ఇంటర్ పరీక్షల్లో నెగ్గాలంటే నిత్యం చదవడంలో మునిగిపోతాం. దాంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే చదివిందంతా రాయగలమని గుర్తుంచుకోవాలి. ఈ కింది విధంగా చేస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అవసరమైనవి అందుబాటులో: ‘చిందర వందరగా ఉండే విద్యార్థి డెస్క్ అతడి ఆలోచనలను సూచిస్తుంది’ అనే నానుడిని విన్నారా? శాస్త్రీయంగానూ ఇది నిజమే. చదువుకునే ప్రదేశం ఎంత ఎక్కువ సామాను, పుస్తకాలతో ఉంటే విద్యార్థిని అంతగా దృష్టికేంద్రీకరించకుండా చేస్తుంది. పరధ్యానాన్ని కలిగిస్తుంది. ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి, అనవసర వస్తువులను తొలగించాలి. ప్రేరణ కలిగించేవాటిని ఉంచుకోవచ్ఛు సన్నద్ధతలో అవసరమైనవి అందుబాటులో ఉండాలి. తగిన వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి.
ప్రాధాన్య క్రమంలో: సమయాన్ని సరిగా విభజించుకోవడలోనే సగం విజయం ఉంది. ఉన్న సమయం ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టులు, టాపిక్లను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలి.
చిన్న విరామాలు: చాలామంది పరీక్షలు దగ్గరకు వస్తున్నాయనగానే అదేపనిగా పుస్తకాలముందే కూర్చుంటారు. అలా కూర్చున్నా ఒక్కోసారి ఒకే అంశానికి గంటల సమయం కేటాయించాల్సి వస్తుంది. మెదడు అలసిపోయిందనడానికి సూచన అది. అప్పుడు 10- 15 నిమిషాలు విరామం తీసుకుంటే తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు. త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ విరామ సమయాన్ని కచ్చితంగా నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండాలి.
ఆహారం, నిద్ర, వ్యాయామం: పరీక్షలనగానే చాలామంది నైట్-అవుట్లు చేసేస్తారు. హడావుడిగా నాలుగు ముద్దలు తినడం, ఫ్లాస్కులకొద్దీ టీలను తాగేయడం చేస్తుంటారు. మెదడు సరిగా పనిచేయాలంటే తగిన పోషణ కావాలి. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జంక్ఫుడ్కి దూరంగా ఉండాలి. మెదడు ఆరోగ్యానికి నిద్ర ముఖ్యం. తగినంత సమయం నిద్రకు కేటాయించాలి. కొంత వ్యాయామమూ చేయాలి. చల్లగాలిలో నడవడం, మొక్కల మధ్య పచార్లు చేయడం, కొంతసేపు సూర్యరశ్మిలో ఉండటం లాంటివి చేయవచ్ఛు చిన్నచిన్న విరామాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు.
వీటికి దూరం: ఇప్పుడు విద్యార్థులందరి చేతిలోనూ మొబైల్స్, సోషల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి. ప్రతి విషయాన్నీ అందులో పంచుకోవడం సర్వసాధారణమైంది. ఇవీ ఒకరకంగా ఒత్తిడికి కారణమని ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. పదులు, వందల సంఖ్యలో ఉండే స్నేహితుల తాజా విషయాలు ఎప్పటికప్పుడు వాల్పై ప్రత్యక్షమవుతుంటాయి. వాటిపై మొదలయ్యే చర్చలు, చాటింగ్లతో సమయమంతా వృథా అవుతుంది. తెలియని ఆత్రుతకు దారి తీస్తుంది. పరీక్షలు ముగిసే వరకూ వీటికి దూరంగా ఉండటం మంచిది.
పోల్చుకోవద్దు: ఏ ఇద్దరూ ఒక విధంగా ఉండరు, ఆలోచించలేరు. ఒకరు ఒక పాఠాన్ని గంటలో పూర్తిచేయగలిగితే, ఇంకొకరికి రెండు గంటలు.. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ పట్టొచ్ఛు ముందుగా నేర్చుకున్నవారు గొప్ప కాదు, ఆలస్యంగా వచ్చినవారిది తక్కువ స్థాయి కాదు. కాబట్టి, ఇతరులకు ముందుగా వచ్చేసిందని కంగారుపడొద్ధు ఎవరికివారు సొంతంగా ప్రణాళిక వేసుకుని, ఆ మేరకు సిద్ధం కావాలి. పోల్చుకున్న ప్రతిసారీ వెనకబడిపోయామన్న భావన పెరిగి, ఒత్తిడికి దారితీస్తుంది.
పంచుకోండి: బాగా చదివినా, ఆందోళనగా ఉన్నా, చదవడంలో ఇబ్బందిగా అనిపించినా పక్కవారితో పంచుకోవాలి. తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఇలా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనిపించిన వారికి మనసులోని విషయాలను తెలియజేయాలి. వారి సూచనలు సాయపడతాయి. కనీసం మనసులోని భారం తగ్గుతుంది. ఒకరితో పంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే పేపర్పై రాయండి. అదీ మనసులోని ఆందోళనను తగ్గిస్తుంది.
పరీక్షకు సంబంధించిన టాపిక్లు, వాటిలో ముఖ్యమైనవీ, వచ్చినవీ, రానివీ జాబితా రాసుకోవాలి. పూర్తిచేసినవాటిని ఎప్పటికప్పుడు టిక్ చేసుకోవాలి. ఇలా ఒక్కో అంశం పూర్తవుతుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.