‣ భౌతిక శాస్త్రం.. జీవ శాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరు
‣ మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కటే ప్రశ్నపత్రం
‣ పరీక్ష సమయం 3 గంటలకు పెంపు!
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతిలో ఈసారి సైన్స్ సబ్జెక్టుకు ఒక్కటే పరీక్ష అయినా వేర్వేరుగా రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఓఎంఆర్ పత్రాలు ఇవ్వనున్నారు. సైన్స్లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులు ఉండడమే కారణం. ఒక్కో దానికి 40 మార్కుల చొప్పున 80 మార్కులకు రాత పరీక్ష. మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, రాయడానికి పేపర్లు కూడా విడివిడిగా ఇస్తారు. మూల్యాంకన సమయంలో సులభతరంగా ఉంటుందని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పరీక్ష సమయం 2.45 గంటలు కాగా దాన్ని 3 గంటలకు పెంచనుంది. వివరణాత్మక ప్రశ్నల్లో ‘ఎ’ లేదా ‘బి’ ప్రశ్నకు సమాధానం రాయాలని అడిగేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఎ, బి, సి డి.. ఇలా ఇచ్చి రెండు రాసే విధానాన్ని అమలు చేస్తారు. దానివల్ల విద్యార్థులకు మరింత ఛాయిస్ పెంచినట్లవుతుందన్నది విద్యాశాఖ ఆలోచన.
ముందు చిన్న పరీక్షలు!
మే 19వ తేదీ వరకు ఇంటర్ ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. అవి పూర్తికాకుండానే మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైతే పరీక్ష కేంద్రాలు, ఆరోగ్య, పోలీసు సిబ్బంది కొరత లాంటి సమస్యలు వస్తాయని పరీక్షల విభాగం భావిస్తోంది. టెన్త్లో ఓరియంటల్, ఒకేషనల్కు మూడు పరీక్షలు జరపాల్సి ఉంటుంది. వాటికి తక్కువ పరీక్ష కేంద్రాలే అవసరమవుతాయి కాబట్టి వాటిని ముందుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంటే మే 17, 18, 19 తేదీల్లో ఆ పరీక్షలు పూర్తయితే.. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే పరీక్షల విభాగం ఏ రోజు ఏ పరీక్ష అన్న దానిపై కాలపట్టిక విడుదల చేయనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.