ఈనాడు, దిల్లీ: ఎంబీబీఎస్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్/తత్సమానమైన కోర్సులో రెండేళ్లు బైపీసీ చదవాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. విద్యార్థులకు బయాలజీ, బయలాజికల్ సైన్సెస్లో జ్ఞానం ఉండాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్ల ధర్మాసనం పేర్కొంది. సరైన విద్యార్హతలు లేవన్న కారణంతో అమెరికాకు చెందిన ఓ విద్యార్థినికి ఎన్ఆర్ఐ కోటా.. ఎంబీబీఎస్ సీటును తిరస్కరిస్తూ కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో విద్యార్థినికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం అమెరికాకు చెందిన శ్రీకీర్తిరెడ్డి పింగ్లే అనే విద్యార్థిని 2020-21 విద్యాసంవత్సరంలో ఎన్ఆర్ఐ కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆమె 10+2 సమానమైన అర్హత పరీక్షలో బయలాజికల్ సైన్స్ చదివినట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించక పోవడంతో యూనివర్సిటీ ఆమె పేరును పక్కనపెడుతూ 2020 డిసెంబరు 12న జాబితా ప్రచురించింది. సదరు విద్యార్థిని తాను 12వ తరగతి పూర్తిచేసినట్లు, అది భారత్లో ఇంటర్తో సమానమని లేఖ తెచ్చారు. అందులో తాను బయాలజీ చదివిందీ లేనిదీ చెప్పకపోవడంతో కాళోజీ వర్సిటీ యాజమాన్యం ఆ విద్యార్థిని అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టింది. దాన్ని సవాల్చేస్తూ సదరు విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించగా విద్యార్థిని బయలాజికల్ సైన్సెస్తో కూడిన 12 గ్రేడ్ పాస్ అయిందని చెబుతూ ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్చేస్తూ కాళోజీ వర్సిటీ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం బయలాజికల్ సైన్సెస్ను పూర్తిస్థాయిలో చదివిందని చెప్పడానికి విద్యార్థిని సాక్ష్యాధారాలను సమర్పించలేదని, ఆమె ప్రవేశాన్ని తిరస్కరించడం సబబేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. హైకోర్టు తీర్పు ఇచ్చే సమయంలో గతంలో తామిచ్చిన తీర్పును అనుసరించిందే తప్ప ఈక్వలెన్స్ సర్టిఫికెట్లను సరిగా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.