• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ సెక్షన్‌-బిలో ఏవైనా ఐదింటికే జ‌వాబులు

* ఎక్కువ రాద్దామ‌న్నా సాప్ట్‌‌వేర్‌ అనుమతించదు
* స్పష్టతనిచ్చిన ఎన్‌టీఏ


ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లోని న్యూమరికల్‌ 10 ప్రశ్నల్లో ఏవైనా అయిదింటికి మాత్రమే విద్యార్థులు జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. సాధారణంగా పేపర్‌-1లో ఒక్కో సబ్జెక్టులో 25 ప్రశ్నల చొప్పున మూడు సబ్జెక్టుల్లో 75 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు పూరించే ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 300. అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ఈసారి ఫిబ్రవరిలో జరిగే మెయిన్‌ పేపర్‌-1లో ప్రతి సబ్జెక్టును సెక్షన్‌-ఏ, సెక్షన్‌-బిగా విభజించారు. సెక్షన్‌-ఏలో 20 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. వాటన్నింటికీ జవాబులు గుర్తించాలి. ఇక సెక్షన్‌-బిలో 10 న్యూమరికల్‌ ప్రశ్నలు ఇస్తారు. వాటికి జవాబులు అంకెల్లో ఉంటాయి. అభ్యర్థులు తమకు ఇష్టమైన అయిదింటికి జవాబులు రాయాలని ఎన్‌టీఏ ఇటీవల పేర్కొంది. దీనిపై సందేహాలు వ్యక్తమవ్వడంతో వాటిని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌ జోషి దృష్టికి ‘ఈనాడు’ తీసుకెళ్లింది. పది ప్రశ్నలు ఉన్నా 5 ప్రశ్నలకు జవాబులు రాయాలని, అంతకంటే ఎక్కువ రాయాలనుకున్నా దాన్ని సాఫ్ట్‌వేర్‌ తీసుకోకుండా రూపకల్పన చేశామని తెలిపారు. ఒకవేళ మొదటి 5 జవాబుల్లో సందిగ్ధత ఉన్న దాన్ని తొలగిస్తే ఆ స్థానంలో మరోదానికి జవాబు రాయడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది ఉంటారు.

ఒకేసారి రుసుం చెల్లించొచ్చు..

ఈసారి ఫిబ్రవరి నుంచి మే వరకు 4 విడతలుగా జేఈఈ మెయిన్‌ జరుగుతున్నందున ఒకేసారి 4 విడతలకు పరీక్ష రుసుం చెల్లించవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక విడత పరీక్ష రాసేందుకు ఆసక్తి లేకుంటే దానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు విషయం ముందుగా చెబితే ఫీజు వెనక్కి ఇస్తారు. ఈసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానందున గతంతో పోలిస్తే ఫిబ్రవరి పరీక్షలకు 10-20 శాతం మంది తగ్గుతారని జేఈఈ శిక్షణ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. మెయిన్‌కు దరఖాస్తు సమయం జనవరి 16వ తేదీకి ముగియనుందని, ఆలోగా ఇంటర్‌బోర్డు పరీక్షలపై స్పష్టత వస్తే ఎన్ని విడతలకు ఫీజు చెల్లించాలన్నది విద్యార్థులు నిర్ణయించుకుంటారన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.