• facebook
  • whatsapp
  • telegram

Reservations: జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్‌) పోస్టుల్లో మహిళలకు వర్టికల్‌ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకం కింద తొమ్మిది జిల్లా జడ్జి పోస్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. వీటిలో నాలుగు పోస్టులను మహిళలకు కేటాయించారు. మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్‌ కేటాయించారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో నంబరు 3ను జారీ చేసింది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక బోర్డు భర్తీ చేసిన ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లనే అమలు చేశారు. నియామక పత్రాలు జారీ చేయని ఉద్యోగ ప్రకటనల్లోని ఖాళీల్లోనూ ఈ మేరకు మార్పులు చేశారు. మహిళా కేటగిరీ పోస్టులను జనరల్‌లో కలిపి, వాటిని జనరల్‌ కేటగిరీగా చూపించారు. కానీ, జడ్జి పోస్టులకు మాత్రం రోస్టర్‌ పాయింట్‌తో ఉద్యోగ ప్రకటన ఇవ్వడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది.

కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నియామకమేదీ?

టీఎస్‌పీఎస్సీ జూన్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష నిర్వహణలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ కీలకం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ పరిణామాల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేసేందుకు ఈ పోస్టును కమిషన్‌ సృష్టించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, పరీక్ష కేంద్రాల గుర్తింపు బాధ్యతలను ఈ అధికారి నిర్వహించాలి. అత్యంత కీలక పోస్టు కావడంతో... కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా వచ్చే వారు కేంద్ర సర్వీసుల కేడర్‌కు చెందిన వారై ఉండాలని, తెలంగాణేతరులుగా  ఉండాలని నిబంధనలు పెట్టారు. దీంతో గతంలో ఈ  పోస్టులో కర్ణాటకకు చెందిన తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి బీఎం సంతోష్‌ను నియమించారు. ఇటీవల బదిలీల్లో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్‌గా వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.

ఉప కంట్రోలర్‌గా పి.కల్యాణ్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీలో డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా పి.కల్యాణ్‌రెడ్డి నియమితులయ్యారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును భర్తీ చేయకుండా కమిషన్‌కు డిప్యుటేషన్‌పై ఉప కంట్రోలర్‌ను తీసుకొచ్చారు. కల్యాణ్‌రెడ్డి తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ(టీసీఆర్‌ఐ)లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి డిప్యుటేషన్‌పై ఆయన్ని పంపించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ప్రభుత్వానికి లేఖ రాయగా... ఏడాది కాలానికి మాత్రమే అనుమతించింది. అవసరమైతే పొడిగిస్తామంది.
 


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.