ఈనాడు, అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రచారం కోసం ప్రైవేటు సంస్థలకు భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతోంది. ఇప్పటికే ప్రకటనల రూపంలో రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల ముందు సొంత డబ్బా కోసం పిల్లల డబ్బులను కూడా ప్రచారానికి వాడుకునేందుకు సిద్ధమైంది. విద్యా కార్యక్రమాల ప్రచారం పేరుతో రూ.4.20 కోట్లు వెచ్చించడానికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇండియా టుడే’ నిర్వహించే ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో నాలుగు ప్యానెల్ చర్చల కోసం ఈ మొత్తం ఖర్చు కానున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిధులు, ఇంటర్మీడియట్ విద్యామండలి, ఉన్నత విద్యామండలి ఈ సొమ్మును సమానంగా భరించాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుండగా.. టెట్ పరీక్షకు నిరుద్యోగ అభ్యర్థులు చెల్లించిన ఫీజుల డబ్బులు పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యా మండలి కళాశాలలు, విద్యార్థుల నుంచి రుసుములు, ఫీజులు వసూలు చేస్తుంటుంది. ఉన్నత విద్యామండలి వద్ద అయితే పోటీ పరీక్షలు, ప్రవేశాల కౌన్సెలింగ్ల కోసం విద్యార్థులు కట్టిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ సొంత ప్రచారానికి వాడేయనున్నారు. ఇండియాటుడే ఛానల్ తిరుపతిలో మంగళ, బుధవారాల్లో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి జగన్ సమయం సర్దుబాటు కాక జనవరికి వాయిదా వేశారు.
సామర్థ్యాలను వదిలేసి.. ప్రచారం
‣ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పట్టించుకోకుండా.. గొప్పలు చెప్పేందుకే ప్రభుత్వం పరిమితమవుతోంది. వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటనలు తప్ప వాటి అమలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు దీనిపై సొంత డబ్బా కొట్టుకునేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు.
‣ ప్రభుత్వ పాఠశాల్లో ఒక విధానమంటూ లేకుండా అమలు చేస్తున్న టోఫెల్ను గొప్పగా ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వలేదు. ఉపాధ్యాయులకు శిక్షణ లేదు. 44 వేలకు పైగా బడులుంటే 15 వేల బడుల్లోనే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ), స్మార్ట్ టీవీలు పెట్టి టోఫెల్ నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ‘గ్లోబల్ కెరీర్ కోసం సంయుక్త సర్టిఫికేషన్స్’ పేరుతో చర్చ పెట్టారు.
‣ ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై ఇంతవరకు స్పష్టత లేదు. కానీ ప్రచారం కోసం దానిపై మరో డిస్కషన్ పెట్టారు.
‣ ప్రైవేటు కంపెనీ బైజూస్ పాఠాలపైనా విద్యలో డిజిటల్ విప్లవం పేరుతో మరో ప్యానల్ డిస్కషన్ చేయబోతున్నారు. చాలా బడులకు ఇంతవరకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించలేదు. కానీ, డిజిటల్ విప్లవమంటూ సొంత డబ్బాకు సిద్ధమయ్యారు.
‣ అంతర్జాతీయ పోటీలో ఆంగ్ల మాధ్యమం ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుందంటూ దీనిపై మరో చర్చ పెట్టింది.
మరింత సమాచారం... మీ కోసం!
ఎల్బీఎస్ఐఎమ్లో పీజీ డిప్లొమా కోర్సులు
వైజాగ్ నావల్ డాక్యార్డులో 275 అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.