• facebook
  • whatsapp
  • telegram

టెన్త్‌తో డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు

ఏపీ, తెలంగాణ పాలీసెట్స్‌ - 2024 వివరాలు



పదో తరగతి తర్వాత మేటి సాంకేతిక విద్యతోపాటు, చక్కని ఉపాధి ఆశించేవారు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. వీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు అందిస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (పాలీసెట్‌) - 2024 ప్రకటనలు విడుదలచేశాయి. పరీక్షలో చూపించే ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ఉద్యోగం, ఉన్నత విద్య, స్వయం ఉపాధి అన్నింటికీ ఈ డిప్లొమాలు ఉపయోగపడతాయి. 


పదో తరగతి తర్వాత ఉన్న దారుల్లో డిప్లొమాలనూ ముఖ్యమైనవిగా పరిగణనలోకి తీసుకోవచ్చు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లో పట్టున్నవారు డిప్లొమాలో రాణించవచ్చు. ప్రశ్నలన్నీ ఈ సబ్జెక్టుల్లోని అంశాలపైనే ఉంటాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెరుగైన నైపుణ్యాలు ఆశించేవారు ఉన్నత విద్యనూ అభ్యసించవచ్చు. అందువల్ల ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారు, ఇప్పటికే పూర్తయినవారు ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు. ప్రత్యేకంగా డిప్లొమా విద్యార్హతతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ప్రభుత్వ, ఎయిడెడ్, పేరొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. వీటిలో ఎంపికైనవారికి ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనాలూ దక్కుతున్నాయి. డిప్లొమాలో చేరినవారు ఏఐసీటీఈ అందించే ప్రగతి, సాక్షం స్కాలర్‌షిప్పులకు అర్హులు.


కోర్సులెన్నో..

పెద్ద మొత్తంలో బ్రాంచీలు ఉండటం డిప్లొమాల ప్రత్యేకత. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకునే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది. సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. ఇలా 30కిపైగా బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  


వైవిధ్యమైనవీ..

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీ, ఇంçర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్, 3డీ యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ... మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పాలీసెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలోనూ చేరవచ్చు. 


ఉన్నత విద్య

డిప్లొమా అనంతరం ఉన్నత విద్యను ఆశించేవారు ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ రాసుకోవచ్చు. కొన్ని బ్రాంచీలవారికి నేరుగా బీఎస్సీ రెండో సంవత్సరం కోర్సుల్లోకీ తీసుకుంటారు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారైతే.. ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే ఏఎంఐఈ పూర్తిచేసుకోవచ్చు. దీనికి బీటెక్‌తో సమాన గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎంటెక్‌నూ చదువుకోవచ్చు. కావాలనుకుంటే ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌-పీహెచ్‌డీ కోర్సులూ పూర్తిచేసుకోవచ్చు లేదా డిప్లొమా అర్హతతోనే ఆసక్తి ఉన్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీఎస్సీ/బీకాం/బీఏ/బీబీఏ/బీసీఏ) కోర్సుల్లోనూ చేరవచ్చు.


పరీక్ష ఇలా..

పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. 

ఏపీ పాలీసెట్‌లో.. 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి పదో తరగతి సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-ఎ: మ్యాథ్స్‌ 50, సెక్షన్‌-బి: ఫిజిక్స్‌ 40, సెక్షన్‌-సి: కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్‌ పత్రంపై జవాబులు గుర్తించాలి. 

తెలంగాణ పాలీసెట్‌తో.. రెగ్యులర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులతోపాటు అగ్రికల్చర్‌ డిప్లొమాలు, వెటర్నరీ అండ్‌ హార్టికల్చర్‌ డిప్లొమాల్లోకీ అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు పరీక్ష రాయడం తప్పనిసరి. తెలంగాణ పాలీసెట్‌లో.. మ్యాథ్స్‌ 60, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. రెగ్యులర్‌ డిప్లొమాలో ప్రవేశం ఆశించేవారు బయాలజీ రాయనవసరం లేదు. అన్ని   కోర్సులకూ ప్రయత్నించాలనుకున్నవారు, ప్రత్యేక పాలిటెక్నిక్‌ల్లో చేరాలని భావించేవారు బయాలజీనీ రాయాలి.   


సన్నద్ధత  

ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ పదో తరగతి సిలబస్‌ నుంచే వస్తాయి. గ్రహణ, అనువర్తన, విశ్లేషణ నైపుణ్యాలను పరిశీలించేవిగా వీటిని రూపొందిస్తారు. మ్యాథ్స్, సైన్స్‌ పాఠ్యాంశాలపై పట్టున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు.

పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నలు పాలీసెట్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. వాటిని శ్రద్ధగా గమనిస్తే పూర్తి అవగాహన వస్తుంది. ఏపీ పాలీసెట్‌ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్‌ సైతం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంది. 

సబ్జెక్టులవారీ పాఠాలు/అధ్యాయాలు చదివి వాటిలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. 

పాఠ్యపుస్తకాలు చదవడం పూర్తయిన తర్వాత కనీసం 10 మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే పేరున్న పాలిటెక్నికల్‌ కాలేజీలో, కోరుకున్న డిప్లొమా కోర్సులో సీటు పొందవచ్చు. 

రుణాత్మక మార్కులు లేనందున ఆలోచించి, అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించవచ్చు.

పాలీసెట్‌ సన్నద్ధతతోనే గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ/బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షనూ ఎదుర్కోవచ్చు. 


ఏయే కొలువులు?

డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వీరికి మహారత్న, నవరత్న, మినీరత్న, ప్రభుత్వ రంగ సంస్థల్లో వేల సంఖ్యలో కొలువులున్నాయి. రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులకు డిప్లొమా విద్యార్హతతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లోనూ జేఈ ఖాళీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి భర్తీ చేస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఏడో వేతన సంఘం లెవెల్‌-6 ప్రకారం రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. వీరు మొదటి నెల నుంచే అన్ని అలవెన్సులూ కలిపి సుమారు రూ.60,000 జీతం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో.. విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల.. తదితర శాఖల్లో డిప్లొమాతో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 


ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉద్యోగాలు దక్కుతున్నాయి. నిర్మాణ పరిశ్రమ, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఫార్మా కంపెనీలు, ఇంజినీరింగ్‌ సంస్థల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. పేరొందిన పాలిటెక్నికల్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. పలు విభాగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 


రైల్వేలో లోకో పైలట్‌ ఉద్యోగాలకు కొన్ని బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు. సివిల్‌ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఎయిర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. డిప్లొమాతోనే విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా సింగపూర్, మలేసియా, దుబాయ్, యూఏఈ.. తదితర చోట్ల పెద్ద మొత్తంతో వీరికి అవకాశాలు దక్కుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 5, 2024

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ.400. ఎస్సీ, ఎస్టీలకు రూ.100

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 27 (65 ప్రాంతాల్లో 500 కేంద్రాల్లో నిర్వహిస్తారు)

ఫలితాలు: మే 13, 2024

వెబ్‌సైట్‌: https://polycetap.nic.in/Default.aspx


తెలంగాణ


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22, 2024

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250. మిగిలిన అందరికీ రూ.500.

పరీక్ష తేదీ: మే 17, 2024

ఫలితాలు: పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత 

వెబ్‌సైట్‌: https://polycet.sbtet.telangana.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Posted Date : 28-02-2024

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌