• facebook
  • whatsapp
  • telegram

2,049 కేంద్ర కొలువులకు ఎస్‌ఎస్‌సీ ప్రకటన

పరీక్ష సరళి, ఎంపిక విధానం వివరాలు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ‘సెలక్షన్‌ పోస్టులు ఫేజ్‌-శ్రీఖిఖి/2024’ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు రాయాలి. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు! 


దేశవ్యాప్తంగా రాష్ట్రాల రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో శాఖలు నడుస్తున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అంటే ఒక్కో తరహా విభాగం/రంగానికి చెందినవి. అందువల్ల వీటిలో సేవలందించడానికి భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడానికి ఎస్‌ఎస్‌సీ ఏటా సెలక్షన్‌ టెస్టు నిర్వహిస్తోంది. పది, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్, టైపింగ్, స్టెనో... ఇలా భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 


పదో తరగతి అర్హతతో..

మెడికల్‌ అటెండెంట్, లేబొరేటరీ అటెండెంట్, క్యాంటీన్‌ అటెండెంట్, ఫీల్డ్‌ వర్కర్, బేరర్‌/కుక్‌ మేట్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, టెక్నికల్‌ ఆపరేటర్, క్లీనర్, ధోబీ, కుక్, శానిటరీ వర్కర్, సెమీ స్కిల్డ్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ (మాసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌), ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్, బైండర్, స్టాఫ్‌ కార్‌ డ్రైవర్, మడ్‌ ప్లాస్టర్, డిస్పాచ్‌ రైడర్‌ పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి పరీక్షతో నియామకాలుంటాయి. ఎంపికైతే లెవెల్‌-1 వేతనం దక్కుతుంది. వీరు ప్రతి నెలా సుమారు రూ.30 వేలు పొందవచ్చు. 



ఇంటర్‌ అర్హతతో..

లైబ్రరీ అటెండెంట్, ఫీల్డ్‌మెన్, స్టాక్‌మెన్, కార్పెంటర్‌ కమ్‌ ఆర్టిస్ట్, లేబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, క్లర్క్, ఎల్‌డీసీ, కాపీహోల్డర్, ఇన్‌సెక్ట్‌ కలెక్టర్, సెక్యూరిటీ మెన్, స్టోర్‌ కీపర్, టెలిఫోన్‌ ఆపరేటర్, హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌), ఫీల్డ్‌ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్‌.. తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీరికి లెవెల్‌-2 వేతనం దక్కుతుంది. నెలకు సుమారు రూ.35 వేలు అందుకోవచ్చు.



డిగ్రీ, ఆపై విద్యార్హతతో..

నర్సింగ్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్, గర్ల్‌ క్యాడెట్‌ ఇన్‌స్ట్రక్టర్, యూడీసీ, గ్రేడ్‌-బీ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్, గ్రేడ్‌-ఏ డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్‌ ఆర్కియాలజిస్ట్, అసిస్టెంట్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ సూపరింటెండెంట్, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌... తదితర పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.50 వేలకు పైగా వేతనం పొందవచ్చు. 


ఎవరు అర్హులు?

అన్ని పోస్టులకూ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. కొన్ని పోస్టులకు పరీక్షతోపాటు టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్‌ లిటరసీల్లో ఎందులోనైనా స్కిల్‌ టెస్టు ఉంటుంది. వయసు నిబంధన పోస్టు ప్రకారం మారుతుంది. జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంది. ఎక్కువ పోస్టులకు గరిష్ఠ వయసు 27/28/30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది. 

పరీక్ష ఇలా: పరీక్ష ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాంశాలు అందరికీ ఒకటే. పోస్టును బట్టి ప్రశ్నల కఠినత్వం, స్థాయిలో మార్పులు ఉంటాయి. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్న పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో.. జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌) విభాగాల్లో 25 చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి గంట. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ పైస్థాయి... ఇలా విద్యార్హతల ప్రకారం 3 రకాల ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు.  

అర్హత సాధించాలంటే: జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాల వారు 20 శాతం మార్కులు పొందాలి. తర్వాతి దశ పరీక్షకు ఎంపిక కావడానికి 5 కంటే తక్కువ ఖాళీలున్న పోస్టులైతే ఒక్కో దానికీ 30 మందిని, 5 కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే 15 మంది చొప్పున తీసుకుంటారు. 


ఏ విభాగం ఎలా?

జనరల్‌ ఇంటలిజన్స్‌: వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రెండు రకాల ప్రశ్నలూ వస్తాయి. పోలికలు భేదాలు, స్పేస్‌ విజువలైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమరీ, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్, ఫిగర్‌ క్లాసిఫికేషన్, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్‌.. మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. సంఖ్యలు, అంకెలు, చిత్రాలు, గ్రాఫ్‌లపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై పట్టు సాధిస్తే వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.  

జనరల్‌ అవేర్‌నెస్‌: పర్యావరణం, సమాజంపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రోజువారీ సంఘటనలు/ వర్తమానాంశాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాలావరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితం నుంచే ఉంటాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, శాతాలు, అంకెల మధ్య సంబంధం, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కుల సాధన కష్టమేమీ కాదు. 

పైన పేర్కొన్న అంశాలు పదో తరగతి విద్యార్హతతో నిర్వహించే పోస్టులకు సంబంధించినవి. అదే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ అర్హతలతో నిర్వహించే పరీక్షలకు ఇవే అంశాల్లో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. అదనంగా మరికొన్ని అంశాలనూ చదవాలి. 


సన్నద్ధత పద్ధతి 

సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని గమనించాలి.

తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. అనంతరం సంబందితÅ అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. 

పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అధ్యయనంలో మార్గదర్శిగా భావించాలి. వీటిని గమనిస్తే.. ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి...మొదలైనవి తెలుసుకోవచ్చు.

‣ ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని విభాగాలూ చదువుకుంటూ, ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తున్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించుకోవాలి. 

పరీక్షలకు రెండు వారాల ముందు నుంచి కనీసం రోజుకి ఒకటైనా మాక్‌ పరీక్షలు రాయాలి. వాటిని తప్పనిసరిగా మూల్యాంకనం చేసుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతున్న అంశాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు.

వర్తమాన వ్యవహారాలకు.. వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. ఈ విభాగంలో.. అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు బాగా చదవాలి. ఇటీవల జరిగిన ఎన్నికలు, క్రీడలపై అధిక దృష్టి సారించాలి. 

ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌.. ఇటీవల నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి.


పుస్తకాలు: అభ్యర్థులు తమకు సౌకర్యవంతమైన రచయిత, పబ్లిషర్ల పుస్తకాలను ఎంచుకోవచ్చు. ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్నే వీలైనన్నిసార్లు చదవడం మేలు. ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ - టాటా మెక్‌ గ్రాహిల్స్‌ లేదా చాంద్‌ పబ్లికేషన్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటిటివ్‌ ఎగ్జామ్స్‌- ఆర్‌.ఎస్‌.అగర్వాల్, జనరల్‌ నాలెడ్జ్‌ - లూసెంట్స్‌ తీసుకోవచ్చు. 

వంద ప్రశ్నలు. మొత్తం వ్యవధి 3600 సెకన్లు. అంటే ప్రతి ప్రశ్నకూ 36 సెకన్ల సమయమే అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం. అలాగే దీని తర్వాత జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రశ్నలకు సమయం సరిపోదు. అందువల్ల జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసుకుని, అక్కడ మిగిల్చిన సమయాన్ని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటలిజెన్స్‌లకు కేటాయించుకోవాలి. 


 ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: మార్చి 18 రాత్రి 11 గంటల వరకు. 

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. 

పరీక్షలు: మే 6 నుంచి 8 వరకు. 

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. ఏపీలో.. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్ర సంస్థలో ట్రెయినీ ఇంజినీర్‌లు

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.