* జూన్ 11న వెబినార్ ద్వారా నిర్వహించనున్న ఇంటర్బోర్డు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇంటర్ విద్యాశాఖ జూన్ 11న మధ్యాహ్నం 3 గంటలకు వెబినార్ ద్వారా కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. హిందీ మహావిద్యాలయ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చని చెప్పారు. కామర్స్, జీవశాస్త్రాలు, వృత్తి విద్యా కోర్సుల్లో అవకాశాలపై నిపుణులు వివరిస్తారని తెలిపారు. వెబినార్ ద్వారా హాజరయ్యేందుకు లింక్, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఇంటర్ రెండో సంవత్సరం కామర్స్లో ఈసారి కొన్ని పాఠ్యాంశాలు మారుస్తున్నామని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు జూన్ 15 లోపు ఇవ్వాలని చూస్తున్నామన్నారు. ఐసీఏఐ కేంద్ర కమిటీ సభ్యుడు దయానివాస్ శర్మ మాట్లాడుతూ దేశంలో సీఏల కొరత తీవ్రంగా ఉందన్నారు. సీఏలో కొంత వరకు పూర్తి చేసినా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనాలతో ఉద్యోగాలు దక్కుతాయని చెప్పారు.
బస్సు ఛార్జీలు ఉచితమని చెప్పలేదు
లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా లేనందున ఇంటర్ మూల్యాంకనం కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని, అయితే ఆర్టీసీని మాత్రం అధ్యాపకుల నుంచి వసూలు చేయవద్దని సూచించామని, ఉచితమని చెప్పలేదని కమిషనర్ జలీల్ తెలిపారు. భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున అధికంగా ఛార్జీలు నిర్ణయించారని, తాము అధ్యాపకుల నుంచి సాధారణ ఛార్జీని మాత్రమే మినహాయిస్తున్నామని తెలిపారు. మూడొంతులు ఇంటర్బోర్డే భరిస్తుందని చెప్పారు. అధ్యాపకులకు టీఏ, డీఏ ఇస్తున్నందున మళ్లీ బస్సు ఛార్జీలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న వారికి పారితోషికం చెల్లించాలని జిల్లా అధికారులను ఆదేశించామని, జూన్ 6వ తేదీలోగా అధ్యాపకుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.