‣ తెలుగు రాష్ట్రాల్లో 3700పైగా ఖాళీలు
‣ మొత్తం 40,899
పదో తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష ఉండదు. పదో తరగతి మార్కుల మెరిట్తో ఉద్యోగంలోకి తీసుకుంటారు!
తాజా ప్రకటన ద్వారా నియమితులైనవారు... బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. పోస్టును బట్టి రూ.పదివేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్లకు రూ.పదివేలు చెల్లిస్తారు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
వీరు బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచిని నడిపించాలి. పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
ఈ విధులు నిర్వర్తించేవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్ చెప్పిన పనులు పూర్తిచేయాలి. తపాలా పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలి.
డాక్ సేవక్
వీరు ముఖ్యంగా ఉత్తరాలు పంపిణీ చేయాలి. స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిదే. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చక్కబెట్టాలి.
ఎంపిక
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలుంటాయి. ప్రకటలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివివుండాలి).
వయసు: ఫిబ్రవరి 16, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది).
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 16.
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ ఎన్సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం