బ్యాంకులు ప్రత్యేకమైన విధుల కోసం స్పెషలిస్టు ఆఫీసర్లను తీసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతికతను బ్యాంకింగ్ను అనుసంధానం చేయడానికి ఐటీ నిపుణులు; గ్రామీణ వినియోగదారుల కోసం అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్; న్యాయపరమైన అంశాలకు లా అధికారి; వర్కింగ్ విధానాలు, జీతభత్యాలు, నియామకాలను చూసేందుకు మానవవనరుల సిబ్బంది; ఉత్పత్తులు, పథకాలను వివిధ మార్గాల్లో ప్రచారం చేసేందుకు మార్కెటింగ్ టీమ్.. ఇలా ప్రతి విభాగానికి తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
రోజు రోజుకీ పెరుగుతున్న పోటీని తట్టుకొని సమర్థంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్భాష అధికారి, లా ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ /జనరల్ అవేర్నెస్ ఉంటాయి. లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి ఉద్యోగ పరీక్షలకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మిగతా వాటికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఇస్తారు. మెయిన్స్ పరీక్షలో రాజ్యభాష అధికారి మినహా మిగతా వారికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి.
- డాక్టర్ జి.ఎస్. గిరిధర్