• facebook
  • whatsapp
  • telegram

షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

మారిటైమ్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు ప్రకటన

సుదూర ప్రాంతాలకు చేసే వస్తు రవాణా మార్గాల్లో కీలకమైనది సముద్రం. పెద్ద తీరరేఖ ఉండటం మనదేశ ప్రత్యేకత. దీంతో పోర్టులు విస్తరిస్తున్నాయి. కొత్తవీ ఏర్పాటవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జలరవాణాను విస్తరిస్తున్నాయి. షిప్పింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి మేటి అవకాశాలు అందిస్తున్నాయి. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికోసం ప్రత్యేక సంస్థలు, కోర్సులూ ఉన్నాయి. వాటిలో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ ముఖ్యమైంది. ఈ సంస్థ ఇటీవల పలు డిప్లొమా, యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. 

షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని నెలకొల్పింది. దీనికి నవీ ముంబై, ముంబై పోర్టు, కోల్‌కతా, విశాఖపట్నం, కొచిల్లో క్యాంపస్‌లు ఏర్పాటుచేశారు. వీటికి దేశవ్యాప్తంగా 17 అనుబంధ కళాశాలలూ ఉన్నాయి. ఈ సంస్థల్లోని కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపాలి. వీటిని పూర్తిచేసుకున్నవారు కెప్టెన్, ఇంజినీర్, షిప్‌ బిల్డర్, డిజైనర్, పోర్ట్‌ మేనేజర్, లాజిస్టిక్స్‌ ఎక్స్‌పర్ట్‌.. పలు హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. 

భారత్‌లో 12 మేజర్, 200కు పైగా నాన్‌ మేజర్‌ పోర్టులు ఉన్నాయి. దేశం వెంబడి సుమారు 7500 కి.మీ. తీర రేఖ ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర రవాణా కీలక పాత్ర వహిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నౌకాయానానికి ప్రాధాన్యమూ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో భారీస్థాయిలో సామగ్రిని జల మార్గం ద్వారా దేశాలు, ఖండాలు దాటిస్తున్నారు. ఇందులో నౌకలు, నిపుణుల పాత్రే కీలకం. ఈ విభాగంలో సేవలు అందిస్తున్నవారు ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు. 

ఇవీ కోర్సులు..

అండర్‌ గ్రాడ్యుయేట్‌ 

బీటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌

బీబీఏ: లాజిస్టిక్స్, రిటైలింగ్‌ అండ్‌ ఇ-కామర్స్‌

బీఎస్సీ: నాటికల్‌ సైన్స్, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌   

డిప్లొమా: నాటికల్‌ సైన్స్‌ 

అర్హత: బీఎస్సీ, బీటెక్, డిప్లొమా కోర్సులకు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణులు అర్హులు. అలాగే పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. బీబీఏ కోర్సుకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. 

పీజీ

ఎంటెక్‌: నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, డ్రెడ్జింగ్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్, మెరైన్‌ టెక్నాలజీ

ఎంబీఏ: ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌ 

అర్హత: ఎంటెక్‌ కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్‌. ఎంబీఏ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ.

పీజీ డిప్లొమా

మెరైన్‌ ఇంజినీరింగ్‌

అర్హత: బీఈ/ బీటెక్‌ 50 శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ నావల్‌ ఆర్కిటెక్చర్‌. 

కష్టపడాలనే స్వభావం, సముద్ర యానంపై ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ మారిటైమ్‌ వర్సిటీ, అనుబంధ సంస్థలందించే  కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 

ప్రవేశం ఎలా?

ఈ సంస్థల్లోని సీట్లకు వివిధ మార్గాల్లో ప్రవేశం పొందవచ్చు. బీబీఏ కోర్సులకు సీయూఈటీ యూజీ/ఇంటర్‌ మార్కులతో అవకాశం కల్పిస్తారు. పీజీలో కొన్ని కోర్సులకు సీయూఈటీ పీజీ/ గేట్‌ స్కోరుతో అవకాశం ఉంటుంది. క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ స్కోరుతో ఎంబీఏ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఐఎంయూ సెట్‌)తోనూ అవకాశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు అకడమిక్‌ మార్కుల మెరిట్‌తోనూ చేర్చుకుంటారు.  

ఐఎంయూ సెట్‌

యూజీ కోర్సుల ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 10+2 స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏ కోర్సులకు 120 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 

ఎంటెక్‌ కోర్సుల ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. లాజికల్‌ రీజనింగ్, మ్యాథ్స్‌తోపాటు మెకానికల్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ మెరైన్‌/ సివిల్‌ వీటిలో ఏదో ఒక విభాగం నుంచి అభ్యర్థి జవాబులు రాయాలి. అన్ని పరీక్షలూ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పు సమాధానాలకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 

ఐఎంయూ.. పీహెచ్‌డీ, ఎంఎస్‌ రిసెర్చ్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి 3 గంటల వ్యవధితో రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌-1లో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిని రెండు గంటల్లో పూర్తిచేయాలి. పార్ట్‌-2లో గంట వ్యవధితో ఎస్సే ఉంటుంది. పరీక్షలో విజయవంతమైనవారికి ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.   

దరఖాస్తులకు చివరి తేదీ: మే 18

పరీక్ష తేదీ: జూన్‌ 10

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://www.imu.edu.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date: 03-05-2023


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌