• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేవీలో బీటెక్ + కొలువు

క్యాడెట్‌ ఎంట్రీతో అవకాశం 


బీటెక్‌ ఉచితంగా చదువుకుని, సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. భారతీయ నౌకా దళం 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. మహిళలూ అర్హులే. క్యాడెట్‌ ఎంట్రీ అవకాశం వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితమే. చదువు, శిక్షణ తర్వాత సుమారు రూ.లక్ష వేతనంతో విధుల్లోకి తీసుకుంటారు.  


ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌-2024 ర్యాంకు తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంత మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇవి రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల స్టేజ్‌-2 ఇంటర్వ్యూలకు అవకాశం దక్కుతుంది. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.  


   శిక్షణ ఇలా..  

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జనవరి, 2025 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం వీరు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. 


  ఉద్యోగంలో..  

పూర్తిచేసిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచి కేటాయిస్తారు. లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 అదనంగా దక్కుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష కంటే ఎక్కువే వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు.. ఇలా ప్రోత్సాహకాలు పొందవచ్చు. 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు లభిస్తాయి. ఇది శాశ్వత ఉద్యోగం. అందువల్ల వీరు పింఛను పొందుతారు. 


  ముఖ్య వివరాలు  

ఖాళీలు: 40. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌) విభాగాల్లో ఉన్నాయి. వీటిలో 8 పోస్టులు మహిళలతో నింపుతారు. 

విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు జేఈఈ మెయిన్‌-2024లో ర్యాంకు పొందాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జులై 2, 2005 - జనవరి 1, 2008 మధ్య జన్మించినవారు అర్హులు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

Posted Date : 18-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం