వృక్షశాస్త్రం అంటే మొక్కలకు సంబంధించింది. మనం రోజూ అనేక మొక్కలు చూస్తుంటాం. వీటిని మనం చదువుతున్న అంశాలకు అన్వయించుకొని చదవాలి. సిలబస్కు అనుగుణంగా అన్ని పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివితే ప్రాక్టికల్స్ను కూడా సులువుగా చేయవచ్చు. ముఖ్యంగా వృక్షశాస్త్రంలో నిర్వచనాలు, శాస్త్రీయ నామాలు, పటాలు నేర్చుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా అర్థం కాని అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వెయిటేజి ఆధారంగా చదివితే వృక్షశాస్త్రంలో మంచి మార్కులు పొందవచ్చు.
ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. జనరల్ నర్సింగ్, సీడ్ టెక్నాలజీ లాంటి కోర్సుల్లో ఉన్నత విద్య కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. కాబట్టి విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.
ప్రశ్నపత్రం విశ్లేషణ
ఇంటర్ రెండో సంవత్సరం ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. ఈ ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు. మొదటి విభాగం - ఎలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఛాయిస్ ఉండదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విభాగం - బిలో 12 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విభాగం - సిలో 4 దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా రెండింటికి సమాధానాలు రాయాలి.
యూనిట్ల వారీగా వెయిటేజి
* వృక్ష శరీర ధర్మశాస్త్రం: 8 + 4 + 4 + 2 + 2 (20 మార్కులు)
* జన్యుశాస్త్రం: 4 + 2 (6 మార్కులు)
* అణుజీవశాస్త్రం: 4 + 2 (6 మార్కులు)
* జీవసాంకేతిక శాస్త్రం: 8 + 4 + 2 + 2 (16 మార్కులు)
* మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు: 8 + 4 + 2 + 2 (16 మార్కులు)
విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని మొదటి యూనిట్ను క్షుణ్నంగా చదివితే తప్పకుండా 20 మార్కులు సాధించవచ్చు. ద్వితీయ సంవత్సరంలో అంతగా పటాలు ఉండవు. కాబట్టి పటాలు గీయడం రానివారు భయపడాల్సిన అవసరం లేదు.
* 1వ, 5వ, 6వ యూనిట్ల నుంచి 8 మార్కుల ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి.
‣ యూనిట్ - 1లో గ్లైకాలసిస్, క్రెబ్స్, కాల్విన్ (C3) వలయం; చక్రీయ, అచక్రీయ వలయాల నుంచి ఒక ప్రశ్న వస్తుంది.
‣ యూనిట్ - 5లో పునఃసంయోజక డీఎన్ఏ టెక్నాలజీలోని సాధనలు లేదా పద్ధతుల నుంచి ఒక ప్రశ్న వస్తుంది.
‣ యూనిట్ - 6లో మురుగు నీటి శుద్ధి నుంచి ఒక ప్రశ్నను తప్పకుండా అడుగుతారు.
చిన్న యూనిట్లయిన జన్యుశాస్త్రం, అణు జీవశాస్త్రాలను చదివినట్లయితే వీటి నుంచి 6 చొప్పున మొత్తంగా 12 మార్కులు పొందవచ్చు. 1వ, 5వ యూనిట్లను పూర్తిగా చదివితే 35 మార్కులు సాధించవచ్చు. కాబట్టి తక్కువ చాప్టర్లు చదివినా వాటిని శ్రద్ధతో పూర్తిచేయాలి. ప్రతి విద్యార్థి సమయపాలన పాటించాలి. పటాలకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో చదివి పరీక్షలు రాసినట్లయితే వృక్షశాస్త్రంలో 60/60 మార్కులు సులభంగా సాధించవచ్చు.
తొలగించిన పాఠ్యాంశాలు
యూనిట్ - 1: అధ్యాయం - 1 మొక్కల్లో రవాణా
అధ్యాయం - 2 ఖనిజ పోషణ
యూనిట్ - 2: అధ్యాయం - 7 బ్యాక్టీరియా
అధ్యాయం - 8 వైరస్లు
యూనిట్ - 6: అధ్యాయం - 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు