* ఉత్తర్వుల రాక ఆలస్యంతో మొదలుకాని వైనం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ నాన్చివేత వైఖరి వల్ల ఎంబీబీఎస్, బీడీఎస్లలో సీట్ల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కొత్త వార్షిక ఫీజుల ఖరారు పై నవంబరు 5 న సాయంత్రమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంకా సీట్ల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడకపోవడంతో సీట్ల భర్తీ కోసం ప్రకటనను ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం జారీ చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ షెడ్యూల్ మేరకు తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశాల కోసం ఇప్పటికే మొదలైన విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 8వ తేదీతో ముగియనుంది. తెలంగాణ విద్యార్థులు ఏపీలో, ఏపీ విద్యార్థులు తెలంగాణలో నాన్-లోకల్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఒక పద్ధతి ప్రకారం జరిగితేనే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నీట్ ద్వారా అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల వివరాలు గత వారమే ప్రకటించింది. ఈ ప్రకటనను అనుసరించి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తరవాత విశ్వవిద్యాలయం మెరిట్ జాబితా ప్రకటిస్తుంది. ఆ జాబితాను గమనిస్తే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్లో సీటు వస్తుందా రాదా అన్నదానిపై విద్యార్థులకు స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రకటన వెలువడకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఉత్తర్వులు వచ్చిన వెంటనే నోటిఫికేషన్!
సీట్ల భర్తీలో రిజర్వేషన్ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రవేశాల నోటిఫికేషన్ ఇస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.