• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

ప్రకటన, పరీక్ష సన్నద్ధత వివరాలు



కేంద్రప్రభుత్వ విభాగాల్లో హిందీ అనువాదకుల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జూనియర్‌ హిందీ ట్రాన్స్‌ లేటర్, హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే రాత పరీక్ష ప్రకటన విడుదలైంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ధ్రువ పత్రాల తనిఖీ, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ప్రకటించిన మొత్తం 307 పోస్టుల్లో.. అన్‌రిజర్వ్‌డ్‌కు 157, ఈడబ్ల్యూఎస్‌కు 26, ఓబీసీకి 72, ఎస్సీకి 38, ఎస్టీకి 14 కేటాయించారు. ఎంపికైనవారిని కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్, ఏఐఆర్‌ హెడ్‌ క్వార్టర్స్, సీఏజీ, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, కన్‌జ్యూమర్‌ అఫైర్స్, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, మినిస్ట్రీ ఆఫ్‌ జల్‌శక్తి, మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌ మొదలైన మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో నియమిస్తారు. 


1. జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌: ఈ పోస్టులు 10 ఉన్నాయి. హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేయాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్‌ పాఠ్యాంశంగా ఉండాలి. దీంతోపాటుగా హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. లేదా కేంద్రప్రభుత్వ సంస్థలో రెండేళ్ల అనువాద అనుభవం ఉండాలి. 


2. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌: ఇవి 287 పోస్టులు. హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేయాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించడంలో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. లేదా కేంద్రప్రభుత్వ సంస్థలో మూడేళ్ల అనువాద అనుభవం ఉండాలి. 


3. సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌: 10 పోస్టులు. హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పాసవ్వాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్‌ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి. 


అన్ని పోస్టులకూ 01.08.2023 నాటికి దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులో సవరణలకు అవకాశం ఉంది. మొదటిసారి సవరణకు రూ.200, రెండోసారి సవరణకు రూ.500 రుసుముగా చెల్లించాలి. 


రాత పరీక్షలో..

పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. 
 

పేపర్‌-1: ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది. 

1) జనరల్‌ హిందీ 100 ప్రశ్నలకు 100 మార్కులు. 

2) జనరల్‌ ఇంగ్లిష్‌ 100 ప్రశ్నలకు 100 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. పేపర్‌-1లో ప్రశ్నలు.. అభ్యర్థుల భాష, సాహిత్యం, సరైన పదాలను వాడటం, జాతీయాలు, సామెతలను ఉపయోగించడం, సంక్షిప్తంగా కచ్చితంగా రాయగలిగే నేర్పు మొదలైన విషయాలను పరీక్షించేలా ఉంటాయి. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. 

ఈ పేపర్‌లో అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 25 శాతం, ఇతర కేటగిరీలకు చెందినవారు 20 శాతం మార్కులు సాధించాలి. ఈ మార్కుల ఆధారంగా అభ్యర్థులు పేపర్‌-2కు ఎంపికచేస్తారు. 


పేపర్‌-2: డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఎస్సేకు 200 మార్కులు. వ్యవధి 2 గంటలు. ఈ పేపర్‌లో రెండు ప్యాసేజ్‌లుంటాయి. ఒకదాన్ని హిందీ నుంచి ఇంగ్లిష్‌కు, ఇంకోదాన్ని ఇంగ్లిష్‌ నుంచి హిందీకి అనువదించాలి. వీటి ద్వారా రెండు భాషల్లోనూ అభ్యర్థులకు ఉండే అనువాద, రాత, గ్రహింపు నైపుణ్యాలను పరీక్షిస్తారు. 

పేపర్‌-1, పేపర్‌-2లో సాధించిన మార్కుల ఆధారంగా, కేటగిరీలవారీగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. 

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. 


సన్నద్ధత ఎలా?

పేపర్‌-1లోని ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించాలి. ముఖ్యంగా భాష, సాహిత్యపరమైన పరిజ్ఞానం పెంచుకుంటే ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం సులభం అవుతుంది. 

పేపర్‌-1లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే ఉంటాయి. తగిన విషయ పరిజ్ఞానం ఉంటే తికమక పడకుండా సరైన సమాధానాన్ని ఎంపికచేసుకోగలుగుతారు.  

నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకే సమాధానాలను గుర్తించడం మంచిది. 

పేపర్‌-2లో అభ్యర్థుల రాత నైపుణ్యాన్నీ, గ్రహింపు సామర్థ్యాన్నీ పరీక్షిస్తారు. వ్యాసాన్ని చదివి.. విషయాన్ని అర్థం చేసుకుంటేనే దాన్ని మెరుగ్గా అనువదించగలుగుతారు. 

ఇంగ్లిష్, హిందీ వార్తాపత్రికల్లోని సంపాదకీయాలు (ఎడిటోరియల్స్‌) చదివితే భాష మీద పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సంపాదకీయాల్లో సాధారణంగా జాతీయాలు, అర్థవంతమైన పదబంధాలను ఉపయోగిస్తుంటారు. ఇవి చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.  

బ్యాంక్, ఆర్‌ఆర్‌బీ.. మొదలైన పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్‌ భాషకు సంబంధించిన అంశాలు, కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌లను చదవడం మేలు. 


గమనించాల్సినవి: 

సదరన్‌ రీజియన్‌కు చెందిన తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాల్లో మూడింటిని ఎంపిక చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపే సమయంలోనే ఈ ఎంపిక జరగాలి. తర్వాత పరీక్ష కేంద్రాన్ని మార్చడానికి అవకాశం ఉండదు.  

రాత పరీక్షకు రెండు వారాల ముందే అభ్యర్థులు, వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల పేరు లేనట్లయితే వెబ్‌సైట్‌ ద్వారా వెంటనే సంప్రదించాలి. 

అడ్మిషన్‌ సర్టిఫికెట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని.. ప్రింటవుట్‌ను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. 

రాత పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత అభ్యర్థులకు ధ్రువపత్రాల తనిఖీ నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌. 


దరఖాస్తుకు చివరి తేదీ: 12.09.2023


కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (పేపర్‌-1): అక్టోబరు, 2023


వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Posted Date : 08-09-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.