• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పోటీ పరీక్షలకు మార్గదర్శకాలు

ఉద్యోగ సాధనకు సూచనలు

పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో మంది విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. దీంట్లో భాగంగా త్రివిధ దళాలు, యూపీఎస్సీ, బ్యాంక్‌, రైల్వే, స్టాఫ్‌  సెలక్షన్‌ కమిషన్‌..లాంటి కేంద్ర, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు లక్షలమంది అభ్యర్థులు హాజరవుతుంటారు. విద్యార్హతలు వేరయినా.. పోటీ పరీక్షలు రాయడం మాత్రం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వీరికి ఉపయోగపడే  మార్గదర్శకాలు తెలుసుకుందామా?

పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చదివిన సబ్జెక్టుపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. అంటే చిన్న తరగతి నుంచీ చదివిన ప్రాథమికాంశాలను బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యంశాలనూ నోటు పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాతా, పరీక్ష రాసేనాటికీ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి.

పోటీ పరీక్షలకు ముఖ్యంగా కావాల్సింది సమయ నిర్వహణ. టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించాలి. మూడ్‌ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్లకూడదు.

వ్యక్తిగత క్రమశిక్షణా, అంకితభావం ఎంతో అవసరం. ఒకేసారి అన్నీ చదివేయాలనే ఆత్రుత పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పాటుచేసుకోవాలి. వాటి సాధనకు నిరంతరం కృషిచేయాలి. చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా వాటిని తట్టుకుని ఏకాగ్రతతో చదవాలి.

ప్రాక్టీస్‌ ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయడానికి ప్రయత్నించాలి. ఇలాచేస్తే పరీక్ష విధానాన్ని అర్థంచేసుకోవడం సులువవుతుంది. అవగాహన పెరగడంతో పరీక్ష ఎలా ఉంటుందోననే ఆందోళనా తగ్గుతుంది. సమస్యా పరిష్కార నైపుణ్యమూ పెరుగుతుంది.

ప్రశ్నపత్రంలో తెలిసిన అంశాలు చాలా ఉన్నా.. వాటిని నిర్దిష్ట సమయం లోపల రాయలేక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి ఆ సమయంలోనే అన్ని అంశాలూ రాయగలుగుతున్నారో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు పరీక్ష సమయం రెండు గంటలు అయితే.. పాత ప్రశ్నపత్రాన్ని ఆ వ్యవధిలోనే పూర్తిచేయాలి. మొదట్లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినా ఆ తర్వాత సాధన చేస్తుంటే ఈ సమస్య తలెత్తదు.

చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు సీనియర్ల, లెక్చరర్ల, నిపుణుల సలహాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

పునశ్చరణ, ప్రశ్నల సాధన, సందేహ నివృత్తి కోసం ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌నూ ఉపయోగించుకోవచ్చు.

మాక్‌ టెస్ట్‌లు రాయడం అత్యంత అవసరం. తరచూ వీటిని రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. మీ సామర్థ్యాన్ని సమీక్షించుకునే అవకాశం కలుగుతుంది. ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాలనే విషయంలో స్పష్టత వస్తుంది. పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలో మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.

సన్నద్ధత సమయంలో కొంతమంది విద్యార్థులు విపరీతమైన ఆందోళన, ఒత్తిడులకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు.

అంకితభావంతో ఎంత కష్టపడి చదివినా.. ఒక్కోసారి ప్రేరణ కరవవుతుంది. నిరాశగానూ అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో పరీక్షలు బాగా రాయడానికి మరింత కృషిచేయొచ్చు.

కొన్ని నెలలపాటు గంటలకొద్దీ కూర్చుని చదవడం వల్ల నడుంనొప్పీ, తలనొప్పీ, నిద్రలేమి.. లాంటి సమస్యలు బాధించే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చదువు మధ్యలో చిన్న విరామం తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పోషకాహారం తినడం, వ్యాయామాలు చేయడం లాంటి చక్కని జీవనశైలినీ అనుసరించాలి.

విద్యార్థులందరి సన్నద్ధతా ఒకే విధంగా ఉండదు. కొందరు రాత్రిళ్లు ఎక్కువసేపు చదివితే.. మరికొందరు ఉదయాన్నే లేచి చదవగలుగుతారు. కాబట్టి ఎవరికి అనువుగా ఉండే సమయాలను వాళ్లు ఎంచుకుని సన్నద్ధతను సమర్థంగా కొనసాగించాలి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!

‣ సాధారణ డిగ్రీతో సంచలనం

‣ జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!

‣ నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

Posted Date : 28-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.