• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెయిల్‌లో టెక్నీషియన్‌ ట్రైనీలు

* అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌తో దరఖాస్తుకు అవకాశం

 స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.    మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు    చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మొత్తం 85 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 35, ఎస్సీలకు 10, ఎస్టీలకు 22, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100. ఈ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 

01.05.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఈఎస్‌ఎంలకు మూడేళ్లు, సెయిల్‌ ఉద్యోగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 75 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 79 సెం.మీ. వరకూ పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ. ఉండి, బరువు 35 కేజీలు ఉండాలి. అభ్యర్థులకు దృష్టి లోపాలు ఉండకూడదు.  

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ, ఏడాది ప్రొబేషన్‌ ఉంటుంది. మొదటి ఏడాది శిక్షణ సమయంలో నెలకు రూ.12,900 చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.15,000 చెల్లిస్తారు. శిక్షణ సమయంలో ఉద్యోగి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం ఉంటుంది. కంపెనీ నిబంధనల ప్రకారం సెలవులు ఉంటాయి. శిక్షణ కాలం విజయవంతంగా పూర్తిచేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. 

ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు. స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

సీబీటీ: దీంట్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎ) జనరల్‌ నాలెడ్జ్‌ బి) లాజికల్‌ రీజనింగ్‌ సి) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. ఇండివిడ్యువల్‌ టెస్ట్‌పైనా, టోటల్‌ స్కోర్‌ మీద కటాఫ్‌లను రెండు దశల్లో అమలుచేస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ పరీక్ష పాసవ్వాలంటే.. అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.  

స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌: రాత పరీక్ష ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఈ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అవసరమైన కాల్‌ లెటర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి.. ఆ సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్‌కు తెలియజేస్తారు.  

దరఖాస్తుల ప్రారంభం: 04.11.2023 నుంచి 

దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2023

వెబ్‌సైట్‌:  http://www.sailcareers.com/


సన్నద్ధత ఇలా

పరీక్షకు నెల రోజుల ముందే సిలబస్‌లోని అన్ని అంశాలూ పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకోవాలి. 

జనరల్‌ నాలెడ్జ్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మార్కెట్‌లో అందుబాటులో ఉండే పుస్తకాలను చదువుకోవచ్చు. 

బ్యాంక్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీల పాత ప్రశ్నపత్రాలను సాధించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 

నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాన్ని పూరించగలగాలి. మొదట్లో ఇది సాధ్యంకాకపోయినా సాధన చేసేకొద్దీ అలవాటు అవుతుంది. 

ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటికి అదనపు సమయాన్ని కేటాయించాలి. 

నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ గేట్‌ తుది సన్నద్ధత

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్‌ (చివరి తేదీ: నవంబరు 28, 2023)

Posted Date : 02-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.