‣ టెన్త్ మార్కులతో తపాలా నియామకాలు
‣ ఏపీలో 1355, తెలంగాణలో 981 ఖాళీలు
పదో తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 44228 ఖాళీలున్నాయి. అవకాశం వచ్చినవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. పోస్టును బట్టి రూ.15,000కు తగ్గకుండా రూ. 20,000 వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
డాక్ సేవక్ ఉద్యోగాల్లో చేరినవారికి మూలవేతనం (బేసిక్ పే)తో పాటు కరవు భత్యం (డియర్నెస్ అలవెన్సు)ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 50 శాతం డీఏ అమలవుతోంది. దీని ప్రకారం బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000 మూలవేతనంతోపాటు ఇందులో 50 శాతం రూ.6000 డీఏ కూడా దక్కుతుంది. అంటే మొదటి నెల నుంచే వీరు రూ.18,000 వేతనం అందుకోవచ్చు. దీంతోపాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ, ఏటా ఇంక్రిమెంట్ వేతనంలో కలుస్తుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్లకు రూ.10,000 మూలవేతనంతోపాటు రూ.5000 డీఏ దక్కుతుంది. వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ.15,000 వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ఏబీపీఎం/డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్ఆర్ఏ కూడా దక్కుతుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవారు రోజుకు సుమారు ఐదారు గంటలు పనిచేస్తే సరిపోతుంది.
విధులిలా..
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం): వీరు బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్ను నడిపించాలి. పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం): ఈ విధులు నిర్వర్తించేవాళ్లు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచి పోస్టు మాస్టర్ సూచించిన విధులు నిర్వర్తించాలి. తపాలా పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
డాక్ సేవక్: వీరు ముఖ్యంగా ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిదే. బీపీఎం, ఏబీపీఎం సూచించిన విధులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చక్కబెట్టాలి.
ఎంపిక
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలుంటాయి. ప్రకటలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని పరిశీలించి, ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2...ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
కటాఫ్ ఎంత?
పోస్టుల సంఖ్య ప్రకారం మారుతుంది. ఉదాహరణకు.. మే, 2023 నోటిఫికేషన్లో ఏపీలో 118, తెలంగాణలో 96 ఖాళీలకు గానూ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ పదో తరగతిలో వంద శాతం మార్కులు పొందినవారికే అవకాశం దక్కింది. అప్పుడు తక్కువ పోస్టులు ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం.. జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు 95 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 93 శాతం మార్కులు పొందినవారికి అవకాశం దక్కవచ్చు.
ముఖ్య వివరాలు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి.
వయసు: ఆగస్టు 5, 2024 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారంతా రూ.వంద చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ వాలంటరీ వర్క్తో ఐటీ ఉద్యోగానికి తోవ!
‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!
‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!