* జేఈఈ మెయిన్ సెక్షన్ బిలో అవకాశం
* మార్కులు మాత్రం 5 ప్రశ్నలకే
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ న్యూమరికల్ 10 ప్రశ్నల్లో ఈసారి అన్నింటికీ జవాబులు గుర్తించే అవకాశం ఉంటుందని తెలిసింది. సాధారణంగా అయిదింటికి మాత్రమే గుర్తించేలా జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) వెసులుబాటు ఉండగా.. తాజాగా అన్నింటికీ సమాధానాలు గుర్తించవచ్చు. ఒక్కో సరైన జవాబుకు 4 మార్కుల చొప్పున అయిదు ప్రశ్నలకు గరిష్ఠంగా 20 మార్కులను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. జేఈఈ మెయిన్ పేపర్-1లో ఒక్కో సబ్జెక్టులో 25 ప్రశ్నల చొప్పున మూడు సబ్జెక్టుల్లో 75 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు పూరించే ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 300. అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఈసారి కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ఈసారి ఫిబ్రవరిలో జరిగే మెయిన్ పేపర్-1లో ప్రతి సబ్జెక్టును సెక్షన్-ఎ, సెక్షన్-బిగా విభజించారు. సెక్షన్-ఎలో ఉండే 20 బహుళైచ్ఛిక ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. సెక్షన్-బిలో 10 న్యూమరికల్ ప్రశ్నలకు అభ్యర్థులు తమకు ఇష్టమైన అయిదింటికి జవాబులు గుర్తించాలని ఎన్టీఏ ఇటీవల పేర్కొంది. ‘ఇపుడు అయిదుకు మించి జవాబులు గుర్తించే వెసులుబాటున్నా 6 లేదా 7 ప్రశ్నలకు మించి సమాధానాలు రాసేందుకు సమయం కేటాయించడం మంచిది కాదు’ అని జేఈఈ శిక్షణ నిపుణుడు కృష్ణ చైతన్య తెలిపారు. సమయం మిగిలితే.. గుర్తించిన జవాబులను ఒకసారి సరిచూసుకోవడం మంచిదని సూచించారు.
ఒకేసారి రుసుం చెల్లించొచ్చు..
ఈసారి ఫిబ్రవరి నుంచి మే వరకు నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్ జరుగుతున్నందున ఒకేసారి నాలుగు విడతలకు పరీక్ష రుసుం చెల్లించవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక విడత పరీక్ష రాసేందుకు ఆసక్తి లేకుంటే దానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు విషయం ముందుగా చెబితే ఫీజు వెనక్కి ఇస్తారు. గతంతో పోల్చుకుంటే ఈసారి 70-80 శాతం మంది మాత్రమే ఫిబ్రవరిలో పరీక్షలు రాసే అవకాశం ఉందని జేఈఈ శిక్షణ నిపుణుడు ఎం.ఉమాశంకర్ తెలిపారు. జేఈఈ మెయిన్కు దరఖాస్తు సమయం జనవరి 16తో ముగియనుందని, ఆలోపు ఇంటర్బోర్డు పరీక్షలపై స్పష్టత వస్తే ఎన్ని విడతలకు ఫీజు చెల్లించాలన్నది విద్యార్థులు నిర్ణయించుకుంటారని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.