• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మరోసారి టాప్‌ ర్యాంకులో మద్రాస్‌ ఐఐటీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఓవరాల్‌ కేటగిరీ - 2022లో ప్రథమస్థానం 

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను మదింపు చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఆయా కేటగిరీల వారీ ప్రముఖ సంస్థల జాబితాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) వెలువరిస్తోంది. తాజాగా 2022 ర్యాంకులు విడుదలయ్యాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన ఓవరాల్‌ కేటగిరీలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ మొదటి స్థానం కైవసం చేసుకోవడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఐఐటీ-ఎం లోని కోర్సులు, ప్రవేశ మార్గాల వివరాలు తెలుసుకుందాం!

మన దేశంలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఐఐటీలే ముందుంటున్నాయి. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అలాకాకుండా ఓవరాల్‌గా మేటి సంస్థల జాబితాలో ఐఐటీలకు చోటుదక్కడం గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. అదికూడా వరుసగా 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఒకే సంస్థ తొలి స్థానం సొంతం చేసుకోవడం విశేషమే. జర్మనీ సాంకేతిక, ఆర్థిక సహకారంతో 1959లో ప్రారంభమైన ఐఐటీ మద్రాస్‌ దినదినాభివృద్ధి చెందుతూ దేశంలో శిఖర స్థాయికి చేరుకుంది. 

ఈ సంస్థలో సుమారు 8000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పడానికి 550 మంది ఫ్యాకల్టీ సభ్యులు అందుబాటులో ఉన్నారు. అలాగే వ్యవహారాలన్నీ సజావుగా కొనసాగడానికి 1250 మంది అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పనిచేస్తున్నారు. మొత్తం 100 ల్యాబొరేటరీలు ఉన్నాయి. ప్రాంగణ విస్తీర్ణం 250 హెక్టార్లు. 

ఇవీ కోర్సులు... 

బీటెక్, డ్యూయల్‌ డిగ్రీ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ సంస్థలో మొత్తం 16 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇవి పలు విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. 

బీటెక్‌ కోర్సులకు ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో, ఎంటెక్‌ చదువులకు గేట్‌ స్కోరుతో ఐఐటీ మద్రాస్‌లో చదువుకోవచ్చు. బీటెక్‌లో రెగ్యులర్‌ కోర్సులతోపాటు నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్, బయోమెడికల్‌ డిజైన్‌లో డ్యూయల్‌ డిగ్రీలను ఈ సంస్థ అందిస్తోంది. 

ఈ సంస్థకు చెందిన హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఇంటర్‌ విద్యార్హతతో అయిదేళ్ల ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ స్టడీస్‌ అందిస్తున్నారు. హయ్యర్‌ సెకండరీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) పేరుతో నిర్వహించే పరీక్షతో ఈ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. 

యూజీ సైన్స్‌ విద్యార్థుల కోసం ఎమ్మెస్సీ- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశం ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టు ఎమ్మెస్సీ (జామ్‌) పరీక్ష ద్వారా లభిస్తాయి. ఈ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలూ ఉన్నాయి. జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)లో చూపిన ప్రతిభతో వాటిలో చేరవచ్చు. 

ఇక్కడ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో భాగంగా ఎంబీఏ కోర్సు అందిస్తున్నారు. ఐఐఎంలు నిర్వహించే క్యాట్‌లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది.

టెక్‌ ఎంబీఏ: ఐఐటీ మద్రాస్‌ 2019 విద్యా సంవత్సరం నుంచి టెక్‌ ఎంబీఏ కోర్సును ఇక్కడ చదువుతోన్న బీటెక్‌ విద్యార్థుల కోసం అందిస్తోంది. దీనిని అయిదేళ్ల ఇంటర్‌ డిసిప్లినరీ డ్యుయల్‌ డిగ్రీ పేరుతో నడుపుతున్నారు. ఇందులో చేరినవారికి బీటెక్‌తోపాటు ఎంబీఏ పట్టా కూడా అందిస్తారు. ఈ సంస్థలో చదువుతోన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టెక్‌ ఎంబీఏ కోర్సులోకి అవకాశం కల్పిస్తారు.

ఆన్‌లైన్‌ కోర్సుకు విశేషాదరణ

ఈ సంస్థ 2020 నుంచి ఆన్‌లైన్‌లో అందిస్తోన్న బీఎస్సీ ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సు విశేష ఆదరణ పొందుతోంది. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో సేవలు అందించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.  

ఓవరాల్‌లో టాప్‌ టెన్‌ సంస్థలు 

ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రవుర్కెలా, గువాహటి, ఎయిమ్స్‌-న్యూదిల్లీ, జేఎన్‌యూ-న్యూదిల్లీ.

తెలుగు రాష్ట్రాల్లో: ఐఐటీ-హైదరాబాద్‌ 14, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 20, ఎన్‌ఐటీ వరంగల్‌ 45, ఉస్మానియా యూనివర్సిటీ 46, కేఎల్‌ యూనివర్సిటీ 54, ఆంధ్రా యూనివర్సిటీ 71 స్థానాల్లో నిలిచాయి.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ మదింపు ఇలా..

బోధన, అభ్యాసం, వనరులు: మొత్తం విద్యార్థులు, వారిలో డాక్టొరల్‌ కోర్సులు చదువుతున్నవారు; ఆచార్యులు, విద్యార్థుల నిష్పత్తి; శిక్షకుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నవారు, ఆర్థిక వనరులు, వాటిని ఉపయోగించిన విధానం 

పరిశోధన, వృత్తి అభ్యాసం: మొత్తం ఎన్ని పుస్తకాలు/ పరిశోధన పత్రాలు ప్రచురించారు. వాటి నాణ్యత ఎలా ఉంది. మేథో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌), పేటెంట్లు ఎన్నింటికి దక్కాయి, చేపడుతోన్న ప్రాజెక్టులు చూపుతోన్న ముద్ర 

పట్టాలు పుచ్చుకున్నవారు: మొత్తం ఎంత మంది విద్యార్థులు చేరారు, వారిలో పట్టాలతో విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారు ఎందరు, ఎంతమందికి పీహెచ్‌డీ దక్కింది

వైవిధ్యం: ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఎంత మంది చేరుతున్నారు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడినవారు, దివ్యాంగులు ఎంత మంది చొప్పున ఉన్నారు, వారికి కల్పిస్తోన్న సౌకర్యాలు

లోకనాడి: ఉద్యోగులు, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేస్తున్న నిపుణులు ఏ విద్యా సంస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు పైన తెలిపిన విషయాలకు కొన్నేసి పాయింట్లు కేటాయిస్తారు. ఈ ప్రామాణికాల ప్రకారం అన్ని వివరాలూ మదించి, ఫలిత విలువను లెక్కిస్తారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 18-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌