• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్ నుంచి పీహెచ్‌డీ వ‌రకు ఆర్థిక సాయం

ఎన్‌టీఎస్ఈ - పదో తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు

సబ్జెక్టుల్లోని మౌలికాంశాల పట్ల విద్యార్థులు సాధించిన పట్టును పరీక్షించి, అందులో ప్రతిభను ప్రదర్శించిన వారికి ఆర్థిక చేయూతనందించే లక్ష్యంతో ఏటా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్ఈ) నిర్వహిస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ఎంపికైతే ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉపకారవేతనాలను (స్కాలర్షిప్‌లు) ఇస్తారు. దేశవ్యాప్తంగా రెండు వేల మందికి ఇవి అందుతాయి. పేద, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎన్టీఎస్ఈ వరంలాంటిది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి ప్రకటన వెలువడింది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌పై దృష్టిపెడితే మంచి ఫలితాలను సాధించవచ్చు. ఎన్‌టీఎస్ఈ రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది రాష్ట్రస్థాయి స్టేజ్-1, రెండోది స్టేజ్-2 జాతీయ స్థాయిలో ఉంటుంది. 
 

రాష్ట్రస్థాయిలో..
రాష్ట్రస్థాయిలో జరిగే స్టేజ్-1 (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్) పూర్తి ఆబ్జెక్టివ్ త‌రహా పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది మెంటల్ఎబిలిటీ టెస్ట్. రెండోది స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌. ఒక్కో పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రెండో పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్య‌వ‌ధి రెండు గంటలు.

 

స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. స్టేజ్-2 ప్రశ్నపత్రం కూడా స్టేజ్-1 మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. ప్రశ్నపత్రాన్ని ఎన్సీఈఆర్టీ రూపొందిస్తుంది. రుణాత్మక మార్కులు ఉండవు. పేపర్లవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
 

దరఖాస్తు ఎలా?
ఏపీ విద్యార్థులు ప‌రీక్ష రుసుము రూ.200 ఏపీసీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ విద్యార్థులు ట్రెజ‌రి బ్రాంచ్‌లో రూ.100 చ‌లానా రూపంలో చెల్లించాలి. అనంత‌రం దరఖాస్తు ప్ర‌తులు, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాల‌యంలో స‌మ‌ర్పించాలి.

ఎంపికైతే...
అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన రెండు వేల మందిని స్కాలర్‌షిప్‌న‌‌కు ఎంపిక చేస్తారు. మొత్తం ఉపకారవేతనాల్లో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 4 శాతం దివ్యాంగులు, 27 శాతం ఓబీసీలకు మంజూరు చేస్తారు. 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1250, డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్‌డీ చేరిన వారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయిలో జూన్ 13, 2021న ప‌రీక్షకు హాజ‌రు కావాల్సి ఉంటుంది.

 

సిలబస్
మెంటల్ఎబిలిటీ టెస్ట్(మ్యాట్)లో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సాట్) విభాగంలో పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది.

అర్హత: గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలకు చెందిన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో చదివిన వారూ అర్హులే.

 

పరీక్ష కేంద్రాలు: దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది:

ఏపీ - నవంబరు 20, 2020

తెలంగాణ ‌- నవంబరు 12, 2020

ఫీజు చెల్లింపునకు చివరి తేది:

ఏపీ - నవంబరు 20, 2020
తెలంగాణ ‌- నవంబరు 17, 2020


ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ప్ర‌తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేది:

ఏపీ - న‌వంబ‌రు 12, 2020 
తెలంగాణ ‌- న‌వంబ‌రు 17, 2020 


పరీక్ష తేదీ: స్టేజ్-1, డిసెంబ‌రు 13, 2020 (పేపర్ -1, ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)

వెబ్‌సైట్:
ఏపీ - https://www.bse.ap.gov.in/NTSE.aspx           
తెలంగాణ -
https://www.bse.telangana.gov.in/NTSE.aspx
 

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం