* 175 కళాశాలల్లో 60 వేలకు పైగా సీట్లు
* ఫీజు సర్దుబాటుకు యోచన
ఈనాడు-గుంటూరు: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను మాన్యువల్గా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 175 కళాశాలల్లో 60 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. గత ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. అయినా పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసింది. జిల్లాలో 56 వేల మంది ఉత్తీర్ణులై ఇంటర్లో చేరటానికి గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. వీరందరికి ప్రస్తుతం మాన్యువల్ ప్రవేశాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు జరగనుండటం తెలుసుకుని ఊరట చెందుతున్నారు. సాధ్యమైనంత వరకు సంక్రాంతికి ముందుగానే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇంటర్ అధ్యాపకులు చెబుతున్నారు. సుమారు 30 వేల మందికి పైగా విద్యార్థులు జిల్లా నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.అరకోటికి పైగా బోర్డుకు ఆదాయం సమకూరింది. జూనియర్ ఇంటర్లో చేరిన ప్రతి ఒక్కరూ బోర్డు రికగ్నైజ్ ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈమొత్తాన్ని అలా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని, విద్యార్థులు ఎవరూ ఈ ఫీజుల విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఇంటర్మీడియట్బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులపై ఆర్థికపరమైన భారాలు లేకుండా చూడాలని కోర్టు ఆదేశాలు ఉండటంతో విద్యార్థులు చెల్లించిన ఈ ఫీజులకు ఎలాంటి ఢోకా ఉండదని ఆర్ఐఓ జడ్.ఎస్.రామచంద్రరావు తెలిపారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆగస్టు వరకు తరగతులు బోధించి సెప్టెంబరులో పబ్లిక్ పరీక్షలు పెడితే బాగుంటుందని అధ్యాపక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఎలాగూ గతంలో సెప్టెంబరులో అనుబంధ పరీక్షలు నిర్వహించేవారని, వాటి స్ధానే తుది పరీక్షలు ఆ నెలలో నిర్వహించటం వల్ల విద్యార్థులకు సిలబస్ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయొచ్చని ఓ ఉపాధ్యాయ నేత అన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.