• facebook
  • whatsapp
  • telegram

Private Schools:  ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!

* పిల్లల అధిక స్కూలు ఫీజులతో తల్లిదండ్రులు అవస్థలు


రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. తమ పాఠశాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ప్రభుత్వపరంగా రుసుముల నియంత్రణ లేకపోవడం వాటికి అనువుగా మారింది. 2024-25 విద్యాసంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నగరాల్లోని పలు కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం పెంచాయి.


నిర్ణీత ప్రాతిపదిక లేకుండానే..

పాఠశాలల్లో ఏటా రుసుముల పెంపు ఆనవాయితీగా మారింది. నిర్ణీత ప్రాతిపదిక ఏమీ లేకుండానే 15 నుంచి 20 శాతం వరకు పెంచేస్తున్నాయి. కరోనా తర్వాతి సంవత్సరంలోనూ పెంపుదల ఆగలేదు. డిమాండ్‌ ఉన్న పాఠశాలలు మెరిట్‌ ఉన్న విద్యార్థులకే సీట్లు ఇస్తామని చెబుతున్నా.. అవీ భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. మరోవైపు యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ధరలను పెంచేస్తున్నాయి. రూ.200కి లభించే చిన్నారుల బూట్లకు రూ.500 నుంచి రూ.1,000, మూడు జతల యూనిఫాంకు రూ.3 వేలు, బెల్టుకు రూ.300, టైకి రూ.300 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వీటిని బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నా ససేమిరా అంటున్నాయి. తాము ప్రత్యేకంగా తయారు చేయించామని, తమ పాఠశాల చిహ్నం ఉన్నందువల్ల ఇక్కడే కొనాలని కరాఖండిగా చెబుతున్నాయి. పుస్తకాలను సైతం బయటి మార్కెట్లో కొనడానికి ఒప్పుకోవడం లేదు. తాము చెప్పిన ముద్రణా సంస్థల పుస్తకాలనే కొనాలంటున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రుసుముల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారం పడుతోంది. కొందరు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా తన జీతం ఏమాత్రం పెరగలేదని, పాఠశాల రుసుములు మాత్రం 60 శాతం పెరిగాయని మంచిర్యాలకు చెందిన చిరుద్యోగి మహేందర్‌ వాపోయారు.


కార్యరూపం దాల్చని సిఫారసులు..

ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల పెంపుదలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం యాజమాన్యాలకు వరంగా మారింది. భారీ రుసుములపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది పలు సిఫారసులు చేసినా కార్యరూపం దాల్చలేదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.