facebook
  • whatsapp
  • telegram

Education: ఆదర్శ పాఠశాలల్లో చేరాలని ఉందా?

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం, సిరిసిల్ల పట్టణం బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో ఆంగ్ల మాధ్యమ బోధన అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయించింది. ఉన్నత సదుపాయాలతోపాటు పలు అంశాల్లో బాలలను తీర్చిదిద్దుతున్నాయి. ఫలితాల్లోనూ ప్రగతి ఉండటంతో కొన్నేళ్లుగా వాటిల్లో ప్రవేశాలకు డిమాండ్‌ పెరిగింది. రాబోయే విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలతోపాటు 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.


ఇంటర్‌ వరకు ఉచిత విద్య...

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2013 జూన్‌లో ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 38 పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య బోధిస్తున్నారు. మొదట్లో వీటిని ప్రారంభించినప్పుడు వసతుల లేమి ఉండేది. ఈ పరిస్థితి తొందరలోనే సమసిపోయి కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు సమకూరాయి. పదో తరగతితోపాటు ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలను సాధించడంలో జిల్లాల వారీగా మిగిలిన ప్రభుత్వ విద్యాలయాలతో పోలిస్తే ఇవి ముందంజలో నిలిచాయి. ఫలితంగా తల్లిదండ్రులు పిల్లలను వాటిల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏటా చేపట్టే ప్రవేశాలకు డిమాండ్‌ పెరిగింది. బాలికలకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ చదువుతున్న వంద మంది బాలికలకు వసతి అందిస్తున్నారు. వసతిగృహానికి 3 కి.మీల నుంచి ఆపై దూరంగా గల వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తుండగా, ఈ పాఠశాలల్లో ఆయా మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేశారు.


ఫిబ్రవరి 22 తుది గడువు

* ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జనవరి 12 నుంచి ప్రారంభమైంది.

* దరఖాస్తుకు తుది గడువు ఫిబ్రవరి 22.

* హాల్‌టికెట్లను ఏప్రిల్‌ 1 నుంచి విడుదల చేస్తుండగా, ప్రవేశపరీక్ష ఏప్రిల్‌ 7న నిర్వహిస్తారు.

* వివరాలకు telanganams.cgg.gov.inలో సంప్రదించాలి. 

* ప్రవేశ పరీక్షలో గణితం, ఆంగ్లం సబ్జెక్టులకు 25 మార్కుల చొప్పున, సామాన్య, సాంఘికశాస్త్రాలకు కలిపి 25 మార్కులు కేటాయించారు.


ఉమ్మడి జిల్లాలో  వివరాలు.. 

జిల్లా ఆదర్శ పాఠశాలలు
కరీంనగర్‌ 11 
జగిత్యాల 13
పెద్దపల్లి 7
రాజన్న  సిరిసిల్ల   7


నాణ్యమైన విద్యలా: ఆదర్శ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా నిలిచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. చదువుతోపాటు విద్యార్థుల ఉన్నతికి సంబంధించిన అనేక అంశాలను నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- టి.భాస్కర్, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు, ఆదర్శ పాఠశాలల టీచర్స్‌ అసోసియేషన్‌ 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.