ప్రాజెక్టు పని
మీ జిల్లాలోని వివిధ కోటల చిత్రాలు లేదా మీరు చూసిన కోట/ప్రాచీన గుడి/కట్టడం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జ: ప్రాచీన గుడి
ఎల్లలు దాటిన ఏడుపాయల కీర్తి
దట్టమైన అటవీప్రాంతం.. ప్రకృతి అందాలకు నెలవు.. గలగలపారే మంజీర పరవళ్లు.. ఎటుచూసినా తనివి తీరని చోటు.. అదే ఏడుపాయల వనదుర్గాదేవి గుడి...
భారతదేశంలోని వనదుర్గ ఆలయాల్లో మొదటిది కాశ్మీర్లో ఉండగా రెండోది ఏడుపాయలలోని వనదుర్గమ్మనే. ఇది జానపదుల జాతరగా ప్రసిద్ధికెక్కింది. మంజీర నది ఏడుపాయలుగా చీలి ప్రవహించి మళ్లీ ఒకచోట కలిసి సాగిపోవడం ప్రత్యేకత. ఇలాంటి అరుదైన ప్రకృతి వింతతో ఈ ప్రదేశంలో వెలసిన దుర్గామాత ఆలయానికి స్థలపురాణం ఉంది. మంజీర నది ప్రదేశంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన ప్రాంతంలో అమ్మవారు వెలిశారు. పాయ అంటే చుట్టూ నది ప్రవహించి నడుమ మిగిలిన ద్వీపం. ఒకటవది వన దుర్గామాత వెలిసిన పాయ, రెండోది శ్రీరాముడు దుర్గాదేవిని ప్రతిష్టించాడు కాబట్టి 'రాములవారిపాయ' అని, మూడోది లక్ష్మణపాయని, నాలుగోది చెండభార్గవపాయ, అయిదోది సింగని రుషిపాయ, ఆరోది కోటపాయ, ఏడోది మంత్రానాలపాయ(జనమేజయ పాయ) అంటారు.
వనదుర్గాపాయ సుమారు 15 ఎకరాలు, రాములవారి పాయ 30 ఎకరాలు, జనమేజయ పాయ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా వారంరోజులు జాతర సాగుతుంది. పోతరాజు గావుకేకలు, బోనాలు, బలి లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి జానపదుల సంప్రదాయాల ఆనవాలుగా సాగుతుంది వనదుర్గా మాత జాతర.
రచయిత: జి. అంజాగౌడ్