* సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
* యూపీఎస్సీ ప్రకటన విడుదల
శాసించే ఉద్యోగానికి యూనిఫారం తోడైతే ఆ లెక్క వేరుగా ఉంటుంది. అందులోనూ కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించడమంటే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి పెద్ద చదువులతో పనిలేదు. సాధారణ డిగ్రీ సరిపోతుంది. రాతపరీక్షలో ప్రతిభ చూపి, ఫిజికల్ టెస్టులో సత్తా చాటి, మౌఖిక పరీక్షలో మెప్పిస్తే అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగం ఖాయమైనట్లే! యూపీఎస్సీ ఏటా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తుంది. తాజాగా 2020 ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు..
పోలీస్ శాఖలో అత్యున్నత ఉద్యోగానికి సివిల్ సర్వీసెస్ ప్రధాన రహదారి లాంటిది. అది కాకుండా వేరే దారులూ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తారు. వీరికి గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా దక్కుతుంది. సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) / డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)తో సమాన హోదా ఉన్న పోస్టులివి.
పాతికేళ్లలోపు పట్టభద్రులెవరైనా అసిస్టెంట్ కమాండెంట్ కొలువులకు ప్రయత్నించవచ్చు. మహిళలూ ఈ పరీక్షను రాయవచ్చు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులను రూపొందించారు. ఎంపికైనవారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఎపీఎఫ్)- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లో విధులు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో వీరు సబంధిత విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్థాయికి చేరుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఖాళీలు ఏ విభాగాల్లో?
మొత్తం ఖాళీలు: 209 (బీఎస్ఎఫ్: 78, సీఆర్పీఎఫ్: 13, సీఐఎస్ఎఫ్: 69, ఐటీబీపీ: 27, ఎస్ఎస్బీ: 22)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి
కనిష్ఠంగా 20 ఏళ్లు; గరిష్ఠంగా 25 ఏళ్లు. రిజర్వ్డ్ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుల గడువు: సెప్టెంబరు 7 సాయంత్రం 6 గంటలు.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
మిగిలినవారికి రూ. 200
పరీక్ష తేదీ: డిసెంబరు 20
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
వెబ్సైట్లు: www.upsc.gov.in, www.upsconline.nic.in
ఎంపికైతే...
ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి ఆ విభాగాన్ని అనుసరించి సంబంధిత కేంద్రాల్లో ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఉదాహరణకు సీఐఎస్ఎఫ్కి ఎంపికైనవారికి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ (ఎన్ఐఎస్ఎ)- హైదరాబాద్లో 53 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. ఇందులో భాగంగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా నక్సలైట్లు, ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ ప్రమాదం ఉన్నచోట ప్రత్యక్షమవుతారు. చేపట్టబోయే కార్యక్రమాలపై వ్యూహరచన చేస్తారు. అవసరమైనచోట ఎన్నికల విధులనూ నిర్వర్తిస్తారు. వీరికి రూ.56,100 (లెవెల్ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే దాదాపు లక్ష రూపాయల వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
మొత్తం రెండు పేపర్లు
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్కు 250 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటలిజెన్స్ అంశాల నుంచి 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులున్నాయి. అంటే తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. పేపర్-2 మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-1లో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్-2లో కనీసం 25 శాతం అంటే 50 మార్కులు తప్పనిసరి.
ఫిజికల్ పరీక్షలు
రాత పరీక్షలో అర్హులకు ఫిజికల్ స్టాండర్డ్ / ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. పురుషులు 165 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెం.మీ. పెరగాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 46 కి.గ్రా. బరువు తప్పనిసరి. వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్ జంప్లో పురుషులు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు జంప్ చేయగలగాలి. షాట్పుట్లో 7.26 కి.గ్రా. గుండును పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్పుట్ లేదు.
ఇంటర్వ్యూ
ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)కు పిలుస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.
సన్నద్ధత ఇలా
1. సిలబస్లోని అంశాలను ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోంచి చదువుకోవాలి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ .. వీటన్నింటినీ ఈ పుస్తకాలతో పూర్తిచేసుకోవచ్చు. ముఖ్యంగా 8 నుంచి 12 తరగతుల పుస్తకాలను బాగా చదువుకోవాలి.
2. జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ పేపర్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అందువల్ల రాయడం అలవాటు చేసుకోవాలి. వ్యాసాన్ని బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని చాలా ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థల నివేదికలు బాగా చదవాలి.
3. పాత ప్రశ్నపత్రాలు బాగా పరిశీలించాలి. ఇవి యూపీఎస్సీ వెబ్సైట్లో లభిస్తాయి. ఆయా అంశాలు, విభాగాల వారీ ప్రాధాన్యం తెలుసుకుని అనుగుణంగా సన్నద్ధం కావాలి.
4. వర్తమాన అంశాలు, ఎస్సే ప్రశ్నలకు జవాబు రాయాలంటే ఏదైనా ఆంగ్ల పత్రికలోని ముఖ్యమైన వ్యాసాలు చదవాలి. ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి.
ఈ అంశాల్లో ప్రశ్నలు..
పేపర్ 1: ఆరు అంశాల్లో అభ్యర్థి అవగాహన, నైపుణ్యాలను పరీక్షిస్తారు. మెంటల్ ఎబిలిటీ విభాగంలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్లో భాగంగా దైనందిన జీవితంలో సైన్స్తో ముడిపడే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన సంఘటనల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. ఇందులో భాగంగా నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ...మొదలైనవాటికి ప్రాధాన్యం ఉంటుంది. మరో విభాగం ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన, భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. భారత దేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమ సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. చివరి అంశమైన జాగ్రఫీలో భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంటుంది.
పేపర్ 2: రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, అనలిటికల్ ఎబిలిటీ మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. పార్ట్- బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్, ప్రెసీ, లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.
కటాఫ్ ఇలా
పోస్టుల సంఖ్య, ఆశావహులు, ప్రశ్నపత్ర కఠినత్వం బట్టి కటాఫ్ మారుతుంది. అయితే జనరల్ కేటగిరీలో 55 శాతం మార్కులు సాధించినవారు తప్పక విజయం అందుకోవచ్చు. 2018 పరీక్షలో జనరల్ కేటగిరీలో పేపర్-1లో కటాఫ్ మార్కులు 95 గా ఉన్నాయి. కానీ 2017లో కటాఫ్ మార్కు 124. 2018లో పేపర్ 1, 2లు కలిపి 166 మార్కులు సాధించినవారు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 2017లో 206 సాధించినవారికి ఆ అవకాశం దక్కింది. మొత్తం మీద రాతపరీక్ష + ఇంటర్వ్యూ కలుపుకుని 600కు గానూ 282, ఆపైన మార్కులు పొందిన జనరల్ అభ్యర్థులు 2018లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2017లో జనరల్ కేటగిరీలో 316 మార్కులు పొందినవారికి ఉద్యోగం దక్కింది.