* ప్రస్తుత విధానం బాగానే ఉందన్న కోర్టు
Five years Law course: ఇంటర్మీడియట్లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుత కోర్సు విధానం సరిగ్గానే ఉందని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు నిరాకరించింది.
ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్ పొందేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించమని కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టేయండి’’ అంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవానికి న్యాయ విద్యకు అయిదేళ్ల కోర్సు కూడా తక్కువే. కానీ ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తోంది. దీనిపై ఆలోచించడానికి ఏం లేదు. ఇక, ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థల్లో 70శాతం మంది మహిళలు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఇందులో చేరతారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.