* నెలాఖరులోగా వైద్యవిద్య తొలివిడత సీట్ల కేటాయింపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లకు నవంబరు 23 నుంచి వెబ్ ఆప్షన్లను నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 20 నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రక్రియ పూర్తికాగానే అదేరోజు రాత్రి లేదా, నవంబరు 21న ఉదయం అర్హుల తుది జాబితాను వెల్లడించనున్నారు. అభ్యర్థుల నుంచి ఏమైనా వినతులు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండు రోజుల సమయం తీసుకుంటారు. అనంతరం వైద్యకళాశాలలను ఆన్లైన్లో ఎంచుకోవడానికి నవంబరు 23న నుంచి విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రక్రియలో ఒకట్రెండు రోజుల వ్యత్యాసం ఏర్పడినా.. నెలాఖరులోగా తొలివిడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించడానికి ఆరోగ్య విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. కన్వీనర్ కోటాలో తొలివిడత ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన వెలువరిస్తారు. వైద్యవిద్య ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినప్పటికీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అఖిల భారత వైద్యవిద్య కోటాలో తొలివిడత ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే.. రాష్ట్రంలోనూ తొలివిడత ప్రవేశాల్లో భాగంగా వెబ్ఆప్షన్లకు అవకాశమివ్వాలి. అయితే పలు ధ్రువపత్రాల్లో లోపాలుండటమే జాప్యానికి కారణమని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
రెండో విడత అఖిల భారత వైద్యవిద్య ప్రవేశాలను నవంబరు 20 నుంచి నిర్వహించనున్నారు. మొదట నవంబరు 18 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా.. సాంకేతిక కారణాల వల్ల 20వ తేదీకి వాయిదా వేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. నవంబరు 20 నుంచి 24 వరకూ రెండోవిడతలో వెబ్ఆప్షన్లను ఎంచుకోవాలి. 27న కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబరు 8లోగా కేటాయించిన కళాశాలల్లో చేరాలి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.