‘తరగతి అన్వయం, విద్యా మనస్తత్వశాస్త్రం’గా పేర్కొన్న సైకాలజీలో అన్వయం (అప్లికేషన్)తో కూడిన ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నల నిడివి కూడా ఎక్కువ ఉండే ఈ పేపర్.. పరీక్ష విజయంలో కీలక పాత్ర వహిస్తుంది.
మనోవిజ్ఞాన శాస్త్రం
టెట్లో అడిగిన ప్రశ్నల స్థాయికీ, ప్రస్తుతం టీఆర్టీలో అడిగే ప్రశ్నల స్థాయికీ పూర్తిగా భిన్నత్వం ఉండటం ఈ విభాగపు ప్రత్యేకత. అంటే తరగతి గదికి అనుప్రయుక్తమైన ప్రశ్నలుంటాయి.
సిలబస్ ప్రకారం...
అభ్యసనం: బోధన ద్వారా విద్యార్థులలో జరిగే ప్రవర్తనా మార్పులకు సంబంధించిన అంశాలు, విద్యా మనోవిజ్ఞానంలో ప్రాధాన్యం వహించిన పావ్లోవ్, స్కిన్నర్, థారన్డైక్, కోహెలర్, వైగాట్ స్కీ, పియాజెల వివరణాత్మక అనుప్రయుక్తమైన అభ్యసన బదలాయింపు వంటివి ముఖ్యం. విద్యార్థి అభ్యసనానికి ప్రాధాన్యం కలిగిన ప్రేరణ, స్మృతి, విస్మృతితో పాటు భావావేశ మానసిక చలనాత్మక రంగ అంశాలపై మార్కులున్నాయి. వీటన్నింటి అవగాహన, వినియోగం ప్రధానం.
వైయక్తిక భేదాలు ప్రజ్ఞ: ఉపాధ్యాయుడు తన పాఠాన్ని విద్యార్థులందరికీ సఫలీకృతం చేయడానికి ఈ యూనిట్పై అవగాహన తప్పనిసరి. విద్యార్థుల మధ్య ఉండే తేడాలు, విద్యార్థులను ప్రభావితం చేసే ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత వంటివి ముఖ్యమైనవి.
మూర్తిమత్వం: ఇది విద్యార్థి మానసిక సన్నద్ధతకూ, వికాసానికీ ముఖ్యమైనది. ఈసారి నూతనంగా మూర్తిమత్వ పరీక్షలు, మూర్తిమత్వం సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం, సంఘర్షణ, రక్షక తంత్రాలపై ప్రశ్నలు రావొచ్చు.
పెరుగుదల- వికాసం: ఈ యూనిట్ను ఎస్జీటీలకు మాత్రమే కేటాయించారు. పిల్లల వికాసాన్ని తెలుసుకోవడానికి ఈ యూనిట్ అతి ప్రధానమైంది. దీనిలో శిశు, భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక, నైతిక, భాషా వికాసాలు ముఖ్యం. సిలబస్ను అనుసరించి పియాజే, కోల్బర్గ్, నోమ్ఛామ్స్కీ, కార్లో రోజర్స్ సిద్ధాంతం ముఖ్యమైనవి.