‣ మార్కుల సాధనకు మెలకువలు
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు హాజరవుతారు. పరీక్ష ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే ఈ మౌఖిక పరీక్షలు ప్రారంభమవుతాయి. కీలకమైన ఈ తుది అంచెపై సరైన అవగాహన తాజా అభ్యర్థులకూ, సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులకూ తప్పనిసరి.
సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మౌఖిక పరీక్షకు యూపీఎస్సీ ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. ఎందుకంటే.. సెలక్షన్/ రిక్రూట్మెంట్ విధానంలో.. రాత పరీక్ష ప్రాథమికంగా అభ్యర్థి మేధా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది. అంతేగానీ అభ్యర్థి స్వభావం, సహానుభూతి, భావోద్వేగ ప్రజ్ఞ, ప్రేరణాత్మక వైఖరి, విలువల వ్యవస్థ గురించి తెలియజేయదు. ప్రిలిమినరీలో ఉండే ఆబెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అభ్యర్థికి ఉండే విస్తృత ఆలోచనా పరిధినీ, జ్ఞాపకశక్తినీ ప్రతిబింబిస్తాయి. మెయిన్లోని షార్ట్ ఆన్సర్ తరహా ప్రశ్నలు.. ప్రత్యేక అంశాలను సాధారణీకరించి, సహేతుకంగా రాసే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. అయితే ప్రిలిమినరీగానీ, మెయిన్గానీ.. అభ్యర్థి సివిల్ సర్వీసెస్ కెరియర్కు సరిపోతాడా లేదా అనే విషయంలో స్పష్టతను అందించలేవు. అభ్యర్థి ప్రవర్తనాపరమైన లక్షణాలను తెలుసుకునే విధంగా రాత పరీక్షలో ప్రశ్నలు అడగలేరు. అభ్యర్థి అర్హుడో కాదో తెలుసుకోవడానికి పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆదర్శవంతమైన పద్ధతి.
మార్కులూ.. ర్యాంకులూ
గత కొన్నేళ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల మార్కులను విశ్లేషిస్తే..
1. టాపర్లు అందరూ మెయిన్స్లోనూ, ఇంటర్వ్యూలోనూ ఎక్కువ మార్కులు సాధించారు. (టాప్ 50 లేదా 100 ర్యాంకులు సాధించినవారు)
2. ఇంటర్వ్యూలో కొన్ని మార్కులు అధికంగా సాధించినా దానివల్ల 10 ర్యాంకుల కంటే ఎక్కువ తేడా వస్తుంది.
3. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో 2 లేదా 3 మార్కులు తగ్గినా.. 3 లేదా 4 ర్యాంకులు తగ్గిపోతాయి. ఈ తేడా వల్ల ఐఏఎస్ దక్కకుండా ఇతర సర్వీసులకు పరిమితం కావాల్సి వస్తుంది.
అంచనా ఇలా..
అభ్యర్థులను సరిగా అంచనా వేయడానికి ఇంటర్వ్యూ బోర్డు కింది అంశాలను పరిశీలిస్తుంది.
‣ ప్రపంచంలో తన చుట్టూ జరుగుతోన్న ఘటనల పట్ల అభ్యర్థి ఆసక్తి కనబరుస్తున్నాడా? రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవితం, క్రీడలు, ఆరోగ్యం మొదలైన రంగాల్లోని తాజా పరిణామాలను పరిశీలిస్తున్నారా? వర్తమాన విషయాలను వార్తాపత్రికలను చదివి తెలుసుకుంటున్నారా లేదా?
‣ వార్తలను విశ్లేషించి సరైన నిర్థరణకు వస్తున్నారా.. లేదా?
‣ నిర్దిష్ట విషయం సమాజంపై ప్రభావం చూపేదా, సాధారణ అంశమా అనేది అంచనా వేయగలుగుతున్నారా?
‣ అతడి/ఆమె ప్రజెంటేషన్లో తగినంత స్పష్టత ఉందా?
‣ సమస్యల పట్ల దృక్పథం ఎలా ఉంది? ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశమా? ఆదర్శవాదమా?
‣ సమస్యలకు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తున్నారు?
‣ సమస్యను సరిగా అర్థంచేసుకుని తన అభిప్రాయాన్ని వెల్లడించగలుగుతున్నారా? లేదా ఎక్కడో చదివినదాన్ని చిలకలాగా వల్లె వేస్తున్నారా?
‣ విషయాన్ని నిర్మాణాత్మక దృక్పథంతో చూస్తున్నారా? ఆశావాదమా.. నిరాశావాదమా?
‣ మొండిఘటం అనే ముద్ర వేసుకుంటున్నారా? లేదా తన అభిప్రాయాన్ని మార్చుకునే దృక్కోణంతో ఉన్నారా?
‣ చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తారా, నిర్లక్ష్యంగా పర్యవసానాల గురించి ఆలోచించకుండా స్పందిస్తారా?
‣ తొందరపాటుగా నిర్థారణకు వచ్చేస్తారా, పూర్తి సమాచారం అందేవరకూ నిర్ణయాలను వాయిదా వేస్తారా?
‣ సహాయపడటానికి పరిధి దాటి వ్యవహరిస్తారనే అభిప్రాయం కలిగిస్తారా, పరిదికి లోబడి తన విధులను నిర్వర్తిస్తారా?
‣ మొత్తానికి అధికారిగా విజయం సాధిస్తారా, సాధించరా?
ఎలా ముందడుగు వేయాలి?
ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థులను తికమక పెడుతూ సందిగ్ధ పరిస్థితిలో పడేయాలని ప్రయత్నిస్తుందనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజంకాదు. మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి మీరెంత వరకూ అర్హులనే విషయంలో ఒక అంచనాకు రావాల్సిన బాధ్యత బోర్డుకు ఉంటుంది. ఇంటర్వ్యూ సందర్భంగా...
‣ సహజంగా ఉండాలి. మీ వైఖరిలో విశ్వాసం కనిపించాలిగానీ మొండితనం కాదు. ఉద్యోగం చేయగలరనే నమ్మకం మీ మీద మీకే లేనప్పుడు బోర్డుకు కలుగుతుందని అనుకోకూడదు. మీ బలహీనతల గురించి క్షమాపణలు చెప్పకూడదు. మీ బలాలను బహిర్గతపరచడానికి ప్రయత్నించాలి. బోర్డు సానుకూల ప్రదర్శనకు ఆసక్తి చూపిస్తుందిగానీ ప్రతికూల ప్రదర్శనకు కాదు. మొండిగా ప్రవర్తిస్తే బోర్డు సభ్యులెవరికైనా కోపం వస్తుంది. అవాస్తవమైన బలాలను ప్రదర్శిస్తూ, బలహీనతలకు ముసుగువేయాలని చూడకూడదు.
‣ సౌకర్యంగా, నిటారుగా కూర్చోవడం సాధన చేయాలి. అలాగని మరీ బిగుసుకుపోకూడదు. నిర్లక్ష్యంగా కూర్చోవడం వల్ల ఇతర విషయాల్లోనూ అలాగే ఉంటారనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సందర్భం ప్రాధాన్యాన్ని మీరు గుర్తించనట్టుగా అభిప్రాయపడతారు.
‣ చర్చనీయాంశాన్ని జోక్గా తీసుకోకూడదు. పొడిపొడిగా మాట్లాడకూడదు. మీ వైఖరి సివిల్స్ స్థాయికి తగినట్టుగా ఉండాలి. బోర్డుకు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని వాళ్లు వృథా చేయాలని అనుకోరు. అలాగే మీరు కూడా వృథా చేయకూడదు.
‣ అనుభవం, నైపుణ్యాల గురించి అతిశయంగా మాట్లాడకూడదు. మెయిన్స్ దరఖాస్తులోని సమాచారం, ఇతర విషయాల ఆధారంగా మీ గురించి కొంత సమాచారాన్ని ఇంటర్వ్యూ ముందు రాయమని అడగొచ్చు. మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని బోర్డు అనుకోవచ్చు.
‣ ఆధిపత్యం ప్రదర్శించకూడదు. అంతా మీరే అయ్యి మాట్లాడాలని అనుకోకూడదు. బోర్డు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికే మొత్తం ఇంటర్వ్యూ సమయాన్నంతా వెచ్చించకూడదు.
‣ ఇంటర్వ్యూకు సమారుగా అరగంట సమయం ఉండొచ్చు. కాబట్టి మీ దృష్టిని మొత్తం ఇంటర్వ్యూ మీదే కేంద్రీకరించాలి. ఏదైనా సమస్య లేదా ప్రశ్నను అడిగినప్పుడు ఆ సభ్యుడి మీదే ఏకాగ్రత ఉండాలి. అతడిని ఉద్దేశిస్తూ సమాధానం చెప్పాలి. అదే సమయంలో మిగతావారిని పూర్తిగా విస్మరించకూడదు.
‣ అంతరాయం కలిగించొద్దు. ఒక సమస్యను గురించి విశ్లేషించమని బోర్డు సభ్యుడు మీకు సూచిస్తూ ఉండొచ్చు. ఈలోగానే మీరు మధ్యలో కల్పించుకుని అంతరాయం కలిగించకూడదు. సమస్యను గురించి వివరించి.. ప్రశ్న అడిగే వరకూ ఆగాలి.
‣ ప్రశ్నను అర్థంచేసుకోవాలి. ప్రశ్న పూర్తిగా అర్థమయ్యేంతవరకూ సమాధానం చెప్పడానికి ప్రయత్నించకూడదు. వివరంగా లేకపోయినట్లయితే బోర్డు సభ్యుడిని అడగాలి. అంతేగానీ చిన్న విషయాల్లో మొండిగా ప్రవర్తించకూడదు.
‣ హడావిడిగా కాకుండా వెంటనే సమాధానం చెప్పాలి. ఓరల్బోర్డ్ రేటింగ్ షీట్లో.. ‘అభ్యర్థి వెంటనే సమాధానం చెప్పాడు’. ‘అభ్యర్థి సమాధానం చెప్పడానికి జంకాడు’. అని రాస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత త్వరగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి. కానీ చెప్పాలనే తొందరలో పొరపాటు సమాధానం చెప్పకూడదు.
‣ సమాధానం క్లుప్తంగా ఉండొచ్చు. కానీ సమాధానంలోనే మళ్లీ ప్రశ్న ఉండకూడదు. ఇలాచేస్తే మీరే నష్టపోతారు. మీ సమాధానం కంటే వేగంగానే బోర్డు సభ్యుడు మరో ప్రశ్న వేయగలరు.
‣ బోర్డు సభ్యులకు నచ్చే విధంగా సమాధానాన్ని మలచకూడదు. అలా సమాధానాలు చెబితే.. దాన్ని గుర్తిస్తారు. ఈ పద్ధతి మీ స్థాయిని దిగజారేలా చేస్తుంది.
‣ తరచూ బోర్డు సభ్యులెవరైనా మీకు విరుద్ధంగా మాట్లాడుతుండవచ్చు. ఇలాచేస్తూ మీ అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారో లేదో తెలుసుకుంటారు. చర్చ మొదలుపెట్టకూడదు. అలాగే అర్థాంతరంగానూ ఆపేయకూడదు. రక్షణాత్మకంగా వ్యవహరించి మీ అభిప్రాయాన్ని సమర్థించుకోవాలి. మొండితనానికీ రక్షణాత్మకంగా వ్యవహరించడానికీ మధ్య సన్నటి విభజన రేఖ ఉంటుంది. దాన్ని చెరిపేయకూడదు.
‣ మీరొక ప్రకటన చేసి తర్వాత.. దాంట్లో తప్పును గుర్తించినట్లయితే దాన్ని ఒప్పుకోవాలి. తొందరగా చెప్పాలనే కంగారులో తప్పు చేశారని, ఆ తర్వాత దాన్ని తెలుసుకున్నారనే విషయాన్ని బోర్డు గుర్తిస్తుంది.
‣ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మొదటి ప్రశ్న దానికి సంబంధించినదే ఉంటుంది. సమాధానం చెప్పాలిగానీ దానిపైన ఎక్కువ చర్చ జరగకుండా చూడాలి. కొత్త ఉద్యోగానికి మిమ్మల్ని పరీక్షిస్తారుగానీ ప్రస్తుతం చేస్తున్న దానికి కాదు. చేయబోయే ఉద్యోగం పైనే దృష్టిని కేంద్రీకరించి సమాధానాలు చెప్పాలి.
‣ మితిమీరిన వ్యాఖ్యలు చేయకూడదు. సమాధానాలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. వ్యక్తిగత అనుభవాల నుంచి ఉదాహరణ చెప్పాలన్నా దాన్ని కుదించి చెప్పాలి. ప్రాధాన్యంలేని అంశాలను వదిలేయాలి.
ఇంటర్వ్యూలో మీ ప్రదర్శన బాగుండాలనే బోర్డు కోరుకుంటుంది. మీరు ఒత్తిడికి గురవుతారనీ వారికి తెలుసు. కానీ అలాంటి పరిస్థితులను అధిగమించి మీరెలా సమాధానం చెబుతారనే విషయాన్ని గమనిస్తారు. సంతృప్తికరమైన ప్రదర్శన ద్వారా సివిల్ సర్వీసెస్ ఉద్యోగానికి మీరు సరిపోతారనే భరోసాను బోర్డుకు కల్పించాల్సిన బాధ్యత మీదే. సరైన సన్నద్ధత ఉంటే అది మీ ప్రదర్శన మెరుగ్గా ఉండటానికి తోడ్పడుతుంది.
ఐదు అంశాలు
సివిల్స్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఐదు అంశాల నుంచి ప్రశ్నలను ఆశించవచ్చు.
1. వ్యక్తిగతం: పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, అది ఏ జిల్లాలో ఉంది, ఆ జిల్లా రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల గురించి అడిగే అవకాశం ఉంటుంది. ‘ప్రభుత్వ రంగంలో కెరియర్ను ఎందుకు ఎంచుకున్నారు’ అనే అంశంపైనా ప్రశ్నించే అవకాశముంది.
2. విద్యాపరంగా: ప్రాథమిక విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలూ అడగొచ్చు. కోర్సు పూర్తవటానికీ, సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరుకావడానికీ మధ్య ఎక్కువ విరామం వస్తే గ్రాడ్యుయేషన్లోని కోర్ సబ్జెక్టులను పునశ్చరణ చేసుకోవాలి. విద్యార్హతలకు సంబంధంలేని ఆప్షనల్ను ఎంచుకున్నవారు మరింతగా సబ్జెక్టు పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ రంగంలో తాజా పరిణామాల అవగాహన మరింత ముఖ్యం.
3. ఆప్షనల్ సబ్జెక్టు: దీంట్లో లోతైన ప్రశ్నలను సంధించే అవకాశం తక్కువ. మెయిన్ పరీక్షలో అభ్యర్థులు ఎలాగూ వివరణాత్మక సమాధానాలు రాస్తారు. అయినప్పటికీ కొన్ని ప్రాథమిక ప్రశ్నలూ, తాజా పరిణామాలను గుర్తుపెట్టుకోవాలి.
5. అభిరుచులు: ఖాళీ సమయంలో ఏంచేస్తారని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీకెలాంటి హాబీలూ లేనట్లయితే నిజాయతీగా చెప్పేయాలి. ఉంటే.. దానికి సంబంధించి అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
ప్రశ్నల స్వభావంలో గత కొన్నేళ్లుగా కొంత మార్పు వచ్చింది. అభ్యర్థి ‘నిజమైన వ్యక్తిత్వాన్ని’ వెలికితీసే విధంగా యూపీఎస్సీ ప్రశ్నలను సంధిస్త్తోంది. నిగ్వేకర్ కమిటీ సూచనల మేరకు.. అభ్యర్థి, ప్రవర్తన, వ్యక్తిత్వం, విలువ ఆధారిత ప్రశ్నలు అడగడానికి ఇంటర్వ్యూ బోర్డు ప్రయత్నిస్తోంది.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ గ్రూప్ 1, 2 సక్సెస్కు ముఖ్య సూచనలు