* రాతపరీక్షలో ఎంపికయ్యేందుకు వీలుగా కోచింగ్
* రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇవ్వాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతూ.. కానిస్టేబుల్ కొలువులకు ఎంపిక కావాలని భావిస్తున్న విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త చెప్పబోతోంది. సంబంధిత ఉద్యోగానికి నిర్వహించే రాతపరీక్ష కోసం వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వాటిల్లో 20 చోట్ల తొలుత శిక్షణ తరగతులను ప్రారంభించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యేందుకు శారీరక దృఢత్వ పరీక్షతో పాటు రాతపరీక్షలోనూ ప్రతిభ చూపాలి. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదలైన ప్రతిసారి రాతపరీక్ష కోసం వేల మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సంస్థల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలన్న లక్ష్యంతో ఈ విద్యాసంవత్సరం నుంచి తమ అధ్యాపకులు, ఇతర నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కో కళాశాలలో 100 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి ఈ శిక్షణ ఇస్తారు. కళాశాలలు భౌతికంగా తెరిస్తే శిక్షణ ప్రారంభిస్తామని... ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆన్లైన్లోనూ ప్రారంభిస్తామని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇందుకు పోలీసు అధికారుల సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. త్వరలో పోలీసు శాఖ 17 వేల కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.