ఏపీ సెట్ రాయదల్చినవారు కంటెంట్పై పూర్తిస్థాయి పట్టు పెంచుకోవడం అవసరం. విషయ సామర్థ్యాన్నీ, గ్రహణ శక్తినీ మెరుగుపరచుకోవాలి. మూల భావనలపై వివిధ కోణాల్లో సన్నద్ధత కొనసాగించాలి. ఉత్తీర్ణత సాధించలేనివారు గతంలోని పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధత కొనసాగిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు.
* ఒకే సూత్రం, భావనలపై వైవిధ్యభరితంగా ఉండే ప్రశ్నలు సాధన చేయాలి. ప్రశ్నలో అంతర్లీనంగా ఉండే విషయం/ భావనపై దృష్టి పెట్టాలి.
* ప్రశ్నలు జతపరచడం, సమస్యాపూరణం మొదలైనవి లోతుగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
* మొదట సాధన నిదానంగా ఉండడం, చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజం. నిరంతర ప్రేరణతో, అభ్యాసం చేయడం వల్ల తప్పులు లేకుండా సాధించే సామర్థ్యం అలవడుతుంది. వేగంగా, కచ్చితంగా సాధించే నైపుణ్యం వస్తుంది. షార్ట్కట్స్, కొండ గుర్తులు సొంతంగా తయారుచేసుకుంటే సమయం ఆదా అవుతుంది.
* నేర్చుకోదలచిన విషయంపై మంచి పట్టు ఏర్పడిన తర్వాత నమూనా పరీక్షలు సాధన చేయాలి.
* అభ్యర్థులు రెండు పేపర్లలో ప్రతి అంశంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అదనపు సమాచారంకోసం రెఫరెన్స్ పుస్తకాలు, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల ద్వారా వివరణలతో కూడిన బోధనను వినియోగించుకోవాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత పెంచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్, మోడల్ పరీక్షలు పూర్తిచేసుకోవటానికి ఒత్తిడి లేని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* చదివిన అంశాల పునశ్చరణ తప్పనిసరి. మంచి స్కోరు చేయటానికి అవకాశం ఉంటుంది.
* పోటీపరీక్ష శైలిలో ముఖ్యాంశాలను అభ్యసించి, సాధన చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలిగేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి.