• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఎంసెట్

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ సిల‌బ‌స్ నుంచి 88.. సెకండియ‌ర్ నుంచి 72  ప్ర‌శ్న‌లు‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో ఈసారి ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సరం నుంచి ఎక్కువ ప్రశ్నలు రానున్నాయి. ఎంసెట్‌-2021లో 55 శాతం ప్రశ్నలు మొదటి సంవత్సరం సిలబస్‌ నుంచే ఇవ్వనున్నారు. మొత్తం 160 ప్రశ్నల్లో 88 వస్తాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం నుంచి 45 శాతం అంటే 72 ప్రశ్నలిస్తారు. ఈ మేరకు మార్చి 06న‌ జరిగిన ఎంసెట్‌ కమిటీ మొదటి సమావేశం కీలక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల కాలపట్టికను కూడా కమిటీ ఖరారు చేసింది. 20 నుంచి ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. అగ్రికల్చర్‌కు జులై 5, 6, ఇంజినీరింగ్‌కు 7,8,9 తేదీల్లో ఎంసెట్‌ నిర్వహించనున్న విషయం విదితమే. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ జేఎన్‌టీయూహెచ్‌ నుంచి పాల్గొనగా...జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి ఉపకులపతి జయేశ్‌రంజన్‌, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కుమార్‌, ప్రవేశ పరీక్షల సాంకేతిక సమన్వయకర్త రమేశ్‌బాబు, ఎంసెట్‌ క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తదితరులు వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే వార్షిక పరీక్షలకు ఉన్నందున ఆ మేరకు ఎంసెట్‌ వెయిటేజీని 45 శాతానికి తగ్గించారు. గత ఏడాది వరకు రెండు సంవత్సరాలకు సమాన వెయిటేజీ ఉండేది. అంటే తొలి ఏడాది సిలబస్‌ నుంచి 80, ద్వితీయ సంవత్సరం నుంచి 80 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఎంసెట్‌ అగ్రికల్చర్‌ను ముందుగా ...ఆ తర్వాత ఇంజినీరింగ్‌ పరీక్షలు జరుపుతారు. మొత్తం 2.50 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలస్య రుసుంను అన్ని స్థాయిల్లో సగం తగ్గించారు. గత ఏడాది వరకు ప్రారంభం రూ.500 నుంచి గరిష్ఠ ఆలస్య రుసుం రూ.10 వేలు ఉండగా... దాన్ని రూ.250, గరిష్ఠం రూ.5 వేలుగా నిర్ణయించారు.

పెరిగిన పరీక్షల జోన్లు

గత ఏడాది వరకు తెలంగాణలో 16, ఏపీలో నాలుగు పరీక్షల జోన్లు ఉండేవి. ఈసారి తెలంగాణలో వాటిని 18, ఏపీలో అయిదుకు పెంచారు. కొత్తగా హైదరాబాద్‌ వెస్ట్‌ పేరిట శంషాబాద్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంను మరో జోన్‌గా మార్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది వరకు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో పరీక్షా కేంద్రాలుండగా, కొత్తగా గుంటూరును ఎంపిక చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.