Post your question

 

    Asked By: nayudupalli

    Ans:

    మీ విద్యార్హత, ఉద్యోగానుభవంతోపాటు, భవిష్యత్‌ ప్రణాళికకు అనుగుణంగా ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోండి. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ అనేది ఒక డేటా విజువలైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌. ఇది ముఖ్యంగా బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ కోసం ఉపయోగపడే ప్రముఖ సాధనం. డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పవర్‌ బీఐలో శిక్షణ పొందాక ప్రముఖ ఐటీ కంపెనీల్లో, బిజినెస్‌ అనలిటిక్స్‌ కంపెనీల్లో పవర్‌ బీఐకి సంబంధించిన డేటా అనలిస్ట్, డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్‌ హోదాల్లో సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనం పొందవచ్చు.
    ఈ రంగంలో రాణించాలంటే  బీఎస్సీ ( డేటా సైన్స్‌/ మేథమ్యాటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌)/బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ/బీబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌)/ ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) లాంటి విద్యార్హతలు అవసరం. ఇక మ్యూల్‌సాఫ్ట్‌ విషయానికొస్తే, ఇది అప్లికేషన్, డేటా, డివైస్‌లను ఇంటిగ్రేషన్‌ చేసే సాఫ్ట్‌వేర్‌. మ్యూల్‌సాఫ్ట్‌లో ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అనేది ముఖ్యమైంది. దీన్ని ఉపయోగించి అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ డెవలపర్స్‌ వివిధ రకాల అప్లికేషన్లు వృద్ధి చేస్తారు. మ్యూల్‌సాఫ్ట్‌లో శిక్షణ పొందినవారు ప్రముఖ ఐటీ కంపెనీల్లో మ్యూల్‌సాఫ్ట్‌కు సంబంధించి ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అప్లికేషన్‌ డెవలపర్స్, ఇంటిగ్రేషన్‌ మేనేజర్, డెవలపర్, మాడ్యూల్‌ లీడ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాలు, ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వేతనంతో పొందే అవకాశం ఉంది. మ్యూల్‌సాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మంచి ఉద్యోగం పొందాలనుకొంటే- బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ లాంటి విద్యార్హతలు అవసరం. పైన చెప్పిన పవర్‌ బీఐ, మ్యూల్‌సాఫ్ట్‌లకు సంబంధించిన ఉద్యోగాల్లో అభ్యర్థుల ఉద్యోగానుభవాన్ని బట్టి ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంటుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: నర్సింగ్‌

    Ans:

    - మీరు అడిగిన ఐడీపీ కోర్సు అంటే ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాం. దీనిలో ఒక డిగ్రీ కోర్సు, మరో పీజీ కోర్సు కలిపి అందిస్తారు. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే- సంప్రదాయ పద్ధతిలో ఒకదాని తరువాత ఒకటి చదివితే పట్టే సమయం కంటే, ఐడీపీ కోర్సుకు ఒక సంవత్సరం తక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు బీటెక్‌ కోర్సు కాలవ్యవధి 4 సంవత్సరాలు, ఎంటెక్‌ కాలవ్యవధి 2 సంవత్సరాలు. ఐడీపీ కోర్సులో బీటెక్, ఎంటెక్‌లకు కలిపి 5 సంవత్సరాలే పడుతుంది. జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)లో ఐడీపీ పద్దతిలో బీటెక్‌ + ఎంటెక్, బీటెక్‌+ఎంబీఏలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఒక్కో కోర్సులో 12 లేదా 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసెట్‌లో అత్యున్నత ప్రతిభ కనపర్చినవారికే ఈ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. ఐడీపీలో బీటెక్, ఎంటెక్‌ చదివిన తరువాత, మళ్ళీ ఎంటెక్‌ చదవాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉంటే ఎంబీఏ చేసే అవకాశం ఉంది. ఐడీపీలో బీటెక్, ఎంటెక్‌ చదివాక మరో స్పెషలైజేషన్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చేయాలనుకొంటే, గేట్‌ పరీక్ష రాసి ప్రవేశం పొందవచ్చు. జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)లో క్యాంపస్‌ సెలక్షన్లు ఉన్నాయి. ఆ ప్రాంగణ నియామకాల్లో మీరు ఉద్యోగం పొందగలరా లేదా అనేది మీ విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన సామర్థ్యం, ఆ కోర్సులో వచ్చిన మార్కుల శాతంపై ఆధారపడి ఉంటుంది. 

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: nayudupalli

    Ans:

    పదేళ్ళ క్రితం పూర్తి చేసిన బీఎస్సీ, ఎంసీఏ విషయపరిజ్ఞానం ఎంతవరకు మీకు గుర్తుంది అనే అంశం, మీరు ఏరంగంలో స్థిరపడాలో నిర్ణయిస్తుంది. కొంతకాలం స్కూల్‌ టీచర్‌గా పనిచేశారన్నారు. కానీ ఏ సబ్జెక్టులు బోధించారో చెప్పలేదు. మీరు బీఎస్సీలో చదివిన మూడు సబ్జెక్టుల్లో మీకిష్టమైన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఎంసీఏ కూడా చదివారు కాబట్టి, కంప్యూటర్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే- అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మీరు ఎంసీఏ చేసినప్పటికీ, ఇప్పటికీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి రంగాలకు చాలా డిమాండ్‌ ఉంది. ఆ రోజుల్లో సీ, సీ ప్లస్‌ ప్లస్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ఎంత ప్రాచుర్యంలో ఉండేవో, ఇప్పుడు జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లు కూడా అంతే ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే కనీసం ఒక సంవత్సరం పాటు వివిధ కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోండి. ఒకవేళ మీరు మేనేజ్‌మెంట్‌్/ అడ్మినిస్టేషన్‌ ఉద్యోగాలు చేసివుంటే ఎంబీఏ చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి మళ్ళీ స్కూల్‌ టీచర్‌గా కెరియర్‌ కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: nayudupalli

    Ans:

    డిగ్రీ తరువాత, బీఎస్సీలో మీరు ప్రస్తుతం చదువుతున్న బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు బీఎస్సీ బీజడ్‌సీ అర్హతతో బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేయటానికి అనుమతిస్తున్నాయి. పీజీ తరువాత  నెట్‌/ సెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో బోధనావకాశాలు ఉంటాయి. మీరు పీజీలో చదివిన సబ్జెక్టులో పీహెచ్‌డీ కూడా  చేయొచ్చు. పీహెచ్‌డీ చేసిన తరువాత బోధనా రంగంపై ఆసక్తి ఉంటే విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల కోసం, పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. 
    బీఎస్సీ పూర్తి చేశాక ప్రైవేటు ఫార్మా, బయోటెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. బీఎస్సీ బీజడ్‌సీ తరువాత ఆసక్తి ఉంటే మెడికల్‌ రెప్రజెంటేటివ్‌ ఉద్యోగం ఎంచుకునే వీలుంది. పోటీపరీక్షలు రాయాలనే ఆసక్తి ఉంటే డిగ్రీ అర్హత ఉన్న అన్ని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొలువుల కోసం సన్నద్ధం కావొచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అయిన వెంటనే బీఈడీ  కూడా చేయవచ్చు. డిగ్రీ తరువాత బీఈడీ చేసి పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా, పీజీ తరువాత బీఈడీ చేసి కేంద్రీయ పాఠశాలల్లో పీజీ టీచర్‌గా స్థిరపడవచ్చు. మీరు డిగ్రీలో చదివిన ఇంగ్లిష్, తెలుగు/ హిందీల్లో పీజీ చేయవచ్చు. డిగ్రీ తరువాత మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులో, జర్నలిజంలో పీజీలో, ఎంబీఏలో కూడా చేరవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో బీఎస్సీ విద్యార్హతతో ఆంత్రొపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ లాంటి సబ్జెక్టుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎ. బుచ్చయ్య

    Ans:

    ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఈ పీజీతో  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్లం బోధించవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌ తరువాత నెట్‌/ సెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులయితే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. ఈ భాషలో పీహెచ్‌డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌తో పాటు బీఈడీ చేసి పాఠశాలల్లో ఇంగ్లిష్‌ టీచర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగంలో కంటెంట్‌ రైటర్లుగా, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా, అనువాదకునిగా, ఎడిటర్‌గా, కాపీ రైటర్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, టెక్నికల్‌ రైటర్‌గా విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: nayudupalli

    Ans:

    చాలామంది తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం గురించి ఆలోచిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు సాహిత్యం చదవాలనుకొంటున్న మీ అభిలాష అభినందనీయం. డిగ్రీలో తెలుగు లిటరేచర్‌ చదివాక తెలుగు పండిట్‌ శిక్షణ చేసినట్లయితే, పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందవచ్చు. తెలుగు భాషతో పాటు మరో భాషను నేర్చుకొంటే, అనువాదకులుగా స్థిరపడవచ్చు. డిగ్రీ తరువాత తెలుగులో పీజీ చేస్తే జూనియర్‌ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా చేరే అవకాశం ఉంది. పీజీలో తెలుగు చదివి, పీహెచ్‌డీ చేసినట్లయితే డిగ్రీ కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు బీఏ తెలుగు తరువాత జర్నలిజం కోర్సు చేసి టీవీ, రేడియో, పత్రికా రంగాల్లో పనిచేసే అవకాశం పొందొచ్చు. కంప్యూటర్‌కు సంబంధించిన కోర్సులు నేర్చుకొని ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ రంగంలోనూ ప్రవేశించవచ్చు. కంపారిటివ్‌ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లోనూ పీజీ చేయవచ్చు. ఇవి కాకుండా- తెలుగు లిటరేచర్‌లో డిగ్రీ తరువాత, డిగ్రీ అర్హతగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నింటికి మీరు అర్హులే! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: యు. ప్రవీణ్‌ తేజ

    Ans:

    సాధారణంగా ఏజీ బీఎస్సీ చదివిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే చాలామంది ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతారు. మరికొంతమంది బయోటెక్నాలజీ. ప్లాంట్‌ సైన్సెస్, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్‌ ఎకనమిక్స్, అగ్రికల్చరల్‌ ఎక్స్‌ టెన్షన్, ఆగ్రోనమి, ఎంటెమాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేస్తారు. ఇటీవలికాలంలో చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివాక ఎంబీఏలో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు గురించీ ఆలోచిస్తున్నారు. ఇక విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే- పైన పేర్కొన్న అన్ని కోర్సులతో పాటు, విభిన్న కోర్సులు చదివే అవకాశం ఉంది. ఉదాహరణకు- క్రాప్‌ సైన్సెస్, సాయిల్‌ సైన్స్, అగ్రికల్చర్‌ టెక్నాలజీ, గార్డెన్‌ డిజైన్, సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్, ఫుడ్‌ సెక్యూరిటీ లాంటి వినూత్న కోర్సులతో పాటు మరెన్నో మల్టీ డిసిప్ల్లినరీ కోర్సులు కూడా పూర్తిచేసుకోవచ్చు. పీజీ తరువాత, పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే, బోధన, పరిశోధన రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శ్రీకాంత్‌ యాదవ్‌

    Ans:

    సోషియాలజీ డిగ్రీ అర్హతతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ లేవు. కానీ, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. డిగ్రీ అర్హతతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్, పోలీస్‌ రిక్రూట్‌మెంట్, ఎల్‌ఐసీ, కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలన్నింటికీ మీకు అర్హత ఉంటుంది.
    ప్రైవేటురంగం విషయానికొస్తే డిగ్రీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో, పత్రికా రంగంలో, కౌన్సెలింగ్‌ రంగంలో ఉద్యోగాలకు సోషియాలజీ చదివినవారికి ఎక్కువ అవకాశాలుంటాయి. జర్నలిజం, పరిశోధన, మానవ వనరుల నిర్వహణలకు సంబంధించిన వృత్తుల్లో సోషియాలజీ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు డిగ్రీతోనే చదువు ఆపివేయకుండా సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌/ జర్నలిజం/ సైకాలజీ/ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు ఇంకా మెరుగవుతాయి. మీరు సోషియాలజీ డిగ్రీ తర్వాత, ఎల్‌ఎల్‌బీ కూడా చేసే అవకాశం ఉంది. బోధనరంగంలో ఆసక్తి ఉంటే బీఈడీ కూడా చేయవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కల్యాణ్‌ కృష్ణ

    Ans:

    - పాఠశాలల్లో బోధన చేయదలిస్తే బీఏ, బీఈడీ అర్హత సరిపోతుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో, నవోదయ విద్యాలయాల్లో, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తున్న పాఠశాలల్లో 11, 12 తరగతుల బోధన కోసం పీజీ టీచర్‌లను నియమిస్తారు. పీజీటీ ఉద్యోగాలకు బీఈడీ తో పాటు, సంబంధిత సబ్జెక్టులో పీజీ కూడా చేసి ఉండాలి. డిగ్రీలో చదివిన హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి స్కూళ్లలో, కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. కంప్యూటర్స్‌ గురించిన ప్రాథ]మిక పరిజ్ఞానం మీకు అదనపు అర్హతగా పనికివస్తుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో పనిచేయాలంటే ఇంగ్లిషు, హిందీ భాషల్లో కూడా బోధించగల సామర్ధ్యం పెంచుకోవాలి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి. భవాని

    Ans:

    మీరు బీఎస్సీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో చేరి పూర్తిచేసేటప్పటికి మీకు కనీసం 32 సంవత్సరాలు వస్తాయి. ఆ తరువాత పీజీ చేయాలంటే మరో రెండేళ్లు పడుతుంది. అంటే డిగ్రీ పూర్తిచేశాక కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు వయసు రీత్యా మీకు అర్హత ఉండదు. కానీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు చాలావాటికి మీకు అర్హత ఉంటుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేయడానికి వయసుతో సంబంధం లేదు.
    భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారో, ఆ రంగానికి అవసరమైన సబ్జెక్టులతో కూడిన డిగ్రీ చేస్తే మీకు ఉపయోగకరం. ఉదాహరణకు- మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేయాలి. స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాల కోసం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షల కోసం హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులు, డేటా సైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే డేటా సైన్స్‌ కోర్సులు, కౌన్సెలింగ్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే సైకాలజీ కోర్సులు, భాషా పండితులు కావాలనుకొంటే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లాంటి కోర్సులు చేస్తే మేలు. జర్నలిజం రంగంలో చేరడానికి జర్నలిజం కోర్సులు, మేనేజ్‌మెంట్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే బీబీఎ కోర్సులు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగం కోసం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకొంటే ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ లాంటి కోర్సులను చేయవచ్చు. బోధన వృత్తిలోకి వెళ్లాలనుకొంటే ఇంటర్‌ అర్హతతో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ కానీ, బీఎస్సీ/ బీఏతో పాటు బీఈడీ లాంటి కోర్సులు కానీ చేయవచ్చు. కళాశాలలో అధ్యాపకులు అవ్వాలనుకుంటే డిగ్రీ తరువాత మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌