అధ్యాపకులుగా/సహాయక ఆచార్యులుగా నియమితులు కావాలనుకునేవారికి అర్హత కల్పించటానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలనేది జాతీయ విద్యావిధానం సూచన. ఏకీకృత ప్రమాణాలు నెలకొల్పాలన్న లక్ష్యం అనుసరించి జాతీయస్థాయిలో హ్యుమానిటీస్ విభాగాలకు యూజీసీ నెట్, సైన్స్ విభాగాలకు సీఎస్ఐఆర్ నెట్లను నిర్వహిస్తున్నారు.అయితే ఆంగ్లమాధ్యమంలో ఈ పరీక్షలు జరుగుతుండటం వల్ల మాతృభాషలో చదువుకున్న చాలామంది ప్రావీణ్యం ఉండి కూడా వాటిలో అర్హత సాధించలేకపోతున్నారు. దీన్ని అధిగమించటానికే రాష్ట్రాల స్థాయిలో సెట్ నిర్వహణకు యూజీసీ అనుమతించింది. జూనియర్ లెక్చరర్లు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి పొందాలన్నా కూడా నెట్/సెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ అర్హత వీలు కల్పిస్తుంది.
* పేపర్ - 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, పేపర్ - 2, 3లలో ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి.
పేపర్-1 జనరల్ పేపర్
మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 60 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ అభ్యర్థి 60 ప్రశ్నలకూ జవాబులు గుర్తిస్తే 1-50 ప్రశ్నలను మాత్రమే మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకుంటారు. 51-60 వరకూ ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్ కింద జమ కావు.
పేపర్-2, 3
పేపర్-2లో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. పేపర్-3లో 150 మార్కులకు 75 ప్రశ్నలు ఇస్తారు.