• facebook
  • whatsapp
  • telegram

Abroad:  మరింత మందికి విదేశీవిద్య  

* సంక్షేమశాఖల వారీగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు

* లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విదేశీవిద్య పథకాన్ని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు వర్తింపజేసి.. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీవిద్య అవకాశాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వానికి సంక్షేమశాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలో ప్రస్తుతం 300 మందికి అవకాశాలు కల్పిస్తుండగా.. 3,000 మందికి, ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 250 మంది నుంచి 500 మందికి, మైనార్టీలో 500 మంది నుంచి 1,000 మందికి అవకాశాలు పెంచాలని నివేదించాయి. ప్రస్తుత స్ప్రింగ్‌ సీజన్‌(మార్చి నుంచి జూన్‌ వరకు) నుంచి అవకాశాల పెంపును అమలు చేయాలని భావించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిలిచిపోయింది. కోడ్‌ ముగిసిన తరువాత దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.

రూ.20 లక్షల ఉపకార వేతనం

విదేశీవిద్య పథకం కింద అర్హులైన విద్యార్థులకు సంక్షేమశాఖలు రూ.20 లక్షల ఉపకార వేతనం మంజూరు చేయడంతోపాటు విమాన ఖర్చులు భరిస్తున్నాయి. ఇప్పటికే విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందినవారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టినపుడు అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. గత రెండేళ్లుగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుదారుల మార్కులు, ఆంగ్ల ప్రావీణ్య స్కోరు, చదవాలనుకుంటున్న కోర్సు, దేశం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమశాఖలు వాటిని వడపోస్తున్నాయి. సంక్షేమశాఖల వారీగా రాష్ట్రస్థాయి కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.


కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ..

ప్రస్తుత సీజన్‌కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీవిద్య పథకం కింద 2023 స్ప్రింగ్‌ సీజన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 5 వరకు గడువు ఉంది. ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయని సంక్షేమాధికారులు తెలిపారు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. ఏటా కేవలం 300 మందికి మాత్రమే ప్రస్తుతం పథకం కింద లబ్ధి చేకూరుతోంది. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకం కింద దరఖాస్తుల గడువు మార్చి 31తో ముగిసింది. సరైన పత్రాలు లేకపోవడం తదితర కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువు పెంచాలని ఎస్సీ సంక్షేమ శాఖాధికారులకు కొందరు అభ్యర్థులు వినతిపత్రాలు అందిస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖలో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ శాఖ పరిధిలో ఏటా 500 మందికి విదేశీవిద్యకు అవకాశం లభిస్తోంది. వచ్చిన దరఖాస్తులను వడపోసి.. తుది ఎంపికలు పూర్తి చేసేనాటికి మరో రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.