‣ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్).. దేశ సరిహద్దు భద్రతే ధ్యేయంగా అమూల్యమైన సేవలను అందిస్తోంది. తాజాగా గ్రూప్-సి కేటగిరీలో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, తర్వాత పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరికి మెడికల్ ఎగ్జామినేషన్.. ఇలా మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది!
మొత్తం 247 ఖాళీల్లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) 217, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) 30 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు పోస్టులకూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా పదో తరగతి పాసై రేడియో అండ్ టెలివిజన్లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్/ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్/ కమ్యూనికేషన్ ఎక్యుప్మెంట్ మెయింటెనెన్స్/ కంప్యూటర్ హార్డ్వేర్/ నెట్వర్క్ టెక్నీషియన్/ మెకట్రానిక్స్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు రుసము రూ.100 ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంఎస్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్-సర్వీస్మెన్కు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష
ఓఎంఆర్ విధానంలో 100 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.
ప్రశ్నపత్రం 4 పార్టులుగా ఉంటుంది.
‣ పార్ట్-1లో ఫిజిక్స్ 40 ప్రశ్నలు (80 మార్కులు)
‣ పార్ట్-2లో మేథమెటిక్స్ 20 ప్రశ్నలు (40 మార్కులు)
‣ పార్ట్-3లో కెమిస్ట్రీ 20 ప్రశ్నలు (40 మార్కులు)
‣ పార్ట్-4లో ఇంగ్లిష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు (40 మార్కులు)
సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్లో.. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. ఈ పరీక్షలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 38 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సంపాదించాలి.
‣ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అభ్యర్థులకు ఇంగ్లిష్లో 150 పదాల డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది. దీనికి 50 మార్కులు. దీంట్లో అక్షరాల తప్పులకు అర మార్కు, పదాల్లో తప్పులకు 1 మార్కు తగ్గిస్తారు. పేరాగ్రాఫ్ రీడింగ్ కూడా ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల ఉచ్చారణను అంచనా వేస్తారు. దీంట్లో జనరల్ అభ్యర్థులు 38 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి.
శారీరక ప్రమాణాలు
పురుష అభ్యర్థుల ఎత్తు 168 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ 80 సెం.మీ. ఉండి, గాలి పీల్చిప్పుడు 85 సెం.మీ. వ్యాకోచించాలి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పురుష, మహిళా అభ్యర్థులకు ఎత్తులో మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఎత్తుకు తగినంత బరువూ ఉండాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ): దీంట్లో భాగంగా పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. పరుగును ఆరున్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్జంప్కు, మూడున్నర అడుగుల హైజంప్కు మూడు అవకాశాలు ఇస్తారు. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల రేస్ను 4 నిమిషాల్లో ముగించాలి. 9 అడుగుల లాంగ్జంప్, 3 అడుగుల హైజంప్కు మూడు అవకాశాలు ఉంటాయి. ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది. బీఎస్ఎఫ్ ఉద్యోగులకు పీఎస్ఈ/ పీఈటీ/ డీఎంఈల నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు ఒక్క రాత పరీక్షకు హాజరైతే సరిపోతుంది.
రెండు దశల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు మూడో దశలో.. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
గమనించాల్సినవి..
‣ రెండు పోస్టులకూ దరఖాస్తు చేసే అభ్యర్థులు రెండు దరఖాస్తులు నింపాలి. వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
‣ అభ్యర్థుల తుది ఎంపిక ఓఎంఆర్ విధానంలోని రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.05.2023
రాత పరీక్ష తేదీ: 04.06.2023
వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్లు
‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ