Post your question

 

    Asked By: రవికుమార్‌

    Ans:

    భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ కేంద్రప్రభుత్వ జాతీయ సేవాపథకం- ఎన్‌ఎస్‌ఎస్‌. ఇది జూనియర్‌ కళాశాలల్లో, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ పరిధిలోని వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం- యువతకు సమాజ సేవానుభవాన్ని అందించడం. ఈ పథకంలో పాల్గొనడం వల్ల అలవడిన సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, బృందాల్లో పనిచేయగల శక్తి సామర్థ్యాలు జీవితాంతం ఉపయోగపడతాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి విద్య, ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. కానీ ఇంటర్వ్యూలకు హాజరైనపుడు మీకు ఈ సర్టిఫికెట్‌ ఉండటం వల్ల ఇంటర్వ్యూ బోర్డుకు మీపై సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉద్యోగం పొందటానికి ఈ సర్టిఫికెట్‌ కొంతమేరకు ఉపయోగపడుతుంది.

    Asked By: nayudupalli

    Ans:

    ఐటీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఐటీ కంపెనీల్లో కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మెడికల్‌/ డెంటల్‌ చదివినవారికీ అర్హత ఉంటుంది. అలాంటి సంస్థలను ఎంచుకొని, వాటిలో ఉద్యోగాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రస్తుతం అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువున్నాయి. ఆ  దిశలో కూడా ప్రయత్నం చేయండి.

    మెడికల్‌ కోడింగ్‌ రంగంలో కంటే, హెల్త్‌కేర్‌ ఐటీ రంగానికే మంచి భవిష్యత్తు ఉంది. మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉద్యోగాలకోసం సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం లాంటి కోర్సుల్లో శిక్షణ పొందాలి. కెనడా/యూఎస్‌లో మెడికల్‌ కోడింగ్‌ కోర్స్‌ చేసి, ఆ దేశాల్లోనే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మెరుగైన అవకాశాలుంటాయి. మెడికల్‌ కోడింగ్‌లో వృత్తి అనుభవం ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తారు. మొదటి ఉద్యోగం తక్కువ వేతనంతో మొదలైనా, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. మీకు ఆసక్తి ఉంటే ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివి, ఆ రంగంలో కూడా మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శివప్రసాద్‌

    Ans:

    మాస్‌ కమ్యూనికేషన్‌ రంగంలో రాణించాలంటే భావప్రకటన సామర్థ్యం, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, పరిశీలన, పరిశోధన, సమస్యా పరిష్కార నైపుణ్యాలు అవసరం. మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సు చదివినవారికి మీడియా, టీవీ, రేడియోల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో, బోధన, చలనచిత్ర, అడ్వర్‌టైజింగ్, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జర్నలిజం కోర్సులో మీడియా ప్రాక్టీస్, మీడియా స్టడీస్, వీడియో ప్రొడక్షన్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, డిజిటల్‌ మీడియా, కమ్యూనిటీ రేడియో, అడ్వర్‌టైజింగ్, పబ్లిక్‌ రిలేషన్స్, మల్టీమీడియా లాంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. మీ అభిరుచి, ఆసక్తిలను బట్టి సరైన స్పెషలైజేషన్‌ ఎంచుకుని ఆ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: బ్రహ్మయ్య

    Ans:

    - వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక ఇదే విభాగంలో పీజీ చేయవచ్చు. ఇందుకోసం ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. పీజీలో.. వెటర్నరీ అనాటమీ, గైనకాలజీ, మెడిసిన్, పారాసైటాలజీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, పెథాలజీ, వైల్డ్‌ లైఫ్‌ సైన్స్‌/ వైల్డ్‌లైఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, వైరాలజీ, మైక్రో బయాలజీ అండ్‌ ఇమ్యునాలజీ/బ్యాక్టీరియాలజీ, సర్జరీ అండ్‌ రేడియాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎపిడిమయాలజీ, యానిమల్‌ హజ్బెండ్రీ/ డైరీ సైన్స్, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, యానిమల్‌ ఫిజియాలజీ, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండ్రీ ఎక్స్‌టెన్షన్, లైవ్‌స్టాక్‌/ వెటర్నరీ / యానిమల్‌ హజ్బెండ్రీ ఎకనామిక్స్,... తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వెటర్నరీ ఆఫీసర్లుగా, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు, పౌల్ట్రీఫామ్‌లు, షీప్‌ అండ్‌ రాబిట్స్‌ ఫామ్‌లు, రేస్‌ క్లబ్బులు, జువలాజికల్‌ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోటెక్‌ కంపెనీలు, బోధన కళాశాలలు, యానిమల్‌ బ్రీడింగ్‌ కేంద్రాలు, ప్రైవేటు వెటర్నరీ క్లినిక్‌లు, పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యానిమల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వెటర్నరీ ఫార్మా కంపెనీలు, యానిమల్‌ న్యూట్రిషన్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి.  

    Asked By: ఎస్. వినితాగౌడ్

    Ans:

    బీఎస్సీ (ఎంబీజడ్‌సీ)లో మీరు చదువుతున్న మైక్రో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ... మూడు సబ్జెక్టుల్లో ఎంఎస్సీ చదవొచ్చు. ఇవేకాకుండా ప్లాంట్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ, యానిమల్‌ బయాలజీ, బయోటెక్నాలజీల్లో కూడా పీజీ చదివే అవకాశం ఉంది. పరిశోధనా రంగంపై ఆసక్తి ఉంటే లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల్లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పీహెచ్‌డీ, బోధనా రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేయొచ్చు. ఇక ఉద్యోగావకాశాల విషయానికొస్తే.. బయోటెక్‌ కంపెనీల్లో, ఫార్మా కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో, బయో మెడికల్‌ కంపెనీల్లో, ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమల్లో, బెవరేజ్‌ ఇండస్ట్రీలో, పర్యావరణ పరిశోధన సంస్థల్లో, మెడికల్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో, యూనివర్సిటీ/ కళాశాల ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీఎస్సీ విద్యార్హతతో పొందే ఉద్యోగాలకు వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. ఏదైనా సబ్జెక్టులో పీజీ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.ఆర్‌. చంద్రశేఖర్‌

    Ans:

    అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసినవారికి ఎంఎస్సీలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ చదివే అవకాశం ఉంటుంది. ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో ప్లాంట్‌ జెనెటిక్స్, ప్లాంట్‌ సైన్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, ప్లాంట్‌ బ్రిడింగ్, ప్లాంట్‌ పెతాలజీ, అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ, సీడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎంటమాలజీ, నెమటాలజీ, ఆగ్రానమీ... లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎంఎస్సీ హార్టికల్చర్‌లో వెజిటబుల్‌ క్రాప్స్, ఫ్రూట్‌సైన్స్, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ ఫర్‌ హార్టికల్చర్‌ క్రాప్స్, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్‌ సైన్సెస్, మెడిసినల్‌ అండ్‌ ఆరోమెటిక్‌ క్రాప్స్‌.. లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ చదవాలంటే, ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించాలి. ఒకవేళ మేనేజ్‌మెంట్‌ వైపు వెళ్లాలనుకుంటే అగ్రిబిజినెస్‌లో ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంది. ఎంబీఏ చేయడానికి ఐఐఎంలు నిర్వహించే క్యాట్‌ పరీక్షలో మంచి స్కోర్‌ సంపాదించాలి. అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివినవారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే నియామక పరీక్షలు రాయవలసి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, వ్యవసాయ కళాశాలల్లో, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో, ఐసీఏఆర్‌ అనుబంధ పరిశోధనా సంస్థల్లో, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో, విత్తన తయారీ కేంద్రాల్లో, ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీల్లో, ఎరువుల తయారీ కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, బ్యాంకుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సందీప్‌రెడ్డి

    Ans:

    ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివినవారికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. దశాబ్దకాలంగా పెరిగిన దేశీయ, బహుళజాతి వ్యాపార సంస్థల విస్తరణ, సోషల్‌ మీడియా వినియోగం, ఆన్‌లైన్‌ రిటెయిల్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి అంశాల వల్ల మార్కెటింగ్‌ విభాగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌ లాంటి విభాగాల్లో కొలువులు లభిస్తాయి. మీరు డిగ్రీలో చదివిన ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, రిటెయిలింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మీడియా, హెల్త్‌కేర్‌, రియల్‌ ఎస్టేట్‌, టూరిజం, స్పోర్ట్స్‌ రంగాల్లో కూడా మార్కెటింగ్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు అధికం.

    ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న స్టార్టప్‌ సంస్థల్లోనూ మార్కెటింగ్‌ నిపుణుల అవసరం చాలా ఉంది. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి మొదట్లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు వేతనాలు ఆకర్షణీయంగా లేనప్పటికీ, మీ పని తీరు, అనుభవాన్ని పట్టి భవిష్యత్తులో మెరుగైన వేతనాలు లభిస్తాయి. మీకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో మార్కెటింగ్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి. అశోక్‌

    Ans:

    మీరు బీఏలో మూడో సబ్జెక్ట్‌గా చదువుతున్న ఆర్థికశాస్త్రంతో  ప్రత్యేకించి ఉద్యోగాలు ఉండవు. కానీ డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఎకనామిక్స్‌లో నాలుగు సంవత్సరాల బీఏ ఆనర్స్‌ కానీ, రెండు సంవత్సరాల పీజీ కానీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువుంటాయి. బీఏ తరువాత మంచి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివితే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ పరీక్షకు అర్హులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డ్, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వే లాంటి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందవచ్చు. పీజీలో ఎకనామిక్స్‌ చదివితే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, పరిశోధన, బిజినెస్‌ అనలిటిక్స్, బోధన, వ్యాపార పత్రికారంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు ఎకనమిస్ట్‌గా, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌గా, క్రెడిట్‌ అనలిస్ట్‌గా, రిస్క్‌ అనలిస్ట్‌గా, ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌గా, ఎకనమిక్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేయవచ్చు. డేటా సైన్స్, ఆక్చూరియల్‌ సైన్స్, ఇన్సూరెన్స్‌ల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటితో పాటు ఎంఎస్‌ ఎక్సెల్, ఎస్‌పీఎస్‌ఎస్, జమోవి, బ్లూస్కై స్టాటిస్టిక్స్, ఈ వ్యూస్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: యు. నాగేంద్రకుమార్‌

    Ans:

    - బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదివిన తరువాత ఈ మూడు సబ్జెక్టుల్లో దేంట్లోనైనా ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది. నిమ్‌సెట్‌ కానీ, ఐసెట్‌ కానీ రాసి ఎంసీఏ కూడా చేయవచ్చు. ఎంఎస్సీ డేటాసైన్స్‌ కూడా చేయొచ్చు. క్యాట్‌/ ఐసెట్‌ రాసి ఎంబీఏ కూడా చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఆక్చూరియల్‌ సైన్స్‌లో పీజీ చదివే అవకాశం కూడా ఉంది. ఇటీవల కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ లాంటి కోర్సులు చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యాక బీఈడీ కూడా చేయవచ్చు.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   

    Asked By: nayudupalli

    Ans:

    మీ విద్యార్హత, ఉద్యోగానుభవంతోపాటు, భవిష్యత్‌ ప్రణాళికకు అనుగుణంగా ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోండి. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ అనేది ఒక డేటా విజువలైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌. ఇది ముఖ్యంగా బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ కోసం ఉపయోగపడే ప్రముఖ సాధనం. డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పవర్‌ బీఐలో శిక్షణ పొందాక ప్రముఖ ఐటీ కంపెనీల్లో, బిజినెస్‌ అనలిటిక్స్‌ కంపెనీల్లో పవర్‌ బీఐకి సంబంధించిన డేటా అనలిస్ట్, డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్‌ హోదాల్లో సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనం పొందవచ్చు.
    ఈ రంగంలో రాణించాలంటే  బీఎస్సీ ( డేటా సైన్స్‌/ మేథమ్యాటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌)/బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ/బీబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌)/ ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) లాంటి విద్యార్హతలు అవసరం. ఇక మ్యూల్‌సాఫ్ట్‌ విషయానికొస్తే, ఇది అప్లికేషన్, డేటా, డివైస్‌లను ఇంటిగ్రేషన్‌ చేసే సాఫ్ట్‌వేర్‌. మ్యూల్‌సాఫ్ట్‌లో ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అనేది ముఖ్యమైంది. దీన్ని ఉపయోగించి అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ డెవలపర్స్‌ వివిధ రకాల అప్లికేషన్లు వృద్ధి చేస్తారు. మ్యూల్‌సాఫ్ట్‌లో శిక్షణ పొందినవారు ప్రముఖ ఐటీ కంపెనీల్లో మ్యూల్‌సాఫ్ట్‌కు సంబంధించి ఎనీపాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ అప్లికేషన్‌ డెవలపర్స్, ఇంటిగ్రేషన్‌ మేనేజర్, డెవలపర్, మాడ్యూల్‌ లీడ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాలు, ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వేతనంతో పొందే అవకాశం ఉంది. మ్యూల్‌సాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మంచి ఉద్యోగం పొందాలనుకొంటే- బీసీఎ/ బీటెక్‌/ ఎంసీఏ లాంటి విద్యార్హతలు అవసరం. పైన చెప్పిన పవర్‌ బీఐ, మ్యూల్‌సాఫ్ట్‌లకు సంబంధించిన ఉద్యోగాల్లో అభ్యర్థుల ఉద్యోగానుభవాన్ని బట్టి ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంటుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌