• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్‌సీఎఫ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

* బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు


 

రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన అనుబంధ సంస్థ.. ‘రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌)’. ముంబయిలోని ఈ సంస్థ ఎరువుల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. తాజాగా ఆర్‌సీఎఫ్‌ఎల్‌ 124 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ విద్యార్హతతో ఆన్‌లైన్‌లో  దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ను భోపాల్, దిల్లీ/దిల్లీ ఎన్‌సీఆర్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువహటీ, కోల్‌కతా, ముంబయి/న్యూ ముంబయి/ థానే/ ఎంఎంఆర్‌ రీజియన్, నాగ్‌పుర్‌లలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. తర్వాత అడ్మిట్‌కార్డ్‌ ద్వారా పరీక్ష తేదీని తెలియజేస్తారు. ఆర్‌సీఎఫ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఈ కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి


మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా కెమికల్‌లో-28, బాయిలర్‌లో-10, మెకానికల్‌లో-6, ఎలక్ట్రికల్‌-10, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-12, సివిల్‌-1, సేఫ్టీ-4, సీసీల్యాబ్‌-7, మార్కెటింగ్‌-37, ఐటీ-3, హెచ్‌ఆర్‌-2, హెచ్‌ఆర్‌డీ-3, అడ్మినిస్ట్రేషన్‌-1 ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. 01.05.2023 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1000. 
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో నెలకు రూ.30,000 వేతనంగా చెల్లిస్తారు. ఉచిత వసతి, వైద్య సదుపాయాలుంటాయి. ఏడాది శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన వారికి వేతనం రూ.40,000 చెల్లిస్తారు. మూలవేతనానికి వీడీఏ, పర్క్స్, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ అన్నీ కలిపి నెలకు రూ.80,000 వరకూ వేతనాన్ని అందుకోవచ్చు.  


నియామక పరీక్ష సంగతి?

ఆన్‌లైన్‌ టెస్ట్‌ ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో 100 ప్రశ్నలకు ఉంటుంది. దీంట్లో రెండు భాగాలుంటాయి. పార్ట్‌-1లో డిగ్రీలో చదివిన సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు.


 ఆన్‌లైన్‌ టెస్ట్‌లో సాధించిన మార్కులకు 80 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


సన్నద్ధత ఇలా

పరీక్ష తేదీనీ ఇంకా వెల్లడించలేదు. కాబట్టి సన్నద్ధతను ఇప్పటినుంచే మొదలుపెడితే చదవడానికి ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. 

సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించారు. ప్రశ్నలన్నీ చదివిన సబ్జెక్టుల్లోని అంశాల నుంచే ఉంటాయి కాబట్టి వాటిని పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులను సాధించడం సులువవుతుంది.

టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకూ సమయాన్ని విభజించాలి. క్లిష్టంగా అనిపించే సబ్జెక్టుకు కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. రీజనింగ్, ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిపై ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. 

రోజుకో మోడల్‌ పేపర్‌ రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో నిర్ణీత సమయంలోనే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలుగుతున్నారో లేదో తెలుస్తుంది. అలాగే ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో అర్థమవుతుంది. దాన్ని బట్టి సన్నద్ధతను మెరుగుపరుచకోవచ్చు.  

‣ బ్యాంకు పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్లా ప్రయోజనం ఉంటుంది. వీటిల్లోనూ జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటాయి కాబట్టి వీటిని ప్రయత్నించవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2023

వెబ్‌సైట్‌: http://www.rcfltd.com/
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం

‣ భాషలపై పట్టు.. అవకాశాలు మెండు

‣ అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఉత్తమ మార్గం

Posted Date : 03-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.