• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

టీఎసీఎస్‌ ఎన్‌క్యూటీతో అవకాశం



ప్రసిద్ధ కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రకటన వెలువడినప్పుడు.. విడిగా దరఖాస్తు చేసుకుని, పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఒక్కో దానికీ దరఖాస్తు చేయాలంటే.. సంస్థలవారీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే.. చాలా కష్టం. ఇప్పుడీ చింత  లేదు. ఒకే పరీక్షతో పేరున్న సంస్థల్లో కొలువులకు పోటీ పడే అవకాశం వచ్చింది. ఇందుకోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) జాతీయ అర్హత పరీక్ష (నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు) రాస్తే చాలు. వివిధ సంస్థలు, విభాగాల్లో 1.60 లక్షల ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. 


ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ, ఎడ్‌టెక్‌.. ఇలా 23 కంటే ఎక్కువ పరిశ్రమల్లో 170కి పైగా  హోదాల్లో పలు ఉద్యోగాలు అందుతున్నాయి. టీసీఎస్, జియో ప్లాట్‌పాం, ఆసియన్‌ పెయింట్స్, టీవీఎస్‌ మోటార్స్‌.. ఇలా ఎన్నో పేరున్న సంస్థలు జాబితాలో ఉన్నాయి. ఐటీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, ఫుల్‌స్టాక్‌ డెవలపర్, క్లౌడ్‌ ఇంజినీర్‌.. ఇలా 20 కంటే ఎక్కువే హోదాలు దక్కుతాయి. బిజినెస్‌ అనలిస్ట్, హెచ్‌ఆర్‌ స్పెషలిస్ట్, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌.. ఇలా 150కి పైగా నాన్‌ ఐటీ ఉద్యోగాలూ పొందవచ్చు. అవకాశం వచ్చినవారు గరిష్ఠంగా రూ.19 లక్షల వార్షిక వేతనమూ అందుకోవచ్చు. 


ఆసక్తి ఉన్నవారు ముందు టీసీఎస్‌ ఎన్‌క్యూటీ కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత పరీక్ష రాయాలి. అనంతరం అందులో సాధించిన స్కోరుతో టీసీఎస్‌ ఎన్‌క్యూటీ వెబ్‌సైట్‌లోనే పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇతర సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి వాటిలోనూ ఈ స్కోరుతో వివరాలు పంపవచ్చు. 


ఎన్నిసార్లైనా..

పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. మొదటి పరీక్షకు పేరు నమోదు చేసుకున్న 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ఫీజు చెల్లించి, పరీక్ష రాసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా అవకాశం కల్పిస్తారు. ఎక్కువ మార్కులు పొందిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ఎన్‌క్యూటీ పరీక్షల స్కోరూ రెండేళ్ల వరకు చెల్లుతుంది. పరీక్షలన్నీ టీసీఎస్‌ అయాన్‌ కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. ప్రతి రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి ఇవి జరుగుతాయి. పరీక్షల్లో కటాఫ్, పాస్, ఫెయిల్‌ మార్కులు ఉండవు. సాధించిన స్కోరుతో సంతృప్తి చెందితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఉచితంగా లెర్నింగ్‌ కోర్సుతోపాటు ప్రాక్టీస్‌ టెస్టులూ ఉన్నాయి. అలాగే మరికొంత స్వల్ప మొత్తం చెల్లిస్తే విస్తృతంగా కోర్సు మెటీరియల్, ప్రాక్టీస్‌ పరీక్షలు పొందవచ్చు. ఉద్యోగం ఆశించే పరిశ్రమ/ హోదా ప్రకారం పలు పరీక్షలు ఉన్నాయి. వాటిలో అభ్యర్థులు తమకు అవసరమైనవి ఎంచుకోవాలి. ఆసక్తి ఉంటే ఎన్‌క్యూటీలో ఉన్న అన్ని పరీక్షలూ రాసుకోవచ్చు.   


ఎన్‌క్యూటీ కాగ్నిటివ్‌

భిన్న పరిశ్రమలు/ సంస్థల్లో ఐటీ, నాన్‌ ఐటీ ఉద్యోగాలకు కాగ్నిటివ్‌ స్కోరు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షతో వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్‌ నైపుణ్యాలు తెలుసుకుంటారు. పరీక్ష రుసుము రూ.599. ఈ మొత్తాన్ని చెల్లిస్తే 30 గంటలు ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. అలాగే పరీక్షకు ముందు ఒక ప్రాక్టీస్‌ టెస్టూ రాసుకోవచ్చు. కాగ్నిటివ్‌ స్కోరుతో ఒక్క టీసీఎస్‌లోనే యాభై వేలకు పైగా ఐటీ సర్వీసెస్‌/బీపీవో ఉద్యోగాలు ఉన్నాయి. ఇతర కార్పొరేట్‌ సంస్థల్లో ఐటీ/ప్రొడక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో 28,000 కొలువులు పొందవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ విభాగాల్లో 24,300 ఇతర అంటే.. ఆటోమోటివ్, ఈ కామర్స్‌/ ఇంటర్నెట్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, టెలికాం, మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టైజింగ్, ఎడ్‌టెక్‌.. ఇలా పలు పరిశ్రమలకు చెందిన సంస్థల్లో 15,300 ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షతోనే 121 హోదాల్లో లక్షకు పైగా ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. అన్ని విద్యా నేపథ్యాలవారూ ఈ పరీక్షకు అర్హులే.  


రూ.999 చెల్లించి ఎన్‌క్యూటీ కాగ్నిటివ్‌ విత్‌ ప్రిపరేషన్‌ ప్యాక్‌ పొందవచ్చు. దీన్ని తీసుకున్నవారు ఆన్‌లైన్‌లో 60 గంటలు కోర్సు బేసిక్, అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో నేర్చుకోవచ్చు. కాగ్నిటివ్‌ నైపుణ్యాలూ పెంచుకోవచ్చు. అలాగే పరీక్షకు ముందు 3 ప్రాక్టీస్‌ టెస్టులు రాసుకోవచ్చు. సైకోమెట్రిక్‌ టెస్టు, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేలా కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, ప్రిపరేషన్‌ మెటీరియల్‌ పొందవచ్చు. కొన్ని ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలతో.. మీ ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, పని విలువలు.. వీటిని మదింపుచేయడం ద్వారా మీ గురించి తెలిపే నివేదికనూ పొందవచ్చు. 


పరీక్ష ఎలా?

65 మార్కులకు దీన్ని 105 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీలో నంబర్‌ సిస్టం, అరిథ్‌మెటిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 25 నిమిషాలు. వెర్బల్‌ ఎబిలిటీలో ఇంగ్లిష్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 25 మార్కులకు 25 నిమిషాల్లో ప్రశ్నలు పూర్తిచేయాలి. రీజనింగ్‌ ఎబిలిటీలో ఐడెంటిఫయింగ్‌ వర్డ్‌ అండ్‌ న్యూమరికల్‌ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఫిగరల్‌ అండ్‌ ఫ్యాక్చువల్‌ అనాలిసిస్, డెసిషన్‌ మేకింగ్, ప్రపోజిషనల్‌ రీజనింగ్, విజువల్‌/స్పేషియల్‌ రీజనింగ్‌ విభాగాల్లో 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 25 నిమిషాలు. సైకోమెట్రిక్‌లో భాగంగా బిగ్‌ 5 మోడల్‌ ఆధారంగా.. పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ నీడ్‌ థియరీతో మోటివేషన్‌ టెస్టు 30 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. 


ఎన్‌క్యూటీ - ఐటీ 

ఐటీలో అధిక వేతనంతో ఉద్యోగాలు ఆశించేవారు రాయదగిన పరీక్ష ఇది. ఈ విధానంలో అవకాశం వచ్చినవారికి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోడింగ్, ఆప్టిట్యూడ్‌లో అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం రూ.999 ఫీజు చెల్లించాలి. ఇందులో భాగంగానే 30 గంటలు ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఒక ఉచిత ప్రాక్టీస్‌ టెస్టు, సైకోమెట్రిక్‌ టెస్టు, ఇంటర్వ్యూలు ఎదుర్కునేలా కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, మీ నైపుణ్యాలకు సంబంధించిన నివేదిక పొందవచ్చు. ఈ పరీక్షను ఫ్రెషర్లు, రెండేళ్లలోపు పని అనుభవం ఉన్నవారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో స్కోరుతో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు అంటే డెవలపర్, సిస్టమ్‌ ఇంజినీర్, ఐటీ ఎనలిస్ట్‌.. మొదలైనవి పొందవచ్చు. ఫ్రెషర్స్‌ అయితే రూ.8 లక్షల వరకు వేతనం దక్కుతుంది. పార్ట్‌-బి అడ్వాన్స్‌డ్‌ సెక్షన్‌లో నైపుణ్యం చూపినవాళ్లు రూ.7 లక్షలు మొదలు కొని, వీలైనంత అధిక వేతనం పొందవచ్చు. ఈ పరీక్షలో ప్రతిభ చూపినవారు టీసీఎస్‌ నింజా, టీసీఎస్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. 


ఎన్‌క్యూటీ ఐటీ విత్‌ ప్రిపరేషన్‌ ప్యాక్‌ రూ.2298 చెల్లించి పొందవచ్చు. దీనిద్వారా 60 గంటలపాటు బేసిక్, అడ్వాన్స్‌డ్‌ కాగ్నిటివ్‌ స్కిల్స్‌తోపాటు, ఐటీ ఫౌండేషన్‌లో 150 గంటలు ఆన్‌లైన్‌లో అభ్యసించవచ్చు. 3 ప్రాక్టీస్‌ పరీక్షలు, సైకోమెట్రిక్‌ టెస్టు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కోసం కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు పొందవచ్చు.


పరీక్షలో రెండు విభాగాలు

దీనికి 160 మార్కులు. వ్యవధి 195 నిమిషాలు. రెండు విభాగాలుంటాయి. పార్ట్‌-ఎ ఫౌండేషన్‌ సెక్షన్‌లో.. న్యూమరికల్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి 65 మార్కులు. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు. పార్ట్‌-బి అడ్వాన్స్‌డ్‌ సెక్షన్‌లో.. అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌లో ప్రశ్నలు సంధిస్తారు. వీటికి 95 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. సైకోమెట్రిక్‌లో భాగంగా పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ టెస్టు ఉంటాయి. వ్యవధి 30 నిమిషాలు. 


ఎన్‌క్యూటీ - బీఎఫ్‌ఎస్‌ఐ

ప్రైవేటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ విభాగాల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఆశించేవారు రాయదగ్గ పరీక్ష ఇది. ఇందులో ప్రతిభావంతులు రూ.2.5 లక్షల నుంచి రూ.11 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పరీక్ష కోసం రూ.999 చెల్లించాలి. ఇందులో భాగంగా 30 గంటల ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సు ఉచితంగా పొందవచ్చు. పరీక్షకు ముందు ఒక ప్రాక్టీస్‌ టెస్టు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూలు ఎదుర్కోవడానికి కెరియర్‌ రెడీనెస్‌ కోర్సు, నైపుణ్యాలకు సంబంధించి ప్రత్యేక రిపోర్టు పొందవచ్చు. ఫ్రెషర్లు, రెండేళ్లలోపు పని అనుభవం ఉన్నవారు పరీక్ష రాసుకోవచ్చు. వీరికి అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, అకౌంట్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్, డేటా ఎనలిస్ట్, ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్, ఆడిటర్, ఆపరేషన్స్‌ అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్, టెల్లర్, క్యాషియర్‌.. తదితర ఉద్యోగాలు దక్కుతాయి.  


పరీక్ష ఇలా

మొత్తం 140 మార్కులు. వ్యవధి 180 నిమిషాలు. పార్ట్‌-ఎ కాగ్నిటివ్‌లో న్యూమరికల్, వెర్బల్, రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. వీటికి 65 మార్కులు. వ్యవధి 75 నిమిషాలు. పార్ట్‌-బిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ల్లో ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగానికి 75 మార్కులు. వ్యవధి 75 నిమిషాలు. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అవేర్‌నెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఎకానమీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సైకోమెట్రిక్‌ టెస్టు వ్యవధి 30 నిమిషాలు. ఇందులో పర్సనాలిటీ ట్రైట్, మోటివేషన్‌ టెస్టు ఉంటాయి.  


ముఖ్య వివరాలు..

అర్హత: ప్రీ ఫైనల్, చివరి ఏడాది కోర్సులు చదువుతున్న ఏదైనా డిగ్రీ లేదా పీజీ విద్యార్థులు వీటిని రాసుకోవచ్చు. 2018 నుంచి 2024లోపు చదువు పూర్తయిన, పూర్తిచేసుకుంటున్న వారంతా అర్హులే. ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారైతే అనుభవం రెండేళ్లలోపు ఉంటే మేటి అవకాశాల నిమిత్తం వారూ ప్రయత్నించవచ్చు. 

వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27

ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థుల ఈ మెయిల్‌కు అందుతాయి.

పరీక్ష తేదీ: డిసెంబరు 9

తర్వాత నిర్వహించే పరీక్ష తేదీ: జనవరి 14 (దీనికీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు) 

వెబ్‌సైట్‌: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్‌

‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!

‣ బీటెక్‌ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?

‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!

Posted Date : 21-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.