* ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2, నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3
రాష్ట్రంలో గ్రూప్ సర్వీసుల ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ మార్చి 6న పరీక్ష తేదీలను ప్రకటించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన గ్రూప్-2 రాతపరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగనున్నాయి. గ్రూప్-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రభుత్వం నుంచి అదనంగా గ్రూప్-2, 3 ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలు వస్తే, ఆ మేరకు వాటిని ప్రస్తుత నోటిఫికేషన్లలో చేర్చాలని టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) భావిస్తోంది. నోటిఫికేషన్లలోని నిబంధనల ప్రకారం పరీక్ష తేదీ వరకు పోస్టుల సంఖ్యను పెంచడానికి లేదా తగ్గించడానికి కమిషన్కు అవకాశం ఉంది. మరోవైపు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు కావాల్సి ఉంది.
* ఏడాదిలోగా నియామకాలు పూర్తి చేయాలని...
గ్రూప్-1 నియామకాలు ఏడాదిలోగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో టీఎస్పీఎస్సీ ముందుకు వెళ్తోంది. గత నోటిఫికేషన్ను రద్దుచేసిన కమిషన్ కొత్తగా మరిన్ని పోస్టులను చేర్చి మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి నెలలో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు ఇప్పటికే తెలిపింది. తాజాగా ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ ప్రధాన పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. పేపర్ల వారీగా షెడ్యూలు త్వరలో వెల్లడి కానుంది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన నెలరోజుల్లోగా ప్రధాన పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. అక్టోబరులో ప్రధాన పరీక్షలు పూర్తయిన తరువాత నాలుగు నెలల్లోగా మూల్యాంకనం చేసి తుది ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష తేదీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా టీఎస్పీఎస్సీ ఈ ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 783 పోస్టులతో 2022లో ఉద్యోగ ప్రకటన జారీ అయింది. దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వరుస పరీక్షలతో గ్రూప్-2కు సన్నద్ధం కాలేకపోయామని, సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో కమిషన్ గత ఏడాది నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో తిరిగి అవి 2024 జనవరి 6, 7 తేదీలకు వాయిదా పడ్డాయి. తర్వాత కమిషన్ మరోసారి వాయిదా వేసింది. తాజాగా ఈ పరీక్షలు 2024 ఆగస్టు 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. అలాగే 1,388 గ్రూప్-3 పోస్టులకు నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. ఇందులో 3 పేపర్లు ఉంటాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.