• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!

* ఐడీబీఐలో 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ (ప్రొబేషనరీ ఆఫీసర్‌) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తిచేయాలి. అందులో విజయవంతమైనవారిని విధుల్లోకి తీసుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతుంది. ఉద్యోగంలో ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం చెల్లిస్తారు. 


బ్యాంకు పీవో ఉద్యోగాలు ఎక్కువ శాతం   ఐబీపీఎస్‌ ద్వారానే భర్తీ అవుతాయి. అయితే బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక సేవలు అందించడానికి సాధారణ గ్రాడ్యుయేట్ల ప్రావీణ్యం సరిపోదు. వీటికోసం అప్పుడప్పుడూ ఏడాది కోర్సుతో కూడిన కొలువులకు బ్యాంకులు విడిగా ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ఈ విధానంలో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. ఇలా అవకాశం వచ్చినవారు పీజీ డిప్లొమా తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది కోర్సు ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, ఎంబీఏ పట్టా అందుకునే అవకాశమూ ఉంది. నియామకానికి ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటి ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.


ఆన్‌లైన్‌ పరీక్ష 


మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌లో 60, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 40, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 40, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 60 ప్రశ్నలు చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు.


ఇంటర్వ్యూ, తుది ఎంపిక 


ఆన్‌లైన్‌ పరీక్షలో సెక్షన్లవారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందాలి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం విభాగాలవారీ ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది. 


ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందితేనే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్షలో సాధించిన స్కోరులో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు కలిపి జాబితా రూపొందించి, విభాగాల వారీ మెరిట్‌ ప్రకారం కోర్సులోకి తీసుకుంటారు.


కోర్సులో ఇలా..


మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తిచేయాలి. ఏడాది కోర్సులో.. 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 లక్షలు. దీనికి జీఎస్‌టీ అదనం. అవసరమైన అభ్యర్థులకు ఐడీబీఐ రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. మూడేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకుని, విధుల్లో కొనసాగితే అప్పటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు సమాన మొత్తంలో (రూ.60 వేలు చొప్పున) ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరినవారు మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే రూ.2 లక్షలతోపాటు, రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని వడ్డీతో కలిపి వసూలు చేస్తారు.


స్టైపెండ్, వేతనం 


కోర్సులో ప్రతి నెలా రూ.5000 చొప్పున మొదటి 6 మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ.15,000 చొప్పున ఇంటర్న్‌షిప్‌లో రెండు నెలలు ఇస్తారు. చివరి నాలుగు నెలలు బ్యాంకులో వృత్తిగత శిక్షణ ఉంటుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా బ్యాంకింగ్‌ డిగ్రీ ప్రదానం చేసి, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఓ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం అందుతుంది. దీంతో పాటు అలవెన్సులూ దక్కుతాయి. మూడేళ్ల తర్వాత వీరికి గ్రేడ్‌ ఏ అధికారిగా అవకాశమిస్తారు. 


ప్రశ్నలు ఏ అంశాల్లో?


లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: నాన్‌ వెర్బల్‌ సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్, ఆడ్‌మన్‌ అవుట్, క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్, సింబాలిక్‌ ఆపరేషన్స్, నంబర్‌ ఎనాలజీ, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ క్లాసిఫికేషన్, సిరీస్, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభా గాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్‌బీఐ, బ్యాంక్‌ పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో ప్రాథమికాంశాలు చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి.   

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం- ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే జవాబులు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.  

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్, వ్యాకరణాంశాలు, వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సిననిమ్స్‌-యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంగ్లిష్‌ల్లోని వ్యాకరణాంశాలు బాగా చదివితే ప్రయోజనం.


సన్నద్ధతకు మెలకువలు

1 పరీక్షకు సుమారు 30 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ సమయం ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి అవకాశం. కొత్తవారు బాగా శ్రమిస్తేనే రాణించగలరు. 

2 పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

3 విభాగాల వారీ ఉన్న అంశాలను 20 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. 

4 చివరి పది రోజులూ మాక్‌ టెస్టులు రాయటానికి కేటాయించాలి. 

5 మాక్‌ టెస్టులను ఒకవైపు రాస్తూనే ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నపత్రాలను బాగా సాధన చేయాలి.  

6 ప్రతి ప్రశ్నకూ కేవలం 36 సెకన్ల వ్యవధే ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసి, అక్కడ ఆదా చేసుకున్న సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితేనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు. 


ఎలిమినేషన్‌ టెక్నిక్‌


పరీక్షలో ఎలిమినేషన్‌ టెక్నిక్‌ను ప్రభావవంతంగా అమలు చేయగలగాలి. ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించామనేదానికంటే ఎన్ని సరైన సమాధానాలు రాశామన్నదే కీలకం. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు, తక్కువ సమయమే ఉండే ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో జవాబులు గుర్తించిన ప్రశ్నల పరిమాణం కంటే కచ్చితత్వానికే అధిక ప్రాధాన్యం. 


రుణాత్మక మార్కుల కారణంగా పోటీలో నష్టపడిపోవచ్చు. ఉదాహరణకు ఈ పరీక్షలో ఒక అభ్యర్థి 140 ప్రశ్నలకు సమాధానం గుర్తించారు అనుకుందాం. వీటిలో సరైనవి వంద. సరికానివి 40 ఉంటే.. ప్రతి సరైన జవాబుకీ ఒక మార్కు ఇస్తారు, తప్పు సమాధానికి పావు మార్కు తగ్గిస్తారు కాబట్టి  అతను పొందే మార్కులు 90 మాత్రమే. మరో అభ్యర్థి 120 ప్రశ్నలకే సమాధానం గుర్తించినప్పటికీ.. వాటిలో సరైనవి వంద. సరికానివి 20 ఉంటే అతను పొందే మార్కులు 95. అందువల్ల నెగెటివ్‌ మార్కులు ఉండే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేముందు కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి. 


ఎలిమినేషన్‌లో భాగంగా.. తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగేవే ముందుగా ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ కచ్చితంగా జవాబు గుర్తించగలిగేవాటి సంగతి చూడాలి. జవాబు గుర్తించడమెలాగో తెలిసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకునేవాటి సంగతి చివరలో చూడాలి. అసలేమాత్రం తెలియనివాటిని అలాగే వదిలేయాలి. లాటరీ పద్ధతితో ఉపయోగం లేకపోగా, నష్టమే ఎక్కువని గుర్తించాలి. అంతే కాకుండా కొన్ని పరీక్షల్లో ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చిన సందర్భంలో.. తక్కువ ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చినవారిదే పైచేయి అవుతుంది. 


ముఖ్య సమాచారం 

ఖాళీలు: 600. విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 243, ఓబీసీ 162, ఎస్సీ 90, ఎస్టీ 45, ఈడబ్ల్యుఎస్‌ 60 ఉన్నాయి.

విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: ఆగస్టు 31, 2023 నాటికి 20- 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే ఆగస్టు 31, 1998 - ఆగస్టు 31, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: అక్టోబరు 20


తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: 

ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 

తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

మరింత సమాచారం... మీ కోసం!
‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

‣ లెఫ్టినెంట్‌ హోదాలో మహిళామణులు

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

Posted Date : 20-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌