• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణ సాహిత్యాంశాలకే పెద్దపీట!  

ఏ ఉపాధ్యాయ ఉద్యోగానికైనా తెలుగు భాషా సాహిత్యాలు తప్పనిసరి చేశారు. తెలుగు పండితులకు డెబ్బై మార్కులుంటే మిగిలినవారికి ముప్పై మార్కులే. మార్కులు తక్కువే కానీ పాఠ్యాంశాలు దాదాపుగా ఒకటే. వ్యాకరణం, సాహిత్యాంశాలే ఉపాధ్యాయ పరీక్షకు కీలకం.  తెలుగు పాఠ్యప్రణాళిక చూసి నిరాశ చెందడమో, అధైర్యపడడమో సమంజసం కాదు. నిజానికి పాఠ్యాంశాల్లోని సగానికి పైగా ఇంతకుముందు ప్రతి అభ్యర్థీ చదివినవే! వాటితో పనిలేదు కాబట్టి మరచిపోవడం సహజం. బాగా అధ్యయనం చేస్తే 'ఇంతేనా?!' అనిపిస్తుంది.
                   తెలుగు అంటే సాహిత్యమే! సాహిత్యంలో కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం అనేవి భాగాలు. వీటిల్లో మరీ ముఖ్యమైనది కవిత్వం. అందుకే- కవులు- రచయితలు- కావ్యాలు- రచనలు అనే అధ్యాయం విస్తృతంగా ఉంది. ఏయే అంశాలపై దృష్టి ఉంచాలో సిలబస్‌లోనే ఇచ్చారు- 'పాత్రలు, నేపథ్యం, పూర్వాపరాలు, ఇతివృత్తాలు, సందర్భ వాక్యాలు, విశేషాలు'. అయితే అధ్యయనం చేసేటపుడు మరింతగా వింగడించుకుని లోతుగా చదవాలి.
ఉదాహరణకు 'కవులు' అన్నారు. ఏ కవులు? ఎంతమంది? అనే సందేహం వస్తుంది. సామాన్యంగా ప్రసిద్ధ కవులనే చదవాలి కానీ ఎక్కువ మార్కులు రావాలంటే అంతగా ప్రసిద్ధికెక్కని వారినీ తెలుసుకోవాలి.
ఇతివృత్తం అంటే కథ. కథల పేర్లు, అందులోగల ముఖ్య పాత్రలు తెలుసుకోవాలి.

నిగమశర్మ కథ ఎందులోది?
1. మనుచరిత్ర   2. వసుచరిత్ర   3. పాండురంగ మాహాత్మ్యం   4. పారిజాతాపహరణం
జవాబు: 3
కవుల కవిత్వంలో ముఖ్యమైన, ప్రసిద్ధమైన పంక్తులుంటాయి. వాటినే 'సందర్భ వాక్యాలు' అంటారు.
ఉదా: 'కాదేదీ కవితకనర్హం' అన్న కవి? (శ్రీశ్రీ)
విశేషాంశాలు అనే అంశంలో కవుల వివరాలు తెలుసుకోవాలి. కవి అనగానే జన్మస్థలం, ఆస్థాన పదవి, కాలం, బిరుదులు, తొలి రచన, మిగిలిన రచనలు, కవితా గుణాలు చదవాలి. ఈ విధంగా ఒక్కో కవి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే మరొక కవిని చదవాలి. ఈ వివరాలు ప్రాచీన కవులకు ఎక్కువ. ఆధునిక కవుల గురించి అంతగా తెలుసుకోనవసరం ఉండదు.

పాఠాల పరిచయ వాక్యాలు
ప్రక్రియలు అనే అధ్యాయంలోని అంశాల్లో చాలావరకు కవులలో వచ్చేస్తాయి. కథ, నవల, నాటకం, వ్యాసం వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. 8, 9, 10 తెలుగు వాచకాల్లోని పాఠాలు ఈ ప్రక్రియలతోనే ఉంటాయి. అందుకని ఆ పాఠాల పరిచయ వాక్యాలు చదివితే చాలు.
ఆధునిక కవిత్వ ఉద్యమాల గురించి అవగాహన ఉండాలి. పైన పేర్కొన్న ఆధునిక కవులలోకి ఈ ఉద్యమ కవులు వస్తారు. ఏ ఉద్యమం గురించి చదివినా ఉద్యమ ఆశయాలు- నాయకుడు- కావ్యాలు- సందర్భ వాక్యాలు అనేవిధంగా తెలుసుకోవాలి.
* భావకవిత్వం అనగానే ప్రేమ- ప్రకృతి, స్వేచ్ఛ, ఆత్మాశ్రయత్వం వంటివి తెలుసుకుని రాయప్రోలు నాయకుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రచారకుడని తెలుసుకోవాలి.
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' (కృష్ణశాస్త్రి) వంటి ఉక్తులు చాలా ముఖ్యం.
భాషపై నాలుగు అధ్యాయాలున్నాయి. అయితే అన్నింటిని లోతుగా, విస్తారంగా తెలుసుకోనక్కర్లేదు. తెలుగులోని పారశీ, తమిళ, కన్నడ, మరాఠీ పదాలు ముఖ్యం. మాండలిక పదాల గురించి తెలుసుకోవాలి. ఒకే పదం ఏ ప్రాంతంలో ఎలా వాడుకలో ఉందో గ్రహించాలి.
* బేడ- కోస్తాలో ఒకనాటి నాణెం- రూపాయిలో ఎనిమిదో వంతు; రాయలసీమలో పప్పు అని అర్థం- కంది బేడ అంటారు.
* 'పుంటికూర' అనేది గోంగూరకు బదులుగా ఏ మాండలికంలో కనిపిస్తుంది? (తెలంగాణ)
'సాహిత్య విమర్శ' అనే అధ్యాయం తెలుగు పండితులకు చాలా అవసరం. మిగిలినవారు అవగాహన కోసం చదివితే చాలు. 'కావ్య నిర్వచనాల'పై ప్రశ్నలు రావచ్చు.

ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో.
* సామాన్యమైన ప్రశ్నలు (తేలిక ప్రశ్నలు)
* క్లిష్టమైన ప్రశ్నలు

* తికమకపెట్టే ప్రశ్నలు
* లోతైన ప్రశ్నలు ఉంటాయి. వీటిని బట్టి పరీక్షకు సన్నద్ధం కావాలి.
శ్రీశ్రీ కవిత్వపాదాన్ని పోటీ పరీక్షలకు అన్వయిస్తే... వీటిలో ఒకరిని మరొకరు తోసుకుపోవాలి! అప్పుడు ఉద్యోగమనే 'మరో ప్రపంచం'లోకి అడుగుపెడతారు.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌