‣ 1901 పోస్టుల భర్తీకి ప్రకటన
డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు చక్కటి అవకాశమిది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని సెప్టమ్ (సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్) 1901 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. డిగ్రీ, పదోతరగతి అర్హతతోనే పరీక్ష రాసే అవకాశం ఉండటం ఉద్యోగార్థులకు కలిసొచ్చే అంశం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం...
ఈ నియామక ప్రక్రియ ద్వారా 1075 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి, 826 టెక్నీషియన్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. మొత్తం రెండు స్థాయుల్లో అభ్యర్థులను పరీక్షించనున్నారు. టైర్-1, టైర్-2 పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు.
విద్యార్హత: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు సైన్స్ గ్రూపుల్లో గ్రాడ్యుయేషన్ (లేదా) ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, అనుబంధ సబ్జెక్టుల్లో డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేయొచ్చు. టెక్నీషియన్-ఎ పోస్టులకు పదోతరగతి, తత్సమాన అర్హతతోపాటు ఐటీఐ చేసి ఉండాలి.
పరీక్ష ఎలా ఉంటుంది?
‣ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు టైర్ 1 పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. గంటన్నరలో జవాబులు రాయాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ/ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్/ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. టైర్-2 పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అభ్యర్థికి సంబంధిత సబ్జెక్ట్పై ప్రశ్నలు అడుగుతారు.
‣ టెక్నీషియన్-ఎ పోస్టులకు సీబీటీ, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సీబీటీలో 120 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సెక్షన్ ‘ఎ’లో 40 మార్కులకు క్వాంటిటేటివ్ ఎబిలిటీ/ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్/ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ ‘బి’లో సంబంధిత ట్రేడ్/ సబ్జెక్టుపై 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. మొత్తం గంటన్నరలో జవాబులు రాయాలి. ట్రేడ్ టెస్ట్ను గంట నుంచి రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. అభ్యర్థి నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించే ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ మాత్రమే. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
‣ ఈ పరీక్షల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రక్రియకు పరిగణిస్తారు.
ఎలా చదవాలి?
‣ సాధారణంగా టైర్-1 పరీక్ష ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షలతో సమానంగా ఉంటుంది. ఈ పరీక్ష ఉద్దేశం అభ్యర్థుల వడపోత కావడం వల్ల ప్రశ్నపత్రం కఠినత్వం స్థాయి సులభం నుంచి మధ్యస్థంగా ఉంటుంది. టైర్-2 రాయడానికి మాత్రం సబ్జెక్ట్పై లోతైన అవగాహన తప్పనిసరి. వీటి కోసం డీఆర్డీవో సెప్టెమ్ పేరిట ప్రాక్టీస్సెట్లు ఆన్లైన్లోనూ, బయట కూడా లభిస్తున్నాయి. సిలబస్పై అవగాహన తెచ్చుకుని, టాపిక్లవారీగా చదివాక ఈ సెట్స్ సాధన చేయడం ఉపకరిస్తుంది. చివర్లో పూర్తిస్థాయి మాక్టెస్టులు రాయాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100. మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
జీతభత్యాలు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకూ వేతనం ఉంటుంది. టెక్నీషియన్-ఎ పోస్టులకు జీతం రూ.19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది. ఏడో సెంట్రల్ పే కమిషన్ సూచనలు అనుసరించి ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు ఉంటాయి.
‣ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు. ఇది సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్లోనూ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. టైర్ 1 పరీక్షను స్క్రీనింగ్గా చెప్పొచ్చు. ఇందులో కటాఫ్ మార్కులు పొందిన వారిని టైర్-2 పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులోనూ కటాఫ్ స్కోరు సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం పోస్టు కేటాయిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://www.drdo.gov.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?