• facebook
  • whatsapp
  • telegram

మెరికలకు ఇంజినీరింగ్‌ పట్టం కట్టేదేలా?

* 100లోపు ర్యాంకుల వారికి త‌గ్గిన ఆస‌క్తి 


ఈనాడు - అమరావతి: ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్‌, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మెరికలులాంటి విద్యార్థులు బయటకు వెళ్లిపోతున్నారు. ప్రవేశాలకు ఆసక్తి చూపే అభ్యర్థుల కంటే రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని సీట్లే అధికంగా ఉంటున్నాయి. కొన్ని కళాశాలల్లోనే యాజమాన్య, కన్వీనర్‌ కోటాకు డిమాండ్‌ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెరగకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిభ ఉన్న వారు ఎటు వైపు?
ఎంసెట్‌లో 1-100 ర్యాంకులు సాధించిన వారిలో ఒక్కరు కూడా ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోలేదు. 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో 6,188మంది మాత్రమే ప్రవేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 101-200లోపు ర్యాంకుల్లో ఇద్దరే కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చారు. 500లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కేవలం 40మంది మాత్రమే విద్యా సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. సాధారణంగా 5వేలలోపు ర్యాంకులు సాధించిన వారిని ప్రతిభ గల విద్యార్థులుగా భావిస్తారు. ఇలా ప్రతిభ కలిగిన వారిలోనూ 2,565మంది మాత్రమే ఐచ్ఛికాలు నమోదు చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఐచ్ఛికాల నమోదు, మార్పునకు జ‌న‌వ‌రి 1తో గడువు మగిసింది.

కోర్సుల ఎంపికకు 82వేలు మంది..
ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు 90,076మంది రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 89,078మంది కోర్సుల ఎంపికకు అర్హత సాధించారు. చివరి రోజు వరకు ఐచ్ఛికాల నమోదుకు 83,701మంది పాస్‌వర్డ్‌ సృష్టించుకోగా 82,925మంది కోర్సులు, కళాశాలల ఎంపికకు సంసిద్ధత తెలిపారు.

మిగిలిపోతున్న‌ సీట్లు..
ఇంజినీరింగ్‌లో సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి. కన్వీనర్‌ కోటాలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 91,875 సీట్లు ఉండగా.. చివరి రోజు రాత్రి 7గంటల వరకు పాస్‌వర్డ్‌ సృష్టించుకున్న వారు 83,701మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య కొంత పెరిగి 84వేల వరకు వెళ్లినా రాష్ట్రంలో 7,800కుపైగా సీట్లు మిగిలిపోనున్నాయి. యాజమాన్య కోటా, కన్వీర్‌ కోటా కలిపి మొత్తం 1,29,016 సీట్లు ఉండగా.. వీటిపై 10శాతం ఈడబ్ల్యుఎస్‌ కోటా సీట్లు వస్తాయి. అదనంగా వచ్చే 12,900 సీట్లలోనూ మిగిలేవే అధికం.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.