* వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష కేంద్రాల ఎంపికకు ఇబ్బందులు
ఈనాడు, అమరావతి: నీట్ పీజీ పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈ) ఆటలాడుతోంది. పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం కల్పించిన ఎన్బీఈ.. వెబ్సైట్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పట్టించుకోవడం లేదు. నీట్ పీజీ పరీక్షలు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్లో నిర్వహించాలి. వీటిని ఆగస్టు 11కి వాయిదా వేసిన ఎన్బీఈ.. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 19 నుంచి 22 వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏవైనా నాలుగు కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కొంతమందికి పాస్వర్డ్లు మార్చుకోవాలని సంక్షిప్త సందేశాలు పంపింది. వారు శుక్రవారం రాత్రి మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సర్వర్ డౌన్ అయి, వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి వెబ్సైట్ మళ్లీ పనిచేయడం ప్రారంభించడంతో పాస్వర్డ్ మార్చుకున్న అభ్యర్థులు ప్రయత్నించగా.. ఇన్వ్యాలీడ్ క్రెడెన్షియల్స్ అని సందేశం వచ్చింది. కొత్త పాస్వర్డ్తో ఓపెన్ కాకపోగా.. పాతవి సైతం పని చేయడం లేదు. ఇలా దేశవ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఉన్నారు. వారు ఎన్బీఈ సహాయ కేంద్రానికి ఫోన్ చేసినా స్పందన లేదు. పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపు వెబ్ ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ఎన్బీఈ కేటాయించిన చోటకు వెళ్లి రాయాల్సి వస్తుంది. ఆ పరీక్ష కేంద్రాలు ఎక్కడ వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి, పాస్వర్డ్ మార్చుకొనే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.