‣ మనీష, తారకల సక్సెస్ స్టోరీ
కష్టాలు, కన్నీళ్లు.. ఆకలి, అవమానాలతో రాటుతేలిన లక్ష్యాలు వీళ్లవి. అమ్మానాన్నలు దినసరి కూలీలుగా.. పారిశుద్ధ్య కార్మికులుగా కష్టపడుతుంటే వాళ్లని ఆ కష్టాల నుంచి బయటపడేయాలని కసితో చదువుకున్నారు. సివిల్ ఎస్సై పోస్టులు సాధించి, ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు ఖమ్మం జిల్లాకు చెందిన మిడిదొడ్డి మనీష, మహబూబ్నగర్ జిల్లాకి చెందిన బందిగొల్ల తారక. వారితో వసుంధర మాట్లాడింది..
అమ్మ పాచిపని చేసేది..

నాన్న పారిశుద్ధ్య కార్మికుడు..
మాది మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామం. అమ్మ వెంకటేశ్వరమ్మ రోజుకూలి. నాన్న వెంకటేష్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడు. మా సొంతూరులో బతుకుదెరువు లేక 18 సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ వచ్చాం. అమ్మానాన్నలు కష్టపడి నన్ను చదివించేవారు. నాకో అన్నయ్య. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నల కష్టాలను చూస్తూ పెరగడంతో ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించాలనే తపనతో ఉండేదాన్ని. డిగ్రీ అయ్యాక చదివించింది చాల్లే పెళ్లిచేయండని చాలామంది మా అమ్మానాన్నలకు చెప్పేవాళ్లు. కొవిడ్ సమయంలో ఆ ఒత్తిడి మరీ ఎక్కువయ్యింది. కానీ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పెళ్లిని వాయిదా వేశా. అప్పుడే పోలీస్ ఉద్యోగాలు పడటంతో.. కోచింగ్ సెంటర్లో చేరా. అక్కడ గ్రాండ్ టెస్టులు రాస్తున్నపుడు మొదట్లో మార్కులు చాలా తక్కువవచ్చేవి. దానికితోడు జోగులాంబ జోన్లో సివిల్ ఎస్సై పోస్టులు తక్కువ ఉన్నాయి. ‘ఈ మార్కులకి మొదటి ప్రయత్నంలో నీకేం వస్తుందిలే’ అంటూ చాలామంది నిరాశపరిచేవారు. అలాంటి పరిస్థితుల్లో నేనూ నావల్ల కాదేమో అనుకొనేదాన్ని. అప్పుడు అమ్మ ‘ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయమని’ ధైర్యం చెప్పేది. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహంతో కసిగా చదివి, సాధించా. జోగులాంబ జోన్లో సివిల్ ఎస్సై సాధించడంతో ఇప్పుడు అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజులూ వాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషంగా ఉన్నా.
- బుడత చంద్రశేఖర్, ఈనాడు జర్నలిజం స్కూల్
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్’
‣ ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా!
‣ ప్రాంప్ట్ ఇంజినీర్.. కోట్లలో ప్యాకేజీ!