* రవాణా మంత్రి పొన్నం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకంలో శుక్రవారం వరకు మహిళా ప్రయాణికులకు 68.60 కోట్ల ఉచిత టికెట్లు జారీచేశామని, దీంతో లబ్ధిదారులు రూ.2,350 కోట్ల మేర ఆదా చేసుకున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంస్థ సిబ్బంది నిబద్ధతతోనే ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. పథకం కారణంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సంస్థ పనితీరుపై హైదరాబాద్ బస్భవన్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కండక్టర్లు, డ్రైవర్లతో వర్చువల్గా సమావేశమయ్యారు. ‘‘దాదాపు 12 ఏళ్ల తర్వాత సంస్థలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆయా పోస్టులను వీలైనంత త్వరగా భర్తీచేస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయి. మిగతా డిపోలూ వృద్ధి సాధించేందుకు కృషి చేయాలి. కార్గో సేవల విస్తరణకు విశ్రాంత ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి’’ అని సూచించారు.
బిలియన్ డాలర్ల టర్నోవర్ దిశగా..
సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. జీవో ప్రకారం మహాలక్ష్మి పథకం రీయింబర్స్ కింద ఇప్పటివరకు రూ.1740 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివరించారు. త్వరలోనే బిలియన్ డాలర్ల (రూ.8,500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్గా సంస్థ అవతరించబోతోందని వెల్లడించారు.
కొత్త సర్క్యులర్ విడుదల
రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (ఆర్ఈఎంఎఫ్ఎస్) నిబంధనలను మారుస్తూ రూపొందించిన కొత్త సర్క్యులర్ను మంత్రి విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ సిబ్బందితోపాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములకూ ఈ పథకాన్ని విస్తరించారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీవితకాలంలో వైద్య ఖర్చులకు రూ.4 లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.