• facebook
  • whatsapp
  • telegram

టీఆర్‌ఆర్‌ వైద్య కళాశాలకు అనుమతి

* రాష్ట్రంలో 5,040కి పెరగనున్న ఎంబీబీఎస్‌ సీట్లు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి మెదక్‌ జిల్లా పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్‌ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) షరతులతో అనుమతించింది. దీంతో మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. కళాశాల ప్రారంభానికి ముందే నిర్దేశిత ప్రమాణాల ప్రకారం బ్యాంకు పూచీకత్తు సమర్పించాలని, ఆ తర్వాతే ప్రవేశాలకు తుది అనుమతులిస్తామని ఎన్‌ఎంసీ షరతు విధించింది. ఈ 150 సీట్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,040కి పెరిగింది. వీటిలో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1,740 సీట్లుండగా.. ప్రైవేటులో 2,750, మైనారిటీలో 550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద ప్రభుత్వ కళాశాలల్లో మరో 190 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.
 

విస్తృత అవకాశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత వైద్యవిద్య కోటాలో జమ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను మినహాయించి, రాష్ట్రం నుంచి సుమారు 230 సీట్లను అఖిల భారత కోటాలోకి ఇస్తుండగా.. అన్ని రాష్ట్రాల నుంచి ఇలా సేకరించినవి కలిపి మొత్తంగా 6,410 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్‌ కళాశాలలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌లు, జిప్‌మర్‌ తదితర స్వయం ప్రతిపత్తి వైద్యసంస్థల్లోనూ నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే వైద్యవిద్య ప్రవేశాలు నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రవేశాల కోసమే ఎదురుచూడకుండా.. అఖిల భారత కోటాలోనూ దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో సీట్లు పొందడానికి అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అఖిల భారత కోటా ప్రవేశ ప్రకటన కూడా ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
 

రాష్ట్ర ర్యాంకులు.. ప్రవేశ ప్రకటన ఒకేసారి
అక్టోబరు 16న నీట్‌ ర్యాంకులు వెలువడినా.. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) నుంచి ఇంకా రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం చేరలేదు. అక్టోబరు చివరి వారంలో రాష్ట్ర ర్యాంకుల సమాచారం అందుతుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ర్యాంకులను ప్రకటించిన 7-10 రోజుల తర్వాత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరమే రాష్ట్రానికి సంబంధించిన తుది ర్యాంకుల జాబితాను వెల్లడిస్తారు. ఈ దఫా అంత సమయం లేకపోవడంతో.. రాష్ట్ర ప్రాథమిక ర్యాంకుల జాబితాతో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రకటననూ ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ వర్గాలు తెలిపాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.